అడవుల పచ్చదనం చూడాలనుకుంటున్నారా..?? అడవి వాతావరణంలో స్వేచ్చగా సంచరిస్తున్న వన్యప్రాణులను వీక్షించాలని ఉందా?. అయితే, మరీ ఆలస్యం ఎందుకు.. భారత్లో అటువంటి వన్యప్రాణుల కేంద్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా కజిరంగా నేషనల్పార్క్. సుదీర్ఘ వర్షాకాలం అనంతరం ఈ అభయారణ్యం అక్టోబర్ 1న తెరవనున్నారు. ఈ పార్క్ ప్రాముఖ్యతలేంటీ..? ఎక్కడ ఉంది వంటి విషయాలను ఇప్పడు తెలుసుకుందాం.
ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్, రుతుపవన పచ్చదనంతో మరోసారి పర్యాటకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవ్వనుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ జాతీయ అభయారణ్యాన్ని 2024-25 సీజన్ కోసం అక్టోబర్లో తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భారీ వరదలతో అతలాకుతలమైన కజిరంగా నేషనల్ పార్క్ ఇప్పడిప్పుడే ఆ విపత్తు నుంచి కోలుకుంటుంది. ఈ సమయంలో అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నెల రోజుల అనంతరం ఈ అభయారణ్యాన్ని పర్యాటకుల సందర్శనార్థం తెరవాలని అధికారులు నిర్ణయించుకున్నారు.
215 జంతువులు మృతిచెందాయి..
కజిరంగ నేషనల్ పార్క్ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన అడవి. ఇక్కడ ఒక కొమ్ము ఖడ్గమృగం, పులులు, ఇతర జంతువులు కూడా ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ అడవిలో పెద్ద సంఖ్యలో అడవి జంతువులు, అనేక అరుదైన జాతుల పక్షులు కూడా ఉన్నాయి. వచ్చేనెల( అక్టోబర్) 1 నుండి కజిరంగా నేషనల్ పార్క్ తెరుచుకోనుంది. అస్సాంలో కురిసిన కుంభవృష్టి కారణంగా ఈ పార్క్లోని 215 జంతువులు మరణించాయి, వాటిలో 13 ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. వీటితోపాటు మరణించిన అడవి జంతువులలో అనేక జాతుల జింకలు, అడవి పంది, అనేక చిన్న జంతువులు కూడా ఉన్నాయి.

చేరుకోవడం ఎలా?
కజిరంగా జాతీయ అభయారణ్యానికి అన్ని రవాణ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. విమానమార్గం ద్వారా వెళ్లాలనుకునేవారికి కజిరంగా నేషనల్ పార్క్కు సమీప విమానాశ్రయం జోర్హాట్ విమానాశ్రయం. ఇది నేషనల్ పార్క్ నుండి సుమారు 97 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతోపాటు మరో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అదే గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది పార్క్కు సుమారు 217 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు విమానాశ్రయాల నుండి కజిరంగా చేరుకోవచ్చు. అక్కడి నుంచి పర్యాటకులకు టాక్సీలు లేదా అద్దె కార్లు లభిస్తాయి.
రైలు మార్గం: ఇక, రైలు మార్గం ద్వారా ప్రయాణం చేయాలనుకునేవారికి సమీప రైల్వే స్టేషన్ ఫర్క్టింగ్ జంక్షన్. ఇది కజిరంగ నేషనల్ పార్క్కి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గౌహతి, జోర్హాట్ నుండి ఈ స్టేషన్కి నేరుగా రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం: ఇక, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయాలనుకునేవారికి గౌహతి సమీప బస్స్టేషన్. రోడ్డు మార్గంలో, కజిరంగా చేరుకోవడానికి సాధారణంగా 4 నుంచి 5 గంటలు పడుతుంది. అయితే, ఇది ట్రాఫిక్, ఇక్కడి వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా, గౌహతి, తేజ్పూర్, జోర్హాట్ నుండి కజిరంగాకి రాష్ట్ర ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.
సందర్శించేందుకు ఉత్తమ సమయం?
కజిరంగా నేషనల్ పార్క్ ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దీని కారణంగా వేసవి, చలికాలంలో మాత్రమే ఇక్కడ సందర్శించడం ఉత్తమం.. వర్షాకాలం పర్యాటకులకు అనుకూలమైనది కాదు. కాబట్టి మీరు ప్రశాంతంగా, తక్కువ బడ్జెట్లో, రద్దీకి దూరంగా మీ విహారయాత్రను పూర్తి చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. శీతాకాలం కజిరంగా నేషనల్ పార్క్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ అని చెబుతుంటారు. ఈ సమయంలో వాతావరణం తేలికపాటి, పొడిగా మారుతుంది. అంతేకాదు, ఆ సీజన్లో ఇక్కడ అనేక రకాల పక్షులను కూడా వీక్షించొచ్చు. శీతాకాలం సమీపిస్తోంది. కాబట్టి కజిరంగా నేషనల్ పార్క్కు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మరీ.



Click it and Unblock the Notifications













