ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులను పరిచయం చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఈ సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ టూర్లో హిందూపురం నుంచి కాశీ, అయోధ్యతోపాటు మొత్తం 14 పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం ఎనిమిది రోజులపాటు సాగే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు. మరి ఈ టూర్లో సందర్శించబోయే 14 పుణ్యక్షేత్రాలు ఏంటి? టికెట్ ధరెంత? రూట్ మ్యూప్ ఎలా ఉంటుంది? లాంటి విషయాలను తెలుసుకుందాం!
ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన నిమిత్తం హిందూపురం నుంచి జూలై 12 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరనుంది. 14 పుణ్యక్షేత్రాలను చూపించే ఈ టూర్లో మొత్తం ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆధ్యాత్మిక కేంద్రాలతోపాటు ప్రముఖ పుణ్య నదులలో పుణ్య స్నానాలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అంతేకాదు, ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారి కోరిక కూడా నెరవేరుతుంది. కొన్ని పర్యాటక కేంద్రాలను కూడా చూపిస్తారు.

రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..
ముందుగా హిందూపురంలో బస్సు బయలుదేరిన హైదరాబాద్లో ఆగుతుంది. అక్కడ శంషాబాద్లో చిన్న జీయర్ స్వామి నిర్మించిన రామానుజచార్యుల దేవాలయం సందర్శనతోపాటు యాదిగిరి గుట్ట నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి నిజామాబాద్లోని బాసర సరస్వతీ దేవి ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ప్రయాగ్ రాజ్గంగ, యమున, సరస్వతీ నదుల్లో పుణ్య స్నాసాలు ఆచరిస్తారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత అయోధ్యకు బయలుదేరుతారు.
అయోద్యలో శ్రీరామ దర్శనం, సీతాదేవి ఇల్లు, జనక మహారాజ్ కోట సందర్శన ఉంటుంది. తర్వాత కాశీ (వారణాసి) చేరుకుని కాశీ విశ్వేశ్వరుని, కాశీ విశాలాక్షి దర్శనంతోపాటు గంగానది పుణ్యతీర్థ స్నానం ఉంటుంది. అనంతరం భైరవ దర్శనం చేసుకోవచ్చు.

విశాఖ అందాలను కూడా...
వారణాసి నుంచి నేరుగా విశాఖపట్నం జర్నీ ఉంటుంది. అక్కడ ఆర్కే బీచ్, కైలాసగిరి చూసిన తర్వాత సింహాచలం నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని బయటకు వస్తారు. అక్కడి నుంచి ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామి, అన్నమయ్య క్షేత్రం సందర్శన ఉంటుంది. ద్వారకాతిరుమల నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న అమరావతిలోని అమరేశ్వరుని దర్శనం చేసుకుంటారు. కోటప్పకొండ అమరేశ్వరుని కూడా దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్నస్వామి

భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత యాగంటి వెళ్లి యాగంటి బసవన్న దర్శనంతో యాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి హిందూపురం చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్క టిక్కెట్టు రూ.8,500గా ధర నిర్ణయించారు. యాత్రకు వెళ్లాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ లేదా డిపో అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది. మరెందుకు ఆలస్యం.. మీరూ కుటుంబసమేతంగా ఈ టూర్ ప్యాక్ను ఇప్పుడే బుక్ చేసుకోండి మరి!



Click it and Unblock the Notifications













