దయచేసి వినండి.. ఫుడ్ ఎక్స్ప్రెస్ గుంటూరు రైల్వేస్టేషన్కి వచ్చింది
రైల్ కోచ్ రెస్టారెంట్.. ఇప్పుడిది ట్రెండీగా మారింది. బయటకు వెళ్లేసమయంలో మాత్రమే కుటుంబసమేతంగా నచ్చిన హోటళ్లలో తినాలనుకునేవారికి ఇదోక మంచి వేదిక అనే చెప్పాలి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైల్ కోచ్ రెస్టారెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అది కూడా ఏపీలోని గుంటూరులో దీనిని ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ 'ఫుడ్ ఎక్స్ప్రెస్' రెస్టారెంట్ సామాన్యులను సైతం ఎంతో ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం ఫుడ్ ఎక్స్ప్రెస్ విశేషాలను తెలుసుకుందామా.
ప్రయాణీకులను ఆకర్షించేందుకు ఇప్పుడు రైల్వే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంటూరు రైల్వేస్టేషన్లో ఓ పాత బోగీని అందరిని ఆకట్టుకునే రెస్టారెంట్గా మార్చేశారు అధికారులు. ఇంకేముంది ఈ సరికొత్త ట్రెండీ రెస్టారెంట్లో మనసారా ఫుడ్ను ఆస్వాదించేందుకు ప్రయాణీకులు ఎగబడుతున్నారు. 24 గంటలూ ఆహారం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రారంభించి రెండు రోజులే అయినా స్పందన మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. అందుకు కారణం లేకపోలేదు. సరసమైన ధరలు, రుచికరమైన ఆహారం ప్రయాణీకులను ఇటువైపుగా ఆకర్షించేలా చేస్తోంది. కోచ్ రెస్టారెంట్ లోపల, బయట సుందరంగా తీర్చిదిద్దారు.

ఆహ్లాదకరమైన అనుభవం
స్టేషన్ ప్రాంగణంలో రైల్వేకోచ్ తరహా థీం రెస్టారెంట్ను ముస్తాబుచేసిన తీరు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. రెండు రోజుల క్రితం గుంటూరు డివిజన్ డీఆర్ఎం ఆర్.మోహనరాజా ఈ కోచ్ రెస్టారెంట్ ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ రకమైన రైల్కోచ్ రెస్టారెంట్ మొదటిసారి గుంటూరులో ఏర్పాటు చేయడంతో ఊహించని స్పందన వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రైలు ప్రయాణికులతో పాటు, సాధారణ ప్రజలకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన అనుభవం పంచేలా ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. బోగీలోపల ఇంటీరియర్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. కళ్లు చెదిరే లైట్లు, ఫ్యాన్యు ప్రయాణీకులను కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే అనుభూతిని అందిస్తోంది. అంతేకాదు, లోపల సర్వీస్ కూడా రైలులో ప్రయాణం చేస్తున్న అనుభూతికలిగేలా ఉంటుంది.

రీడిజైన్ చేసిన తర్వాతే లైసెన్స్
నిజానికి ఎందుకూ పనికిరాని కాలం తీరిన స్లీపర్ కోచ్ను ఇలా ఫుడ్ ఎక్స్ప్రెస్ రెస్టారెంట్గా మార్చేశారు. అయితే, ఈ కోచ్ను కోచ్ రెస్టారెంట్ అవసరాలకు రీడిజైన్ చేసిన తర్వాతే లైసెన్స్ మంజూరు చేశారండోయ్. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాగంణంలో ముందు వైపు దీనిని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న ఆలోచన ద్వారా... రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభవం చేరువ అవుతుందనే చెప్పాలి. వివిధ రకాల వంటకాలను పరిశుభ్రమైన వాతావరణంలో అందించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు.
పైగా ఆహార పదార్థాల ధరలు కూడా అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రెస్టారెంట్ 24 గంటలు తెరిచే ఉంటుంది. 'ఫుడ్ ఎక్స్ప్రెస్' పేరుతో ఏర్పాటైన రెస్టారెంట్ మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ రైల్వే ఇప్పటికే అనేక రైల్వే స్టేషన్లలో కోచ్ రెస్టారెంట్లను ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా మన గుంటూరులో కూడా ఫుడ్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రయాణీకులు సరికొత్త రుచులు ఆస్వాదించేందుకు ఈ బోగీని పరిచయం చేసింది.



Click it and Unblock the Notifications













