ఆనాటి చరిత్రకు నిదర్శనం... ఈ పెనుగొండ కోట..
ఆంధ్రప్రదేశ్లో సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ పురాతన దేవాలయాలతో పాటు, చారిత్రక కట్టడాలు, కోటలు కూడా ప్రసిద్ధి చెందాయి. అందులో పెనుగొండ కోట ఒకటి. ఇది విజయనగర సామ్రాజ్యం కాలం నాటిది. విజయనగర సామ్రాజ్యములో పెనుగొండ రెండవ రాజధానిగా ఉండేది. మొదటి రాజధాని ప్రస్తుతం ఉన్న హంపి ఉండేది. ఈ పెనుగొండ కోట శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండలో ఉంది. ఈ కోట అనంతపురంలోని హిందూపురం నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న గిరి దుర్గాలలో ప్రఖ్యాతి గాంచింది. దీనిని పెనుగొండ ఘనగిరి అని కూడా పిలుస్తారు.

ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు..
ఈ పెనుగొండలో విజయనగర ఆనవాళ్లు ఇప్పటికీ మనకి తారసపడతాయి. అందులో ముఖ్యంగా పెనుగొండ కోట, ఎర్రమంచి గేటు, పెనుగొండ కొండ, దేవాలయాలు ప్రధానమైనవి. ఈ కోటలో పర్యాటకులు వీక్షించేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి నరసింహాస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. హిందూ, ముస్లిం రెండు మతాల మధ్య ప్రశాంతత, శాంతికి నిజమైన చిహ్నం ఈ కోట. పెనుగొండ కోట లోపల అనేక మసీదులు, దేవాలయాలు ఉన్నాయి. కోట లోపల ఉండే షేర్ ఖాన్ మసీదు ఎంతో ప్రసిద్ధమైనది. అంతే కాకుండా, ఇక్కడ 16వ శతాబ్దంలో నిర్మించిన ప్యాలెస్, గగన్ మహల్ ప్యాలెస్ పర్యాటకులను చరిత్ర పుటల్లోకి తీసుకెళ్తుంది. ఇంకా ఇక్కడ బాబయ్య దర్గా కూడా ఎంతో పేరుగాంచింది. బహుళ మతాల మధ్య సామరస్యం, ఐక్యతను ప్రదర్శించేందుకే ఈ బాబయ్య దర్గాను నిర్మించారు. ఇది కూడా ఒక రాజభవనంవలె ఉంటుంది.

300కు పైగా ఆలయాలు..
పెనుగొండ శతృదుర్భేద్యమైన దుర్గం. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ సుమారు 300 కు పైగా ఆలయాలు కట్టించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడే పూజ చేసేవారని, తిరుపతి వెంకటేశ్వరుణ్ని దర్శించుకొనేందుకు వెళ్ళేటప్పుడు ఇది వారికి విడిది కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది. ఈ కోట లోపల ఉండే చెరువు, నరసింహ స్వామి ఆలయం, కోనేరు వంటివి ఇక్కడ చూడదగినవి. బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

శ్రీ కృష్ణదేవరాయల జననం ఇక్కడే..
శ్రీ కృష్ణదేవరాయలు తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు, తిమ్మరుసు గోవింద రాజులు చంద్రగిరిలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం పెనుగొండలో జన్మించారు. శ్రీ కృష్ణ దేవరాయల విద్యలు, బాల్యం అన్నీ పెనుగొండ, చంద్రగిరి, విజయనగరాలలోనే జరిగాయి. కృష్ణదేవరాయలు, విజయనగరం వలే ఏడు కోటలను ఇక్కడ నిర్మించాడు. వేసవి విడిదిగా , వసంతోత్సవాల స్థావరంగా ఎక్కువ కాలము పెనుగొండ సేవలందించింది. పెనుగొండలో మహామంత్రి తిమ్మరసు బందీఖానా చూడదగ్గది. గగన మహల్, గాలిగోపురం, కుంభకర్ణ విగ్రహం, పాంచ్ బీబీ దర్గా, జామియా మసీద్, షేర్ ఖాన్ మసీద్, బాబా ఫక్రుద్దీన్ దర్గా, కాళేశ్వర స్వామి ఆశ్రమాలు ఇక్కడ సందర్శించదగిన ప్రదేశాలు..
ఎలా చేరుకోవాలి..
పెనుగొండ అనంతపురం జిల్లాలో, బెంగళూరు - హైదరాబాద్ జాతీయరహదారి మార్గంలో కలదు. కాబట్టి అనంతపూర్ నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తే పెనుగొండ చేరుకోవచ్చు. హిందూపూర్ నుండి 36 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ధర్మవరం నుండి 55 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెనుగొండ చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












