ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు కోసం అన్నప్రసాదం ప్రారంభించారు. ఇక్కడికి విచ్చేసే భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది.
ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్17 నుంచి 25వ తేదీ వరకు బ్రహోత్సవాలు జరగనున్నాయి. ఈ వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ఎంతో వైభవంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు కూడా ఏర్పాటు చేశారు.
ఇక్కడికి వచ్చే భక్తుల కోసం నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ అందిస్తున్నారు. ఎండ వేడిమి నుండి భక్తులకు ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు, కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 7 గంటలకు టిఫిన్, ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంటల వరకు రుచికరమైన అన్నం, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ, బెల్లం పొంగలి వంటి వాటిని అందిస్తారు. ఇందుకోసం దాదాపు 50 మంది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం విభాగం సిబ్బంది పనిచేస్తున్నారు.

ఒంటిమిట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 18న అంటే నేడు ఉదయం వేణుగానాలంకారము, సాయంత్రం హంస వాహనం కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 19న ఉదయం వటపత్రశాయి అలంకారము, సాయంత్రం సింహ వాహన సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 20న ఉదయం నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం హనుమత్సేవ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 21న ఉదయం మోహినీ అలంకారము, సాయంత్రం గరుడసేవ కార్యక్రమం ఉంటుంది.
ఏప్రిల్ 22న ఉదయం శివధనుర్భంగాలంకారము, సాయంత్రం కళ్యాణోత్సవము/ గజవాహనంపై స్వామి వారి దర్శనం ఉంటుంది. ఏప్రిల్ 23న ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 24న ఉదయం కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం అశ్వవాహనం. ఏప్రిల్ 25న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం. ఏప్రిల్ 26న సాయంత్రం పుష్పయాగం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 22న శ్రీ సీతారాముల కల్యాణం...
ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 22న శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది. కళ్యాణం సందర్భంగా ఆలయంలో బుధవారం తలంబ్రాల ప్యాకింగ్ను ఆలయ జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తలంబ్రాలను తీసుకొచ్చామని ఆలయ అధికారి తెలిపారు.
తలంబ్రాల ప్యాకింగ్ శ్రీవారి సేవకులతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏప్రిల్ 13న పుసుపు దంచే కార్యక్రమం నిర్వహించామన్నారు. కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు కర్నూలు, రాజమండ్రి నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులు వచ్చినట్లు ఆయన తెలిపారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నట్లు వివరించారు.



Click it and Unblock the Notifications













