రిలయన్స్ ఫౌండేషన్ 'వన్తారా' అనే పేరుతో ఓ కృత్రిమ అడవిని సృష్టించింది. 3 వేల ఎకరాల విస్తీర్ణం ఏర్పాటు చేసిన ఈ అడవిలో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. అంతేకాదు, ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రిని అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసింది. మన దేశంలోనే ప్రపంచ దేశాల నుంచి అభినందనలు అందుకుంటోన్న ఆ జంతు సంరక్షణ కేంద్రం వన్తారా ప్రత్యేకతలేంటో చూద్దాం పదండి!
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్.. గుజరాత్లోని జామ్నగర్లో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. గాయపడ్డ జంతువులను రక్షించడం, చికిత్స చేయడం, సంరక్షణ, పునరావాసం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తం 3 వేల ఎకరాల్లో దీనిని సృష్టించారు. దీనికి 'వన్తారా' అని నామకరణం చేసినట్లు రిలయన్స్ ఫౌండేషన్ తన ప్రకటనలో వెల్లడించింది. నిజానికి, కొవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణం ప్రారంభించినట్లు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివరించారు. ప్రపంచం కరోనాతో బాధపడుతున్నప్పుడు, తమకు దీని గురించి ఆలోచించే సమయం దొరికిందని తెలిపారు. 2008 నుంచే ఆ ప్రాంతంలో ఏనుగుల సంరక్షణకు చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.

గ్రీన్ బెల్ట్లో 3 వేల ఎకరాల్లో..
గుజరాత్ జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ ప్రాంతంలోని గ్రీన్ బెల్ట్లో 3 వేల ఎకరాల్లో వన్తారా అనే ఈ కృత్రిమ అడవిని నిర్మించారు. జంతువుల ఆవాసానికి అనుకూలంగా ఉండేలా సహజసిద్ధమైన వసతి ఏర్పాట్లను అందించారు. ప్రధానంగా జంతు సంరక్షణతోపాటు అంతరించిపోతోన్న జీవ జాతుల ఉనికిని కాపాడడానికి వన్తారా ఉపయోగపడుతుంది. అలాగే, జంతువుల ఆరోగ్య సంరక్షణ, ఆస్పత్రులు, పునరావాస పద్ధతులను వన్తారాలో సృష్టించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించింది.
అంతేకాదు, ప్రఖ్యాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) వంటి సంస్థలతో అధునాతన పరిశోధన సహకారాన్ని ఏకీకృతం చేయడంపై ప్రణాళికలు సిద్ధం చస్తున్నట్లు సమాచారం. వన్తారా ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆసుపత్రి..
ఈ వన్తారా అటవీ ప్రాంతంలో సుమారు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగులకు ప్రత్యేకమైన ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇందులో పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలను కల్పించారు. ఈ తరహాలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ కృషికి భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.
భారత్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు కొందరు వన్తారా మిషన్లో భాగమయ్యారు. ప్రభుత్వ, పరిశోధన సంస్థల సహకారాలు ఉండడంతో ఈ ఫౌండేషన్ లక్ష్యం చేరుకునేందుకు మార్గం మరింత తేలికయ్యే అవకాశాలు ఉన్నాయి. జంత సంరక్షణ కోసం ఈ ఫౌండేషన్ కృషిని ఎవ్వరైనా అభినందించాల్సిందే.



Click it and Unblock the Notifications













