శివ భక్తులకు ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు అమర్నాథ్యాత్ర 2024పై కీలక సమాచారం ఇచ్చింది. యాత్ర ప్రారంభం- ముగింపు తేదీలతో సహా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వివరాలను కూడా ఆలయ బోర్డు ప్రకటించింది. ఇక, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర 2024 జూన్ 29 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 19,2024 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. దక్షిణ కశ్మీరులోని అనంత్నాగ్లో ఉన్న పహల్గామ్కు 48 కిలోమీటర్ల దూరంలో అమరలింగేశ్వరుని శివాలయం వెలసింది.
అమరనాథుని ఆలయాన్ని సందర్శించాలంటే కశ్మీరులోని గండేర్బల్ జిల్లాలో ఉన్న గండేర్బల్ మార్గంలో కూడా ప్రయాణించొచ్చు. ఇక, ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచే ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో పాల్గొనాలనుకునేవారు అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు. వాటి వివరాలను తెలుసుకుందాం పదండి.

రిజిస్ట్రేషన్ ఫీజు..
అమర్నాథ్ యాత్ర 2024 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్కరికి రూ. 150గా నిర్ణయించారు.
అమర్నాథ్ యాత్ర 2024 కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న బ్యాంకు శాఖల ద్వారా ఈ ఫీజును చెల్లించవచ్చు.
ఆన్లైన్లో నమోదు ప్రక్రియ..
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ముందుగా శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు jksasb.nic.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
మెనులో 'ఆన్లైన్ సర్వీస్'పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం I Agree చెక్ చేసి రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ ప్రయాణీకుడు తన పూర్తి సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది.
OTPని నమోదు చేసిన తర్వాత, దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో బదిలీ చేయడం ద్వారా జమ చేయండి.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ట్రావెల్ పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవడం మరచిపోవద్దు.

ఆఫ్లైన్ నమోదు ప్రక్రియ వివరాలు ఇలా ఉన్నాయి...
ఆఫ్లైన్లో నమోదు చేసుకోవాలనుకునేవారు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యెస్ బ్యాంక్ యొక్క 540 శాఖలలో ఈ రిజిస్ట్రేషన్ ప్ర్రక్రియ జరుగుతుంది.
అమర్నాథ్ యాత్ర కోసం, భక్తులకు యాత్ర కోసం వారితో పాటు వచ్చే వ్యక్తుల ఫోటోగ్రాఫ్లు, యాత్రా రిజిస్ట్రేషన్ ఫీజు ప్రయాణీకుడికి రూ. 250, గ్రూప్ లీడర్ పేరు, మొబైల్ ఫోన్ నంబర్, ఇమెయిల్తో సహా చిరునామా అవసరం ఉంటుంది.
పోస్టల్ ఛార్జీలు 1 నుంచి 5 వరకు రూ.50, 6 నుంచి 10 వరకు భక్తులకు రూ.100, 11 నుంచి 15 వరకు రూ.150 చెల్లించాలి. 16 నుంచి 20 వరకు రూ.200 చెల్లించాలి. 21 నుంచి 25 వరకయితే రూ.250 చెల్లించాలి. రూ.26 నుంచి 30 వరకయితే రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా, ఏప్రిల్ 8 తర్వాత ఆరోగ్య ధృవీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది.
ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, పోస్టల్ ఛార్జీలను శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం చీఫ్ అకౌంట్ ఆఫీసర్కు పంపాల్సి ఉంటుంది.
ఈ యాత్ర గురించిన ఇతర ముఖ్య సమాచారం..
వయసు..
13 ఏళ్లలోపు, 70 ఏళ్లు పైబడిన వారు ఈ ప్రయాణంలో పాల్గొనలేరు. వీరితో పాటు 6 వారాల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలు కూడా ఈ ప్రయాణానికి అర్హులు కాదు.
ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి..
అమర్నాథ్ యాత్ర చేయాలనుకునే వారు హెల్త్ సర్టిఫికేట్ లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి వీలుపడదు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత, పవిత్ర గుహ నుండి ఉదయం, సాయంత్రం హారతి ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబడుతుంది. ప్రజలు వెబ్సైట్, యాప్ ద్వారా హారతి కార్యక్రమంలో పాల్గొనేలా చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications













