దేశంలోనే ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం ఏపీలో ఉంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడికి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండను ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. నిత్యం ఇక్కడ గోవిందుని నామస్మరణ వినొచ్చు. భక్తుల రద్దీకి అనుగుణంగానే ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.
అలాగే తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమం ఉండనే ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ఉత్సవాల గురించి ఆలయ అధికారులు భక్తులకు ముందుగానే తెలియజేస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా వచ్చే నెలలో జరగబోయే కార్యక్రమాలు, ఉత్సవాల గురించి ముందే ప్రకటిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల సన్నిధిలో ఆగస్టు నెలలో జరిగే విశేష ఉత్సవాల షెడ్యూల్ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలేంటో చూసేద్దాం..

ఉత్సవాల షెడ్యూల్..
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాలు ఆగస్టు 4వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4వ తేదిన శ్రీ చక్రత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 7వ తేదిన ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేసే కార్యక్రమం ఉంటుంది. ఇక, ఆగస్టు 9వ తేదిన గరుడ పంచమి సందర్భంగా తిరుమల సన్నిధిలో శ్రీవారి గరుడ సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడ సేవ ఉండనుంది. ఆగస్టు 19వ తేదిన శ్రావణ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమం ఉంటుంది.
ఆగస్టు 10వ తేదిన కల్కి జయంతి, 13వ తేదిన తరిగొండ వెంగమాంబ వర్ధంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఆగస్టు 14న శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంతో పాటుగా స్మార్త ఏకాదశి కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అదే రోజు నుంచి తిరుమల స్వామివారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 16వ తేదిన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అదే రోజున నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 19వ తేదిన శ్రావణ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమం ఉంటుంది. రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి కార్యక్రమాలను కూడా ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

శ్రీకృష్ణాష్టమి పర్వదినం...
ఆగస్టు నెలలో జరిగే విశేష ఉత్సవాలకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. సాధారణ రోజుల్లోనే ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక, ప్రత్యేక ఉత్సవాలు అంటే భక్తులు బారులు తీరుతారు. ఈ సమయంలో ఆలయానికి విచ్చేసే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేయనున్నారు. ఆగస్టు 20న శ్రీవారు విఖనసాచార్య స్వామివారి సన్నిధికి వేంచేస్తారు.
ఆగస్టు 27వ తేదిన శ్రీకృష్ణాష్టమి పర్వదినం ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆగస్టు 28వ తేదిన శ్రీవారి శిక్యోత్సవం కార్యక్రమం జరగనుంది. తిరుమలకు వచ్చే స్వామివారి భక్తులు ఈ కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.



Click it and Unblock the Notifications













