తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి యాదాద్రి నరసింహస్వామి ఆలయం. యాదాద్రి గుట్టపై వెలసిన నరసింహాస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. అక్కడికి కేవలం సమీప ప్రాంతాల వారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా స్వామివారి దర్శించుకునేందుకు వస్తుంటారు.
ఇక, ఈ పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రదేశమొక అద్భుత శిల్పసంపద అని చెప్పుకోవాలిరు. శ్రీ లక్ష్మీనరసింహుడి సన్నిధానం చుట్టూ మరెన్నో సందర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఆలయ గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజ స్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణీ, యాగశాల ఇలా దేనిని చూసినా అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది.
ఈ కొండపై కొలువై ఉన్న నరసింహాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండి ఉంటుంది. మొత్తం 560 మంది శిల్పులు కలసి అధ్భుత ఆకారాలతో కూడిన ప్రాకారాలను నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

అంతేకాదు ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం గురించి వివరించే విధంగా తైల వర్ణ చిత్రాలు కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు సకల సౌకర్యాలతో కూడిన 15 వివిఐపి కాటేజీలతో ప్రెసిడెన్షియల్ సూట్ ను నిర్మించారు. ఇంతటి అద్భుతమైన నిర్మాణాన్ని వీక్షించేందుకు, అలాగే గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు.
కొండపై ఇవి నిషేధం..!
యాదాద్రి వెళ్లే భక్తులకు ఓ ముఖ్యమైన గమనిక.. ఇకనుండి యాదాద్రి కొండపై ప్లాస్టిక్ను నిషేదిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత భక్తులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రం యాదాద్రి అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆలయ రద్దీ కూడా విపరీతంగా పెరిగింది. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ కొండపై కూడా ప్లాస్టిక్పై నిషేదాన్ని విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల ఆలయంలో టీటీడీ ప్లాస్టిక్ను నిషేదించింది.

ఇప్పుడు యాదాద్రి కొండపై కూడా ఇదే తరహా పద్ధతిని అవలంభిస్తున్నారు. గతంలో అన్నవరం దేవస్థానంలోనూ ప్లాస్టిక్ను నిషేదించారు. ఇప్పుడు యాదాద్రి కొండపై ప్లాస్టిక్పై అధికారులు నిషేదం విధించారు. ఈ ఆలయాల్లోకి భక్తులు, సిబ్బంది ఎవరూ ప్లాస్టిక్ వంటి వస్తువులేవీ తీసుకెళ్లటానికి వీళ్లేదు. పర్యావరణ పరిరక్షణలో భాగాంగా ప్లాస్టిక్ వాడకం నిషేదిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

ప్లాస్టికేతర వస్తువులు ఉపయోగించాల్సిందే..!
పర్యావరణ పరిరక్షణలో భాగంగానే అధికారులు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు దేవస్థానంలోని వివిధ భాగాలకు ఈవో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకూడదని ఆలయ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్లాస్టికేతర వస్తువులు ఉపయోగించాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు. ఈ నిషేదాన్ని ఆలయ సిబ్బంది విధిగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Click it and Unblock the Notifications












