కళియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు బారులు తీరుతుంటారు. ఇక, తిరుమల ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమల ఆలయంలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నేడు ప్రధాన ఘట్టమైన గరుడోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి అర్థరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలను నిషేధించటంతో పాటు, కొండ కింద అలిపిరి వద్ద వాహనాల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. అయితే, కొండపైకి వెళ్లేందుకు టూవీలర్స్, టాక్సీలను నిషేధించారు. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని ఆలయ ఈవో వివరించారు. ఎంతో ప్రత్యేకంగా జరిగే ఈ గరుడ వాహనసేవకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
కొండపైకి బస్సులు..
స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ముఖ్య కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితోపాటు తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు వచ్చేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు. భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఏపీఎస్ ఆర్టీసీ 400కు పైగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ బస్సులను 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో వివరించారు. మాడ వీధుల గ్యాలరీల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను తిలకించేందుకు వీలుగా ఉందని అధికారులు తెలిపారు.

టీవీ స్క్రీన్స్..
భక్తుల కోసం ముఖ్యమైన కూడళ్లలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇందుకోసం సుమారు 1200 మంది టీటీడీ విజిలెన్స్, 3800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణి చేస్తామని అన్నారు. గరుడ సేవ రోజున మాడవీధుల్లో బయట ఉన్న భక్తుల కోసం ప్రత్యేకంగా టీవీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.. భక్తుల సౌకార్యార్థం మెడికల్ క్యాంపులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

ప్రత్యేక పార్కింగ్ సదుపాయం..
స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కొండపై రద్దీని నియంత్రించేందుకు సైతం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నేటి అర్థరాత్రి నుంచే ఘాట్ పైకి ద్విచక్రవాహనాలను అధికారులు నిషేదించారు. ఆలయ భద్రతా సిబ్బంది, వాటి పార్కింగ్ కోసం అలిపిరి పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చే భక్తులకు, స్థానికుల వాహనాలకు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యం కేటాయించారు.



Click it and Unblock the Notifications













