వారణాసిలో గంగా నది ఉధృతి ఈ ఉదయం నుంచి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, చాలా ఘాట్లు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఘాట్ల మెట్ల వద్దకు ప్రజలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, బోటింగ్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. సాయంత్రం వేళ జరిగే ప్రసిద్ధ గంగా హారతిని ఎత్తైన వేదికలపై నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ రోజు, అంటే సెప్టెంబర్ 9న కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే భక్తులు కాస్త త్వరగా ఆలయానికి చేరుకోవడం మంచిది, ఎందుకంటే దర్శనానికి తక్కువ సమయం మాత్రమే లభించే అవకాశముంది.
గడిచిన వారంలో గంగా నది హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించడంతో నదీ తీర ప్రాంతాల్లో అధికారులు తీవ్ర ఆంక్షలు విధించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం.. ఇక్కడ 70.26 మీటర్లను హెచ్చరిక స్థాయిగా, 71.26 మీటర్లను ప్రమాద స్థాయిగా పరిగణిస్తారు. ఆదివారం నాటికి నీటిమట్టం 69.61 – 69.76 మీటర్ల మధ్యకు చేరి నిదానంగా తగ్గుతోంది. అయితే ఘాట్ల మెట్లు మాత్రం ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. నీరు వెనక్కి తగ్గుతుండటంతో ప్రముఖ ఘాట్ల వద్ద భారీగా మట్టి చేరుతోంది, దీంతో పారిశుధ్య పనులకు మరింత సమయం పట్టేలా ఉంది.

వారణాసి ఘాట్ల లేటెస్ట్ అప్డేట్: బోటింగ్, గంగా హారతి, దర్శనం సమాచారం ఇదే!
సెప్టెంబర్ 2 నుంచి ఘాట్ల వద్ద బోటింగ్ సేవలు నిలిచిపోయాయి. ఇవి మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులు ఇంకా ప్రకటించలేదు. నది ఒడ్డున మెట్లపై కూర్చోవడం లేదా ఉధృతంగా పారే నీట్లోకి వెళ్లడం వంటివి అస్సలు చేయవద్దు. ఇక దశ అశ్వమేధ ఘాట్ వద్ద జరిగే గంగా హారతిని మేడలపై లేదా ఎత్తైన ప్లాట్ఫారమ్లపై నిర్వహిస్తున్నారు. ఇక్కడ పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉన్నందున ప్రవేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం నగరం వైపు ఉండే కారిడార్ గేట్లను ఉపయోగించండి, అలాగే మీ వెంట ఖచ్చితంగా ఫోటో గుర్తింపు కార్డు (Photo-ID) ఉంచుకోండి. రద్దీగా ఉండే రోజుల్లో సుగమ దర్శనం టికెట్లు తీసుకోవడం మేలు.
స్థానిక ప్రయాణాల కోసం వారణాసి కాంట్ లేదా అస్సీ ఘాట్ ప్రాంతాల నుంచి ఈ-రిక్షాలను ఎంచుకోవడం ఉత్తమం. లోతట్టు నదీతీర వీధులు, వరుణ నది వైపు వెళ్లే మార్గాలను వీలైనంత వరకు నివారించండి. కాంట్, సిగ్రా లేదా లంక-బీహెచ్యూ (Lanka-BHU) వంటి ఎత్తైన ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. హోటల్ బుక్ చేసుకునే ముందే విద్యుత్, లిఫ్ట్, పార్కింగ్ వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. జారకుండా ఉండే వాటర్ప్రూఫ్ చెప్పులు, ఒక చిన్న టార్చ్ లైట్ మీ వెంట ఉంచుకోండి. ప్రయాణానికి కొంత అదనపు సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. ఈ రోజు వాతావరణం మేఘావృతమై స్వల్ప వర్షం కురిసే అవకాశం ఉంది, కాబట్టి రహదారులు జారే ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులు తమ ప్లాన్లను కాస్త మార్చుకోవడం ద్వారా హాయిగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఉదయమే త్వరగా బయలుదేరడం, కారిడార్ గేట్లను ఉపయోగించడం మంచిది. నదీతీరంలో ఎక్కువ సేపు గడపడం కంటే ఆలయ దర్శనానికే ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే జిల్లా యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. నీటిమట్టం సాధారణ స్థితికి వచ్చి, ఘాట్ల వద్ద మట్టిని పూర్తిగా తొలగించిన తర్వాతే బోటింగ్ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ పారిశుధ్య పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.



Click it and Unblock the Notifications











