నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా పులులను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా జులై 29న పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ టైగర్ సమ్మిట్లో జూలై 29వ తేదీని 'ప్రపంచ పులుల దినోత్సవం'గా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా నేడు (జూలై 29) ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడమే నేటి ముఖ్య ఉద్దేశం. టైగర్స్ డే సందర్భంగా దేశంలోని ప్రసిద్ధిచెందిన టైగర్ సఫారీల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
చాలామందికి పులులను దగ్గరినుంచి చూడాలని చాలా కోరికగా ఉంటుంది. అయితే, అలాంటి సాహసం ఎవ్వరూ చేయరు. పులులను నేరుగా చూసేందుకు టైగర్ సఫారీలకు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి కనిపిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో రోజంతా వాటికోసం వేచి చూసినా మనకు అవి కనిపించవు. చాలామంది పులులను నేరుగా చూసేందుకు జూపార్కులకు వెళ్తుంటారు. కానీ భారత్లో ప్రసిద్దిచెందిన టైగర్ సఫారీలు చాలానే వాటి గురించే నేటి కథనంలో చూద్దాం..

పన్నా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
పన్నా జాతీయ ఉద్యనవనం మధ్యప్రదేశ్ లోని పన్నా, ఛాతర్పూర్ జిల్లాల్లో వెలసింది. ఇది ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఈ పార్క్ ప్రధానంగా పులులు, ఇతర క్షీరదాలను నేరుగా చూసేందుకు అద్భుతమైన చోటు. ఈ పార్కల్లో పందిరి లాగా అల్లుకున్న చెట్లు, చిన్నగా ఎదిగిన గడ్డి భూములు, చెట్ల పొదలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పన్నా టైగర్ రిజర్వ్ లో పులులు మాత్రమే కాకుండా, చిరుతపులులు, ఘరియల్స్, చీతాలు, చింకర వంటి ఎన్నో జంతువులు మనకు దర్శనమిస్తాయి. ఈ ఉద్యానవనంలో మొత్తం 200 జాతుల వలస, నివాస పక్షులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. పన్నా నేషనల్ పార్క్ సందర్శించేందుకు అక్టోబర్ నుంచి జూన్ వరకు ఉత్తమమైన సమయమని చెప్పుకోవచ్చు.
బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్
మధ్యప్రదేశ్లో ప్రసిద్దిచెందిన వన్యప్రాణి అభయారణ్యాలలో బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ ఒకటి. ఈ పార్క్లో పులుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్షంగా టైగర్ సఫారీ ద్వారా పులులను చూడాలనుకునేవారు తప్పకుండా ఈప్రాంతానికి రావాల్సిందే. రాష్ట్రంలోని ఉమారియా జిల్లాలోని వింధ్య పర్వతాలకు సమీపంలో ఈ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఈ పార్క్ లో అనేక రకాల అడవి పందులు, జింకలు, చిరుతలు ఉన్నాయి. ఈ అభయారణ్యంలో పులులను చూడ్డానికి ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉత్తమ సమయం అని చెప్పొచ్చు.

రణథంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్
ఈ వన్యప్రాణి అభయారణ్యం రాజస్థాన్లో ఉంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన టైగర్ రిజర్వ్ లలో ఇది ఒకటి. ఈ పార్క్ వైవిధ్యమైన వన్యప్రాణులకు పేరుగాంచింది. ఇక్కడ అనేక రకాల జంతు జాలాలు పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ పార్క్ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లకు ఉత్తమమైన ప్రదేశమని కూడా చెప్పొచ్చు. ఈ పార్కులో టైగర్ సఫారీతో పులులను నేరుగా చూసేయొచ్చు. రణతంబోర్ సందర్శించాలనుకునేవారు అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్
ఈ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో వెలసింది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ ఉద్యానవనాలలో ఒకటిగా పేరుగాంచింది. హిమాలయాల దిగువన ఉన్న ఈ నేషనల్ పార్క్ అనేక రకాల వన్యప్రాణులకు స్థావరంగా ఉంది. ఇక్కడ పులులతో పాటు, స్లోత్ ఎలుగుబంట్లు, గోరల్స్ చిరుతపులులు, జింకలు వంటివి కూడా ఉన్నాయి. పులులను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు తప్పకుండా ఇక్కడికి వెళ్లాల్సిందే.
కన్హా నేషనల్ పార్క్
ప్రకృతి అందాలతో పాటు పులులను నేరుగా చూడాలనుకునేవారు మధ్యప్రదేశ్లోని కన్హ నేషనల్ పార్క్కు వెళ్లాల్సిందే. ఈ పార్క్ వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలను పర్యాటకులకు అందిస్తుంది. ఈ పార్క్ లో స్వాంప్ జింకల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించేందుకు అనువైన సమయం శీతాకాలం.



Click it and Unblock the Notifications













