భక్తులకు శుభవార్త..చార్ధామ్ యాత్రకు షెడ్యూల్ విడుదలయ్యింది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈనెల పది నుంచి ఛార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మొత్తం ఆరునెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు లక్షలాది భక్తులు రానున్న క్రమంలో అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. చార్ధామ్ యాత్ర మే 10 వతేదినుంచి ప్రారంభమై అక్టోబర్ 31 వ తేదీ వరకు కొనసాగుతున్నట్లు ఉత్తరాఖండ్ అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటికే ఈ యాత్రకు వెళ్లేందుకు సుమారు 19 లక్షలమంది యాత్రికులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు పలు షరతులు విధించిన ప్రభుత్వం...
గతేడాది చార్ధామ్ యాత్రకు ఏకంగా 55 లక్షల మంది భక్తులు విచ్చేసినట్లు అధికారులు వివరించారు. గత సంవత్సరం భక్తుల రద్దీ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే ఈ ఏడాది అటువంటి సమస్యలకు తావివ్వకుండా ఉండాలని అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఛార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు పలు షరతులు కూడా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోని రోజువారీగా చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులపై పరిమితిని విధించింది. ఈ యాత్రలో భాగంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. అయితే ఈ ఆలయాలను దర్శించుకునే భక్తులపై పరిమితిని విధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతసంవ్సతరం చార్ధామ్ యాత్రలో నెలకొన్న సమస్యల క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

భక్తులపై పరిమితులు..
ఈ పరిమితిలో భాగంగా చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్ ధామ్లోని బాబా మహాకాల్ను రోజుకు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు బద్రీనాథ్ ధామ్ను రోజుకు కేవలం 16 వేల మంది భక్తులు మాత్రమే దర్శించుకోవాలి. ఇక, గంగోత్రిని అయితే, 11 వేల మంది భక్తులు మాత్రమే దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. యమునోత్రిలో 9 వేల మంది భక్తులు దర్శించుకునేలా ప్రభుత్వం పరిమితులు విధించింది. భక్తుల సంఖ్య ఎక్కువయితే రిషికేష్లో వారిని అడ్డుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళ్లాలనే భక్తులను శ్రీనగర్లోనే ఆపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి శ్రీనగర్లోనే బస చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం రుద్రప్రయాగ్, చమోలి, పిప్పల్కోటి, జోషిమఠ్లలో ఆ తర్వాతి రోజు యాత్ర కొనసాగతుంది.
చార్ధామ్ యాత్ర..
చార్ధామ్ యాత్రలో భాగంగా మొదట భక్తులు యమునోత్రిని దర్శించుకుంటారు. అనంతరం యమునోత్రి నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి ధామ్ను దర్శనానికి బయలుదేరుతారు. ఆ తర్వాత గంగోత్రి దర్శనం ఉంటుంది. గంగోత్రి దర్శనం తర్వాత కేదార్నాథ్ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక, చివరిగా బద్రీనాథ్ ధామ్ను భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది.
వీఐపీలు దర్శనానికి రావొద్దు..
ఈ నెల 10 వ తేదీన చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇక, మొదటి 15 రోజుల్లోనే 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. దీంతో మే 10 వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకు వీఐపీలు ఛార్ధామ్ యాత్రకు రావొద్దని, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.



Click it and Unblock the Notifications













