తక్కువ బడ్జెట్లో ఈ ప్రదేశాలను ఆస్వాదించవచ్చు
ప్రతి ఒక్కరూ తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలని కోరుకుంటారు. ముఖ్యంగా నిత్యం ప్రయాణాలు చేసే వ్యక్తులు. అలాంటి ప్రదేశాలు మన దేశంలోనూ ఉన్నాయి. ఇక్కడ మీరు చాలా తక్కువ ఖర్చుతో సులభంగా అన్ని అందాలను ఆస్వాదించవచ్చు. మరి మీ బడ్జెట్లో అలాంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారా!

రిషికేశ్
మీరు ఒంటరిగా విహారయాత్ర ప్లాన్ చేసుకున్నా లేదా స్నేహితులతో బృందంగా విహరించాలి అనుకున్నా రిషికేశ్ సందర్శించడం మర్చిపోవద్దు. రిషికేశ్ ఢిల్లీకి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ క్యాంపింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మీ స్నేహితులతో ఇక్కడకు వెళితే, చాలా తక్కువ డబ్బుతో విహరయాత్రను విజయవంతగా ముగించుకుని తిరిగి రావచ్చు. ఇక్కడ అనేక సందర్శనీయ ప్రదేశాలతోపాటు విడిది కేంద్రాలు ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ హాస్టల్ సౌకర్యాలను కూడా పొందవచ్చు. తీరప్రాంతంలో చౌకగా క్యాంపింగ్ చేయాలనుకుంటే, కేవలం ఐదు వందల రూపాయలతో ఆ అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఈ క్యాంప్ ఫైర్లో ఆహారం ఉచితంగా లభిస్తుంది.

మెక్లీడ్గంజ్
మీరు పర్వత శిఖరాలను తాకాలని ఆశపడితే, మెక్లీడ్గంజ్ మైదానాలకు వెళ్లొచ్చు. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇవి సందర్శించడానికి చాలా ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు, ట్రెక్కింగ్ చేయాలనుకుంటే, ఈ ప్రదేశం ఉత్తమమైనదిగా పేరుగాంచింది. తక్కువ బడ్జెట్ ప్రయాణం చేసి, ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించాలనుకునేవారికి ఈ మెక్లీడ్గంజ్ కంటే చౌకైన ప్రదేశం బహుశా ఉండకపోవచ్చు. వారాంతాల్లో కూడా ఇక్కడకు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ విడిదితోపాటు ఆహారం రోజుకు 1000 రూపాయలకు మించి ఉండదు.

ఆగ్రా
ఢిల్లీ నుండి ఆగ్రా కేవలం కొన్ని గంటల దూరంలో ఉంది. మీరు ఇప్పటి వరకు తాజ్ మహల్ అందాలను చూడకపోతే, ఖచ్చితంగా ఆగ్రాను సందర్శించాలి. ఢిల్లీ నుండి ఆగ్రా సుమారు 3-4 గంటల దూరంలో ఉంది. మీరు 100 రూపాయల రైలు టికెట్ తీసుకొని సులభంగా ఆగ్రా చేరుకోవచ్చు. ఆగ్రా పర్యటనను కేవలం ఒక రోజులో పూర్తి చేయవచ్చు. ప్రేమికుల విహార కేంద్రగా ఆగ్రా ప్రసిద్ధి పొందింది.

అమృత్సర్
అమృత్సర్ సందర్శించడానికి చౌకైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ గురించి వినే ఉంటారు. గోల్డెన్ టెంపుల్ లోపల, విశ్రాంతికి మరియు తినడానికి ఏర్పాట్లు నిత్యం అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా నాణ్యమైన, రుచికరమైన ఆహారం ప్రసాదం రూపంలో ఉచితంగా ఇక్కడ అందిస్తారు. ఎక్కువ ప్రయాణాలను ఇష్టపడేవారికి అమృత్సర్ సరైన ఎంపిక. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కాకుండా చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

మధుర
మధుర వెళితే మధుర మరియు బృందావనం కలిపి సందర్శించవచ్చు. ఢిల్లీ నుండి దాదాపు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ప్రయాణం కూడా చాలా చౌక. ఇక్కడ సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మధురలో విడిది చేయడానికి అద్దె దాదాపు రోజుకు 400 రూపాయలు ఉంటుంది. తినేందుకు ఆహారం కూడా చాలా చౌకగా దొరుకుతుంది. అధ్యాత్మిక చింతన కోరుకునేవారు కుటుంబసమేతంగా విహరించేందుకు మధుర పర్యటన సరైన ఎంపిక.



Click it and Unblock the Notifications













