వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావొస్తుంది. ఈ నిర్మాణానికి ఎంతో మంది హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి 22 వ తేదీన ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామాలయ గర్భగుడిలో రామ్లల్లాను ప్రతిష్టించనున్నారు. ఈ అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అయోధ్య నగరానికి చేరుకోవడానికి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అందించింది. ఇక అయోధ్యకు వచ్చే భక్తుల కోసం ఆలయ ట్రస్ట్, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల చివర్లో అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. దీంతో అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలు ప్రకటించాయి.
అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా తొలి విమానాన్ని ఈనెల 30 వ తేదీన ఢిల్లీ నుంచి అయోధ్యకు నడపనున్నట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. దీనితర్వాత రోజువారీ విమాన సర్వీసులు జనవరి 16 వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి అయోధ్యకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిర్ ఇండియా తాజాగా వెల్లడించింది.

30 వ తేదీన అయోధ్యకు తొలి విమాన సర్వీసు..
ఈ సందర్భంగా డిసెంబర్ 30 వ తేదీన ఉదయం 11 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన IX 2789 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించింది. అయితే, అదేరోజు మధ్యాహ్నం 12:50 గంటలకు IX 1769 విమానం అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2:10 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నెల 30న అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్న ప్రధాని...
ఢిల్లీ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య ఎయిర్పోర్టును అయోధ్య రామాలయం ఆకారంలోనే నిర్మించారు. అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభం అయితే, రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే యాత్రికుల ఇబ్బందులు తీరినట్లే.
అయితే, అయోధ్య రామాలయం మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని సమాచారం. గర్భగుడి, రాముడి విగ్రహం మాత్రం ఇప్పటికీ పూర్తయ్యాయి. మిగితా పనులు పూర్తి కావడానికి కాస్త సమయమే పట్టేట్లు కనిపిస్తోంది.
ఇక జనవరి 22 వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి వారం రోజుల ముందే, ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రారంభం కానున్నాయి. అంటే జనవరి 16 వ తేదీ నుంచే ఈ ఆచారాలు ప్రారంభిస్తారు. ముడుపుల ఉత్సవంలో ప్రధాన క్రతువులను లక్ష్మీకాంత దీక్షిత్ నిర్వహిస్తారు. ఇప్పటికే అయోధ్యలో జరిగే వేడుకల కోసం అక్కడ టెంట్ సిటీల నిర్మాణాన్ని కూడా చేపట్టిన్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications













