ఈ రోజుల్లో శ్రీశైలం పర్యటనకు వెళ్లాలనుకుంటే కాస్త ముందస్తు ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) సూచనల మేరకు సెప్టెంబర్ 7 నుంచి జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, ఈ వారం కృష్ణా నదికి ఇన్ ఫ్లో భారీగానే ఉంది. నీటి విడుదల సమయంలో డ్యామ్ వ్యూ పాయింట్ల వద్ద నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఇక అటవీ శాఖకు చెందిన ఈకో టూరిజం సెప్టెంబర్ 30 వరకు మూసివేసే ఉంటుంది. ఘాట్ రోడ్డుపై ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. కాబట్టి చెక్ పోస్టుల వద్ద వేచి ఉండే అవసరం లేకుండా ప్రయాణం సాగాలంటే ఉదయమే బయలుదేరి, సమయానికి తిరిగి రావడం మంచిది.
మన్ననూర్ – దోమలపెంట చెక్ పోస్టుల సమయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ రెండు చెక్ పోస్టుల వద్ద వాహనాలను కఠినంగా తనిఖీ చేస్తారు. స్పీడ్ గన్లు కూడా ఉపయోగిస్తున్నారు, ఆలస్యంగా వస్తే వాహనాలను వెనక్కి పంపించేస్తారు. అందుకే, మన్ననూర్ గేట్లు తెరిచే సమయానికి అక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఉదయం 4:30 నుంచి 5:30 గంటల మధ్యలో బయలుదేరడం ఉత్తమం. మన్ననూర్ దాటే ముందే ఫ్యూయల్ నింపుకోండి, సిగ్నల్స్ సరిగ్గా ఉండవు కాబట్టి ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, చిన్న చిన్న ఖర్చుల కోసం కొంత నగదు చేతిలో ఉంచుకోండి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వంతెనలు, మలుపుల వద్ద వాహనాలు ఆపవద్దు. వ్యూ పాయింట్ల దగ్గర తనిఖీల వల్ల కాస్త సమయం పట్టవచ్చు.

శ్రీశైలం ట్రావెల్ అలర్ట్: కృష్ణా ఇన్ ఫ్లోస్, వ్యూ పాయింట్లు, రోప్వే, బోటింగ్ వివరాలు
భారీగా వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని డ్యామ్ వ్యూ పాయింట్ల వద్ద అధికారులు భద్రతను పెంచారు. ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. పాతాళగంగ టూరిజం రోప్వే సేవలు ఆగస్టు 28 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు నిటారైన మెట్లు ఎక్కడం కంటే ఈ రోప్వే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, వాతావరణం అనుకూలిస్తేనే బోటింగ్ సేవలు నడుస్తాయి. కాబట్టి పర్యటన రోజు ఉదయమే బోటింగ్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ప్లాన్ చేసుకునే ముందు APTDC బోటింగ్ పోర్టల్ లేదా స్థానిక కౌంటర్ల ద్వారా వివరాలు తెలుసుకోవడం మంచిది.
శ్రీశైలం దర్శనం వేళలు.. వీక్డేస్లో ప్లాన్ చేసుకోండిలా!
హైదరాబాద్ నుంచి ఉదయం 4:30 నుంచి 5:30 గంటల మధ్య బయలుదేరితే ఉదయం 10 గంటలకల్లా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. బయలుదేరే ముందు అధికారిక పోర్టల్లో బ్రేక్ దర్శనం, స్పెషల్ ఎంట్రీ టికెట్ల వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి. పూజల సమయాల్లో దర్శనాలు కొద్దిసేపు నిలిపివేస్తారు, దీనివల్ల మధ్యాహ్నం వేళ దర్శనానికి సమయం తగ్గే అవకాశం ఉంది. అందుకే ముందుగా స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని, ఆ తర్వాత వ్యూ పాయింట్లు, పాతాళగంగ పర్యటన కవర్ చేయండి. ఇక సాయంత్రం 5:30 నుంచి 6 గంటల కల్లా తిరుగు ప్రయాణం మొదలుపెడితే, చెక్ పోస్ట్ గేట్లు మూసేలోపే దోమలపెంట దాటవచ్చు.
TSRTC/APSRTC బస్సు సేవలు.. తిరుగు ప్రయాణ సమయాలు
హైదరాబాద్లోని MGBS, ఎల్బీనగర్లతో పాటు విజయవాడ PNBS నుంచి శ్రీశైలానికి నిరంతరం బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాత్రి వేళ బయలుదేరే బస్సులు అటవీ ప్రాంత చెక్ పోస్టుల వద్ద ఆగిపోయి, ఉదయం 6 గంటల తర్వాతే ముందుకు సాగుతాయి. కాబట్టి దర్శన సమయాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఉదయమే బయలుదేరి, సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య తిరుగు ప్రయాణమయ్యేలా చూసుకోవడం బెటర్. ఇక శ్రీశైలం బస్ స్టాండ్ చేరుకున్నాక లోకల్ ఆటో సదుపాయాల గురించి ముందే విచారించుకోవడం మంచిది.
| రూట్ | తొలి బస్సు | చివరి బస్సు | ఆర్టీసీ వివరాలు |
|---|---|---|---|
| హైదరాబాద్ → శ్రీశైలం | 02:30 | 22:25 | TGSRTC; MGBS, ఎల్బీనగర్లలో పలు బోర్డింగ్ పాయింట్లు. |
| విజయవాడ → శ్రీశైలం | 00:20 | 23:59 | APSRTC; PNBS, నగరంలో ఇతర బోర్డింగ్ పాయింట్లు. |
ఆర్టీసీ బస్సులకు కూడా అటవీ ప్రాంత నిబంధనలు వర్తిస్తాయి. ఆలస్యమైతే మన్ననూర్ - దోమలపెంట వద్ద నిలిపివేస్తారు. కాబట్టి వీలైనంత వరకు ఉదయపు స్లాట్లనే బుక్ చేసుకోండి. ఘాట్ రోడ్డు ప్రయాణంలో వర్షం పడే అవకాశం ఉన్నందున రెయిన్ గేర్ దగ్గర ఉంచుకోండి. మన్ననూర్ దాటే ముందే వాహనంలో ఇంధనం పూర్తిస్థాయిలో నింపుకోవడం, నెట్వర్క్ లేని ప్రాంతాల కోసం ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంచుకోవడం మర్చిపోవద్దు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా దర్శనం పూర్తి చేసుకోవాలంటే వ్యూ పాయింట్ల వద్ద పోలీసులు ఇచ్చే సూచనలను ఖచ్చితంగా పాటించండి.



Click it and Unblock the Notifications













