కార్గిల్లో సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే..!
కార్గిల్ భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశం-పాకిస్తాన్ యుద్ధానికి ప్రసిద్ధి చెందింది. 1999 జూలై 26న భారత సైన్యం కార్గిల్ నుంచి పాక్ సైనికులను తరిమి కొట్టి విజయ పతాకాన్ని ఎగురవేసింది. అదే రోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈసారి దేశం 24వ కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకోబోతోంది. ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటారు. పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గౌరవించే రోజు ఇది. ముఖ్యంగా భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం అయినప్పటికీ, ఇక్కడ కొన్ని ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయి. కాబట్టి కార్గిల్ను సందర్శించినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలను చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ఈ ప్రాంతంలో చాలా చారిత్రక ప్రదేశాలున్నాయి. రండి అవెంటో చూద్దాం.

కార్గిల్ వార్ మెమోరియల్
కార్గిల్లో ఉన్న ద్రాస్ వార్ మెమోరియల్ను 1999లో కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల జ్ఞాపకార్థం భారత సైన్యం నిర్మించింది. ఈ వార్ మెమోరియల్లోని గులాబీ రాళ్లపై 'ఆపరేషన్ విజయ్'లో అమరులైన సైనికుల పేర్లు రాసి ఉన్నాయి. దీనిని విజయపథం అని కూడా అంటారు. పింక్ ఇసుకరాయి గోడ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. "మనోజ్ పాండే గ్యాలరీ" ఆ సమయంలో తీసిన ఛాయాచిత్రాలు, యుద్ధ సమయంలో కనుగొనబడిన ఆయుధాలు, ఫిరంగిని చూపుతుంది. వార్ మెమోరియల్ లోపల అమర్ జవాన్ జ్యోతి నిరంతరం కాలిపోతుంది. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంది. ఇందులో కార్గిల్ యుద్ధం మొత్తం కథను అమితాబ్ బచ్చన్ వాయిస్లో వివరించబడుతుంది.

డ్రాస్ వ్యాలీ
జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలోని కార్గిల్ జిల్లాలో ఉన్నడ్రాస్ వ్యాలీ భారతదేశంలో అత్యంత శీతల ప్రదేశం. దీనిని లడఖ్ గేట్వే అని కూడా అంటారు. డ్రాస్ సముద్ర మట్టానికి 10,800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. వేసవిలో కూడా ఇక్కడ వెచ్చని బట్టలు లేకుండా జీవించలేరు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -20 డిగ్రీల వరకు ఉంటుంది. సెప్టెంబరు నుండి అక్టోబర్ వరకు ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 23 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఈ లోయను సందర్శించడానికి ఉత్తమమమైన సమయం ఇది.

సురు వ్యాలీ
సురు వ్యాలీ అందమైన, చాలా ప్రశాంతమైన ప్రదేశం. సురు వ్యాలీ లడఖ్లోని ఒక ప్రదేశం. ఈ లోయలో సుమారు 25,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు టిబెటన్, బౌద్ధ సంఘాల వారసులుగా భావిస్తున్నారు. మంచు పర్వతాలతో కప్పబడిన సురు లోయను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది.
రంగడుమ్ మొనాస్టరీ
లడఖ్లోని కార్గిల్ జిల్లా, జన్స్కార్లో జాతీయ స్మారక చిహ్నం హోదాను పొందిన రంగడుమ్ బౌద్ధ విహారం (గొన్పా) చూడదగ్గ అందమైన ప్రదేశం. వందల సంవత్సరాల క్రితం కార్గిల్ నుండి 127 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంస్కార్ సురు లోయలో నిర్మించబడిన ఈ మఠం నేడు సన్యాసులకు నిలయంగా ఉంది. ఇది 18వ శతాబ్దంలో టిబెటన్ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించబడింది. బౌద్ధమతానికి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలు, శిల్పాలు, మాన్యుస్క్రిప్ట్లు ఈ ఆశ్రమంలో ఉన్నాయి. శతాబ్దాలుగా ఈ ఆశ్రమంలో నివసిస్తున్న సన్యాసులు లడఖ్లో బౌద్ధమత ప్రచారంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఈ మఠం 14436 అడుగుల ఎత్తులో కొండపై నిర్మించిన కోటలా ఉంటుంది. ఇక్కడ నుండి ఒక వైపున బేర్ కొండలు, మరొక వైపు మంచుతో కప్పబడిన పర్వతాలను చూడొచ్చు.



Click it and Unblock the Notifications













