భారతదేశంలోని ఎక్కువశాతం మంది ప్రజలు సూదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు మార్గాలనే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి తక్కువ ధరతోనూ, సౌకర్యవంతంగానూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో ఆధునాతన రైలు మార్గాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రస్తుతం దేశంలో పరుగులు పెడుతున్నాయి.
ఇక, ఈ ట్రైన్లకు ప్రజల్లో మంచి ఆదరణ కూడా లభించింది. మరిన్ని ఆధునాతన సౌకర్యాలను జోడించి వందేభారత్ సెమీ స్పీడ్ ట్రైన్స్, స్లీపర్ ట్రైన్స్ వంటివన్నీ తీసుకొచ్చారు. ఈ క్రమంలో మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే మెట్రో రైలును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఆ ట్రైన్లు నేటినుంచే పట్టాలెక్కెందుకు సిద్ధంగా ఉన్నాయి.
దేశంలోని తొలి వందే మెట్రో ట్రైన్ సర్వీసు పేరును మార్చినట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. ఇకనుంచి వందే మెట్రో సర్వీసు కాస్త 'నమో భారత్ రాపిడ్ రైల్'గా మారనుంది. ఈ మెట్రో ట్రైన్ అహ్మదాబాద్, భుజ్ మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ కేవలం 5 గంటల 45 నిమిషాల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ మెట్రో ట్రైన్ తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే మొట్టమొదటి వందే భారత్ మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్గా తాజాగా నామకరణం చేశారు. ఇక, ఈ ట్రైన్ నేడు (సెప్టెంబర్ 16న) ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం 4:15 గంటలకు భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా ప్రారంభం కానుంది.

వందే మెట్రో ట్రైన్ ప్రత్యేకతలు..
ఈ తొలి వందే మెట్రో సర్వీసు గుజరాత్లోని అహ్మదాబాద్- భుజ్ నగరాల మధ్య నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ వందే మెట్రో ట్రైన్ పూర్తిగా అన్రిజర్వ్డ్ ఎయిర్ కండీషన్ అని అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 12 కోచ్లు ఉంటాయి. ఈ ట్రైన్లో 1150 మంది కూర్చుని ప్రయాణం చేయొచ్చు.
అంతేకాదు, 2058 మంది నిల్చుని కూడా తమ ప్రయాణం సాగించవచ్చని పశ్చిమ రైల్వే పీఆర్ఓ ప్రదీప్ శర్మ తెలిపారు. అహ్మదాబాద్- భుజ్ మధ్య నడిచే నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ మొత్తం 9 స్టేషన్లలో ఆగుతుంది. 360 కిలోమీటర్ల దూరాన్ని 5:45 గంటల్లోనే చేరుకుంటుంది. గరిష్ఠంగా గంటకు110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం మినహా...
94802 అనే నెంబర్గల భుజ్ -అహ్మదాబాద్ నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ ఆదివారం మినహా ప్రతిరోజూ ఉదయం 05.05 గంటలకు భుజ్ నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఇక, ఈ ట్రైన్ సబర్మతి, చండియోడియా, విరమ్గామ్, ధృంగద్ర, హల్వాడ్, సమఖిలీ, భచౌ, గాంధీధామ్, అంజర్ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్థార్యం ఆగుతుంది. ఇంటర్సిటీ కనెక్టివిటీని పెంచేందుకు ఈ ర్యాపిడ్ ట్రైన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక, ఈ ట్రైన్ రెగ్యులర్ సర్వీస్ సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్ లో ప్రయాణించేందుకు రూ.455 ఖర్చవుతుంది. ఎర్గోనామిక్గా డిజైన్ చేసిన సీట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లు, మాడ్యులర్ ఇంటీరియర్స్ తో ఇది ఇతర మెట్రోల కంటే మెరుగైనదిగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు. వందేభారత్ రైళ్ల తరహాలోనే ఈ ట్రైన్లు కూడా పూర్తి ఏసీ కోచ్లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలను ఇందులో చూడొచ్చు.



Click it and Unblock the Notifications













