దాల్ సరస్సు తూర్పున ఉన్న నిషాత్ బాఘ్ ను ముంతాజ్ మహల్ యొక్క తండ్రి మరియు నూర్ జహాన్ యొక్క సోదరుడు అయిన అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ 1633 లో నిర్మించాడు. నిషాత్ బాఘ్ అనే పేరు 'సంతోషపు తోట' అనే భావాన్ని సూచిస్తుంది. కొన్ని అత్యంత అరుదైన జాతుల పువ్వులు, చినార్ చెట్లు మరియు సైప్రస్ చెట్లు ఈ తోట లో పెరుగుతాయి. మిద్దె గల ఈ తోట ఈ ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద మొఘల్ ఉద్యానవనాలలో ఒకటి. ఇది దాని అందమైన జలయంత్రాలు (ఫౌంటైన్లు), విస్తృతమైన పచ్చిక బయళ్ళు, మరియు పూలపాన్పులకు ప్రసిద్ధి గాంచింది. జబర్వన్ పర్వతం నిషాత్ బాఘ్ కి నేపథ్యం గా ఉంటుంది.
ప్రముఖ మొఘల్ చక్రవర్తి మరియు అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ అల్లుడు అయిన షాజహాన్ ఉద్యానవనం చూసి ముగ్ధుడయ్యాడు. మామ గారు తనకి ఉద్యానవనం బహుకరిస్తాడని రహస్యంగా ఆశించాడు. అలా జరగక పోయే సరికి, షాజహాన్ తోటకు నీటి సరఫరా ని ఆపివేసేందుకు ఆదేశించాడు.