అయోధ్య రామాలయ ప్రారంభానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి పోరాటం తర్వాత ఎట్టకేలకు రామజన్మభూమి అయోధ్యలో రాముడి గుడి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జనవరి 22న రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే, అయోధ్య వెళ్లేందుకు మార్గాలేంటో ఓసారి తెలుసుకుందాం. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే ప్రయాణం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. అందుకే అయోధ్య చేరుకునేందుకు ఉత్తమమైన మార్గాలేంటో చూద్దాం.
అయోధ్యకు రైలు ప్రయాణం..
రైలుమార్గంలో అయోధ్యకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ముందుగా అయోధ్య జంక్షన్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధాన భారతీయ నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. దేశంలోని అనేక నగరాల నుండి ఇక్కడ రోజువారీ లేదా వారానికో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా, లక్నో, ఢిల్లీ, అలహాబాద్, వారణాసి మరియు గోరఖ్పూర్ నుండి కూడా ఇక్కడకు నేరుగా రైళ్లు నడుస్తాయి. అలాగే దూరప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి కనెక్టింగ్ రైళ్లు సులభంగా అందుబాటులో ఉండనున్నాయి.
ఢిల్లీ నుండి అయోధ్యకు అనేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్రధాన నగరాలను కలుపుతు రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో ప్రయాణ సమయం 7 నుండి 14 గంటల వరకు ఉంటుంది. ఈ నగరాలకు కొన్ని ప్రసిద్ధ రైళ్లు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

వందే భారత్ ఎక్స్ప్రెస్ (ఆనంద్ విహార్ టెర్మినల్ - అయోధ్య కాంట్)
కైఫియత్ ఎక్స్ప్రెస్ (రాత్రిపూట)
ఫరక్కా ఎక్స్ప్రెస్ (ఢిల్లీ జంక్షన్ నుండి అయోధ్య జంక్షన్ వరకు, ఆదివారం, మంగళవారం, గురువారం మరియు శుక్రవారం నడుస్తుంది).
లక్నో నుండి అయోధ్యకు చేరుకోవాలనుకునేవారికి ఇది అతి చిన్న మార్గమని చెప్పాలి. ఇక్కడి నుండి ప్రయాణం దాదాపు 3-4 గంటలు పడుతుంది. ఈ మార్గంలో తరచుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇది రోజు ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుంది.
వారణాసి నుండి అయోధ్య వరకు అయితే చాలా రైళ్లు రాత్రి వేళల్లో నడుస్తాయి. దీనికి దాదాపు 8-10 గంటల సమయం పడుతుంది.
జమ్ము తావి ఎక్స్ప్రెస్ (వారణాసిని అయోధ్యకు 3.5 గంటల్లో కలుపుతుంది)
గంగా సట్లెజ్ ఎక్స్ప్రెస్ (రెండు నగరాలను 4.5 గంటల్లో కలుపుతుంది)
డూన్ ఎక్స్ప్రెస్ (వారణాసి జంక్షన్ నుండి 3 గంటల 21 నిమిషాలలో అయోధ్య జంక్షన్ చేరుకుంటుంది)
అహ్మదాబాద్ సబర్మతి ఎక్స్ప్రెస్ (వారణాసిని అయోధ్యకు 3.5 గంటల్లో కలుపుతుంది మరియు ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం ఈ ట్రైన్ నడుస్తుంది). వీటితో పాటు అలహాబాద్, కాన్పూర్, పాట్నా, భోపాల్ వంటి వివిధ రాష్ట్రాల ప్రధాన నగరాల నుండి నడిచే రైళ్లు నేరుగా అయోధ్యకు వెళ్తాయి.

బస్సు మార్గం...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) బస్సులు అయోధ్య, లక్నో, ఫైజాబాద్, గోరఖ్పూర్ వంటి పొరుగు నగరాల మధ్య క్రమం తప్పకుండా నడుస్తాయి. ఈ బస్సులు తక్కువ ఖర్చుతో అయోధ్య చేరుకోవడానికి సౌకర్యవంతమైన ఎంపిక. ఈ నగరాల నుండి అయోధ్యకు వెళ్లడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బస్సును బుక్ చేసుకోవచ్చు. కారులో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. అయోధ్య చేరుకోవడానికి ఈ జాతీయ రహదారుల గుండా ప్రయాణం చేయవచ్చు.
జాతీయ రహదారి-27
రాయ్ బరేలీ నుండి అయోధ్య వరకు జాతీయ రహదారి
రామ్ వంగన్ మార్గ్
రామజన్మభూమి వరకు నాలుగు లేన్లు
అయోధ్య నుండి చిత్రకూట్ వరకు రాముని వనవాస మార్గం
సుల్తాన్పూర్ మరియు అయోధ్య మధ్య 47కిలోమీటర్లు..
విమానమార్గం...
రోడ్డు, రైలుతో పాటు, విమాన మార్గంలో కూడా అయోధ్య చేరుకోవచ్చు. అయోధ్యలోని విమానాశ్రయం ఈమధ్యనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఇది కాకుండా లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యకు సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి అయోధ్యకు దూరం 130 కిలోమీటర్లు, అక్కడికి చేరుకోవడానికి టాక్సీలు మరియు బస్సులు సులభంగా లభిస్తాయి. అలాగే అయోధ్యకు రావడానికి గోరఖ్పూర్, ప్రయాగ్రాజ్ మరియు వారణాసి విమానాశ్రయాలకు చేరుకోవచ్చు.
విదేశాల నుంచి కూడా అయోధ్య చేరుకోవచ్చు..
విదేశాల్లో నివసిస్తుంటే మాత్రం రాంలాలా దర్శనం కోసం అయోధ్యకు చేరుకోవాలనుకుంటే, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవచ్చు. ఇక్కడి నుండి అయోధ్య చేరుకోవడానికి దేశీయ విమానాలు లేదా రైళ్లతో కనెక్ట్ చేయవచ్చు. వీటితో పాటు అనేక విదేశీ విమానయాన సంస్థలు నేరుగా లక్నోకి కనెక్ట్ అవుతాయి. ఈ మార్గాలను కూడా అనుసరించవచ్చు.



Click it and Unblock the Notifications













