తిరుపతి అనగానే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి అందరికీ గుర్తుకొస్తాడు. ఇక, ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలువైపులా ఉన్న భక్తులు ఇక్కడికి వాలిపోతుంటారు. అయితే, ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా తిరుపతి ఉంది. ఇక్కడ వెలసిన స్వామివారు కూడా ఎంతో ప్రసిద్ధిచెందారు. తెలంగాణ తిరుపతిగా పిలవబడే ఈ ఆలయం మహబూబ్నగర్లో వెలసింది.
దీనిని పాలమూరు తిరుపతి అని పిలుస్తారు. ఈ దేవాలయం ప్రకృతి మధ్యలో వెలసింది. ఇక్కడి వాతావరణం పర్యాటకులను, భక్తులను మైమరింపజేస్తుంది. ఇక్కడ ఒక్క వెంకటేశ్వరస్వామి మాత్రమే కాకుండా గుట్ట దిగువన అమ్మవారు, అలివేలు మంగతాయారు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఇంకా ఇక్కడ అనేక పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహాలు ఉన్నాయి.

మన్యం కొండ అనే మరో పేరు...
ఈ ఆలయం మహబూబ్ నగర్కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మన్యం కొండ అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనుకాల ఎంతో చరిత్ర ఉంది. వందల ఏళ్ల కిందట ఈ కొండపై మునులు తపస్సు చేసేవారని, అందువల్లే ఈ కొండకు మునులకొండ, మన్యంకొండ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఈ మన్యంకొండ కర్నాటక, రాయచూర్ వెళ్లే జాతీయరహదారి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుడి కనిపిస్తుంది. ఇక, హైదరాబాద్ నుంచి ఈ తిరుపతి కొండకు చేరుకోవాలంటే నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలనుకుంటే మాత్రం ముందుగా మహబూబ్ నగర్ వెళ్లాల్సిందే. అక్కడ నుంచి మన్యంకొండకు వెళ్లడం చాలా సులభం. రైలు మార్గంలో మన్యం కొండ వెళ్లాలనుకునే వాళ్లు మహబూబ్ నగర్, దేవరకద్ర మధ్య ఉన్న కోటకదిర రైల్వేస్టేషన్లో దిగి, అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే కోటకదిరలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే నిలుస్తాయి.

మన్యంకొండ చరిత్ర...
ఈ మన్యం కొండకు చాలా చరిత్రే ఉంది. తమిళనాడులోని శ్రీరంగ పట్టణానికి సమీపంలో అళహరి అనే గ్రామంలో ఉన్న కేశవయ్యకు వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి మన్యంకొండపై నేను వెలిశాను. నువ్వు అక్కడికి వెళ్లి నిత్యం నాకు పూజలు చేయమని చెప్పాడట. స్వామి మాట ప్రకారం కేశవయ్య తన కుటుంబ సభ్యులతోవచ్చి, ఈ కొండకు దగ్గర్లో ఉన్న కోటకదిరిలో స్థావరం ఏర్పరుచుకుని రోజు మన్యం కొండపై స్వామివారికి పూజలు చేసేవాడు. మన్యంకొండలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి, తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి చాలా దగ్గరి పోలికలే ఉన్నాయి. తిరుమల తిరుపతిలో వెలసిని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మెట్లదారి ఉంది.
లేదంటే ఘాట్ రోడ్ ద్వారా కూడా శ్రీవారి దర్శన భాగ్యం కూడా పొందొచ్చు. అలాగే మన్యం కొండలోని ఈ దేవాలయానికి కూడా మెట్ల మార్గం, రోడ్డు మార్గం వంటి రెండుమార్గాలు ఉన్నాయి. భక్తులు ఈ రెండు మార్గాల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శన భాగ్యం పొందుతారు. తిరుమల తిరుపతి ఆలయంలో ఎలా అయితే, వెంకటేశ్వరుని పాదాలను భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారో, మన్యంకొండలో కూడా అలాగే స్వామివారి పాదాలను పూజించడం జరుగుతుంది. మన్యంకొండలోని వేంకటేశ్వరస్వామికి కూడా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడకు వచ్చి, స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు.



Click it and Unblock the Notifications













