నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే బారాషహీద్ రొట్టెల పండుగ ఈ నెల 17 నుంచి ఐదు రోజులపాటు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దర్గా రొట్టెల పండగకు ముస్తాబయింది. దేశ, విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ మేరకు జిల్లా వక్ఫ్బోర్డు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ పంగడను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది 15లక్షల మందికిపైగా భక్తులు రొట్టెల పండగకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఒక ఏడాది రొట్టె తీసుకుని తమ కోరిక నెరవేరితే, మరుసటి ఏడాది అదే పేరుతో రొట్టెను చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆయా ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నవారికి అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఈ దర్గాలో ఆరోగ్య రొట్టెకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషహీద్ దర్గాకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని బట్టీ ఇక్కడి మట్టి, ఇక్కడి నీరు పవిత్రమని భావిస్తారు. ఇక్కడ 12 మంది యుద్ధ వీరుల మరణానికి చిహ్నంగా దర్గా ఏర్పాటు చేశారని చెబుతారు.

ఆ 12 సమాధులు వద్ద ప్రార్థనలు చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. బాహాషహీద్ దర్గా గంధ మహోత్సవం రోజున, దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది ప్రచారంలో ఉంది. ఇక్కడ ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విదేశీ విద్యా రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె ఇలా వివిధ రకాల పేర్లతో రొట్టెలను పిలుస్తుంటారు. అందుకు అనుగుణంగా ఘాట్ల వద్ద బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
బారాషహీద్ దర్గా అనే పేరు..
బారాషహీద్ దర్గా చరిత్ర విషయానికొస్తే... టర్కీ నుంచి మహ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారట. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్ బేగ్తో పాటు 11 మంది వీర మరణం పొందారట.
వారి తలలు గండవరంలో తెగి పడ్డాయని, మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయని ప్రచారంలో ఉంది. అలా వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరారట. దీంతో వారి కోరిక మేరకు అక్కడే సమాధులు నిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా అని, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్లు అని పిలుస్తారు. దీంతో ఈ దర్గాకు బారాషహీద్ అనే పేరు వచ్చిందని అంటుంటారు.

రొట్టెల పండగ అలా వచ్చింది..
ఈ చెరువులో ఆర్కాటు నవాబుల కాలంలో రజకులు బట్టలుతికేవారు. ఒకరోజున భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతికిన తర్వాత రాత్రికి అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీద్లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో ఉంది, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటిపై రాస్తే త్వరగా కోలుకుంటుందని చెప్పారట. దీంతో భార్యాభర్తలు విషయాన్ని నవాబు ఆస్ధానంలో వారికి చెప్పారు. రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించి, రాజు భార్య నుదుటిపై రాశారు.
ఆమె ఆరోగ్యం వెంటనే బాగుపడింది. ఆ రాజు సంతోషంతో తన భార్యతో కలసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్ధనలు చేశాడు. అలాగే, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి అందించాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితి ప్రకారం రొట్టెల మార్పు జరుగుతూ వస్తోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అచారంగా మారిపోయి, అదే రొట్టెల పండుగగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలోఒక్కరోజు మాత్రమే జరిపేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువ కావడం, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండంతో 5 రోజులు జరుపుతున్నారు.



Click it and Unblock the Notifications













