చారిత్రక సౌందర్యానికి ప్రతీక... నాసిక్లోని ఈ ప్రాంతాలు..
మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున ఉన్న నాసిక్ ఆధ్యాత్మికతో పాటు, చారిత్రక సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పురాతన నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. నాసిక్లోని దేవాలయాలు పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది సరైన ప్రదేశం. పశ్చిమ కనుమల దిగువన ఉన్న నాసిక్ మహారాష్ట్రలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న ఒక మహానగరంగా విరాజిల్లుతుంది. నాసిక్ అనేక ఆసక్తికరమైన ప్రదేశాలతో నిండి ఉంది. వివిధ గుహలు, అద్భుతమైన వాస్తుశిల్పం గురించి తెలిపే అనేక కోటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నాసిక్ దేవాలయాలు ప్రతి సంవత్సరం భక్తులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. భారతదేశంలోని కుంభమేళాలో నియమించబడిన నాలుగు పవిత్ర స్థలాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధిచెందింది.

సులా వైన్యార్డ్స్
నాసిక్ అనేక ద్రాక్షతోటలకు ప్రసిద్ధి చెందింది. నాసిక్లోని సులా వైన్యార్డ్కు సందర్శంచడం ద్వారా పాశ్చాత్య ప్రయాణ సంస్కృతిని చూసే అవకాశం లభిస్తుంది. ముంబై నుండి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ నగరం ముఖ్యంగా ద్రాక్షతోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దిండోరి అనే చిన్న అందమైన గ్రామం ఉంది. ఈ గ్రామం చుట్టూ పర్వతాలు చిన్నచిన్న సరస్సులతో ఈ గ్రామం అందం మరింత రెట్టింపవుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రతిరోజూ సుమారు ఎనిమిది వేల నుంచి నుంచి తొమ్మిది వేల టన్నుల ద్రాక్షను చూర్ణం చేసి వైన్ తయారు చేయడం జరుగుతుంది. ఈ వైన్ను భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా వినియోగిస్తారు.

అంజనేరి హనుమాన్ దేవాలయం
హనుమంతుని జన్మస్థలం కూడా నాసిక్లోనే ఉందనే విషయం మీకు తెలుసా... ఇది ఈ నగరానికి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంజనేరి హనుమాన్ ఆలయంలో హనుమంతుని తల్లి అంజనీ దేవి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో అంజనేరి కొండలు కూడా ఉన్నాయి. నలువైపులా పచ్చదనంతో చుట్టుముట్టబడిన అంజనేరి కొండలు నాసిక్లోని ఒక అందమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. హనుమంతుని తల్లి అంజనీ పేరును కలిగి ఉన్న ఈ కొండలు పవిత్ర స్థలంగా, పర్యాటకులను, ట్రెక్కర్లను ఆహ్లాదపరుస్తున్నాయి. హనుమంతుడు తన బాల్యాన్ని ఆంజనేరి హిల్స్లో గడిపాడని, అందుకే ఈ ప్రాంతంలో అద్భుతమైన ఆలయం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి.

రాంకుండ్
రాంకుండ్ నాసిక్ లో గోదావరి నదిపై వెలసిన ఓ అందమైన అద్భుతం. రాముడు ఇక్కడ స్నానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ చెరువులో చనిపోయిన వ్యక్తి చితాభస్మం తేలడంతో అతని ఆత్మకు మోక్షం లభిస్తుందని ఇక్కడివారి నమ్మకం. దేశంలోని లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కుంభమేళా కూడా ఇదే ప్రాంతంలో ఉంది. నాసిక్లోని రాంకుండ్ అక్షయ తృతీయ, కుంభమేళా సమయంలో ఎంతో రద్దీగా ఉంటుంది. రాంకుండ్ నాశిక్ బస్ స్టాండ్ నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
త్రయంబకేశ్వరుడు
త్రయంబకేశ్వర్ నాసిక్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌతమీ నది ఒడ్డున ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రీ త్రయంబకేశ్వరుడు స్థానం పదవది. ఆలయం లోపల ఒక చిన్న గొయ్యిలో, మూడు చిన్న లింగాలు ఉన్నాయి. ఇవి బ్రహ్మ, విష్ణు, శివుని చిహ్నాలుగా పరిగణించబడతాయి. నల్లరాళ్లతో నిర్మించిన ఈ ఆలయం చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రాంతం చుట్టూ బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి కొండలు ఉన్నాయి. నాసిక్కి వెళ్లినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి.



Click it and Unblock the Notifications













