విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయం భారతదేశం అని మనందరికీ తెలుసు. ఈ నేలపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారంతో ఎంతో ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల తారసపడే వింత ఆచారాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వింత ఆచారమే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోనూ ఉంది. ఇక్కడ కొలిచే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా తేళ్లను సమర్పిస్తారు. వినడానికి వింతగా ఉన్నా.. ఏన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది, మరెందుకు ఆలస్యం.. కర్నూలులోని ఈ తేళ్ల నైవేద్యం కథేంటో చూసేద్దాం రండి!
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఓ వింత ఆచారం ఉంది. ఇక్కడ కొండ్రాయి కొండ మీద కొండల రాయుడుగా వెలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. నిజానికి, పాములు,తేళ్లు వంటి విషపురుగులను చూస్తే.. ఎవ్వరికైనా హార్ట్బీట్ పెరిగిపోతుంది. భయంతో పరుగులు తీసేవారూ ఉంటారు. అలాంటిది ఏలాంటి భయం లేకుండా వాటిని తాము నమ్మిన దేవునికి నైవేద్యంగా పెట్టడం అంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది మరి. ఏటా శ్రావణమానం మూడవ సోమవారం కోడుమూరు ప్రజలు ఈ వింత ఆచారాన్ని ఏన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. తేళ్లును చేతులతో పట్టుకుని వెంకటేశ్వర స్వామికి కానుకగా అందిస్తున్నారు.
తెళ్లు కుడితే పరిస్థితి ఏంటి?
శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. కోడుమూరు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు చేరుకుంటారు. కొండపై వెలసిన కొండలరాయుడుని దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు. అంతేకాదు, స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు. ఎందుకంటే, ఈ కొండపై ఏ రాయిని కదిపినా తేళ్లు దర్శనమిస్తాయి. దీంతో ఆ తెళ్లను స్వామి వారికి నైవేద్యంగా పెట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని స్ధానికులు చెబుతున్నారు. కొండపై రాళ్లను తొలగించి వాటి కింద దొరికిన తేళ్లను చేతులతో పట్టుకొని గర్భగుడిలో ఉన్న మూల విరాట్టుపై వాటిని విడిచిపెడతారు.

అలా తేళ్లను మూలవిరాట్టుపై విడిచిన తర్వత పూజలు నిర్వహిస్తారు. అయితే తేళ్లను పట్టుకునే క్రమంలో అవి కుడితే పరిస్థితి ఏంటని ఎవరైనా అడిగితే.. కుట్టినా ఏం కాదని భక్తులు చెబుతుంటారు. అలా కుట్టినప్పుడు గర్భగుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షణలు చేస్తే ఏ బాధ, నొప్పి దరిచేరవని భక్తల విస్వాసం. ఎత్తయిన ఈ కొండపైకి చేరుకుని కొండలరాయుడుని దర్శించుకుంటే తమ కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం.
ఎలా చేరుకోవాలి?
కర్నూలు నగరానికి సరిగ్గా 35కిలోమీటర్ల దూరంలో కోడుమూరు ఉంది. ఇక్కడకు వెళ్లేందుకు సిటీ నుంచి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్లే బస్సు ఎక్కాలి. అలా కొండ్రాయి కొండ ప్రాంతంలో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి కొండపైకి కాలినడకన చేరుకోవాలి. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఒక్కసారి ఆ వింత ఆచారాన్ని ప్రయత్నించి చూడండి!



Click it and Unblock the Notifications













