ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రణాళికను ప్రవేశపెట్టంది. ఆ వివరాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్రెడ్డి వెల్లడించారు. పర్యాటక ఆసక్తి ఉన్నవారు సందర్శనీయ ప్రాంతాలను ఆస్వాదించడంతోపాటు ఆధ్యాత్మికతను సొంతం చేసుకునేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఆ సరికొత్త ప్రణాళిక విశేషాలు తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య దూరం ఇప్పుడు దగ్గర కానుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తొలి దశలో భాగంగా విజయవాడ కేంద్రంగా మూడు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లను రూపొందించింది ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ. రెండో దశలో విశాఖ నుంచి మరో మూడు సర్క్యూట్లను ప్రతిపాదిస్తున్నట్లు అధికారులు వెళ్లడించారు. పర్యాటకులకు అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చులో పుణ్యక్షేత్రాల సందర్శనను అందుబాటులోకి తీసుకురానుంది.
సర్క్యూట్లో ఏడు నుంచి పది దేవాలయాలు
ఒకే ప్యాకేజీలో గైడ్తో పాటు రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ చేశారు. ఒక్కో సర్క్యూట్లో ఏడు నుంచి పది దేవాలయాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి భక్తుడు సంతృప్తికరంగా, సురక్షితంగా ఆలయాలను సందర్శించేలా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. పురాణ ఇతిహాసాలను గైడ్ల ద్వారా క్లుప్తంగా భక్తులకు తెలియజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆలయాల విశిష్టతతోపాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని పరిచయం చేసేలా ఈ టూర్ ఉండనుంది. ఇందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తయినట్ల సమాచారం. అనుకున్నట్లుగానే ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ సరికొత్త టూర్ ప్లాన్ను అమలు చేసినట్లయితే ఇది ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులకు సదవకాశమని భావిస్తున్నారు భక్తులు.
తొలి దశలోని ఆధ్యాత్మిక సర్క్యూట్లు..
విజయవాడ-తిరుపతి: విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామి, తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుచానూరు, కాణిపాకం.
విజయవాడ-శ్రీశైలం: ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి.
విజయవాడ-సింహాచలం: ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, అన్నవరం, లోవ తలుపులమ్మ, పిఠాపురం శక్తి, దత్తాత్రేయపీఠం, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, ర్యాలి లక్ష్మీజగన్మోహినీ కేశవస్వామి, సింహాచలం.
రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు..
విశాఖ-శ్రీకాకుళం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రామతీర్థం.
విశాఖ-తిరుపతి: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుచానూరు, కాణిపాకం.
విశాఖ-శ్రీశైలం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి ఉన్నాయి.
ఈ జాబితాలో ఉన్న ఆలయాలను సందర్శించడం ద్వారా అటు ఆధ్యాత్మికను చేరువ చేస్తూ.. మరోవైపు పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా ప్రణాళికలు వేశారు అధికారులు. దూర ప్రాంతాలను బట్టీ భక్తులకు అందుబాటులో ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. మరెందుకు ఆలస్యం పర్యాటక శాఖ కల్పిస్తోన్న ఈ సదవకాశాన్నీ మీరూ సద్వినియోగం చేసుకోండి.