మామండూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఒక గ్రామం. మామండూరు ప్రాంతం తిరుపతికి 24 కిలోమీటర్ల దూరంలో వున్నది. మామండూరు ప్రాంతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అడవిలో విహరించడానికి, జంతువుల్ని చూడటానికి 10 కిలోమీటర్లు పొడవు గల ప్రకృతి బాట ఉంది. ప్రతి నిత్యం నగర జీవనంలో యంత్రాల మాదిరి పరిగెత్తుతూ అనుక్షణం టెన్షన్ లతో ప్రశాంతత లేని జీవనం సాగిస్తూ వారంతపు చివర్లో కుటుంబంతో సహా ఎక్కడైన వెళ్లాలని అనుకునే వారికి మామండూరు ఒక వరం. రేణిగుంట-కోడూరు మార్గంలో గల సరిహద్దు ప్రాంతమే ఈ గ్రామం. ఆంగ్లేయులు 1920లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ఆనాటి బ్రిటిష్ ఉద్యోగి కెనత్ ఆండర్సన్ రైల్వేస్టేషన్కు సమారు 0.5 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన గుట్టను చూశారు. దీనిపై ఆయన ఒక ఈ అందమైన భవనాన్ని నిర్మించారు. ఇంకప్పట్నుంచి అది అంగ్లేయుల అందమైన విహార కేంద్రంగా పేరుగాంచింది.
మామండూరు గ్రామం అటవీప్రాంతం కాబట్టి ఇక్కడ గాలి, వాతావరణం అన్ని స్వచ్ఛంగా ఉంటాయి. అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కింద అనేక అభివృద్ధి పనులు చేశారు. పర్యాటకుల కోసం అనేక గుడిసెలు నిర్మించారు. ఈ భవనసమీపంలో చిన్నారులు ఆడుకునేందుకు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ భవనమే కాకుండా ఇక్కడి సమీప ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది.
PC: youtube
మామండూరు అటవీ ప్రాంతంలో బంగ్లానే కాకుండా ఇంకా అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో బ్రహ్మదేవుని గుండం, కల్లెటి కోన, తూంబురతీర్థం, పెద్దయేరు వంక, బావికాడలైను అనే జలపాతాలు వేసవికాలంలో చల్లగా ఆహ్లాదకరంగా వుంటుంది. దీనితో పాటు చాకిరేవుబాణ, రింగురోడ్డు, బండ్లవిరుసు, అవ్వతాతగుట్టలు, స్వామిపాదాలు ఈ ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.
చూడదగ్గ ప్రదేశాలు
తుంబుర తీర్థం
PC: youtube
తుంబురతీర్థం తిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తరంగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తీర్థం తుంబురుడి పేరుమీద వెలసినది. శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన చివరి దశను స్వామి ధ్యానంలో గడిపిందన్నదానికి సాక్ష్యాలు నేటికీ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో వచ్చిన ప్రళయం కారణంగా కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబురతీర్థం ఏర్పడిందని అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు.
బ్రహ్మదేవుని గుండం
PC: youtube
బ్రహ్మదేవుని గుండం తిరుమల అటవీ ప్రాంతంలోని జలపాతం. దీనిని చేరుకోవటానికి 1 గంట 30 నిమిషాలు కాలినడక ద్వారా చేరుకోవచ్చును.
మార్గాలు
రోడ్డు మార్గం
చంద్రగిరి, తిరుపతి బస్ స్టేషనులు ఇక్కడికి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడి నుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుచున్నది. తిరుపతి నుంచి కోడురూ, కడప బస్సులు ఇక్కడ మామండూరులో నిలుస్తాయి.
రైలు మార్గం
ఈ గ్రామానికి దగ్గరలో పాకాల తిరుపతి రైల్వే లైను ఉంది. కొటాల, చంద్రగిరి రైల్వేస్టేషనులు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడ రైల్వేస్టేషన్లో ఇంటర్సీటి ప్యాసింజర్ రైళ్ళు ఆగుతాయి. ఇక్కడ్నించి నడుచుకుంటూ వెళ్లి ఈ బంగ్లాను చేరుకోవచ్చు.
భోజన సౌకర్యం
ఎకో టూరిజంలో భాగంగా ఇక్కడ హరిణి అనే రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన రుచికరమైన శాఖహార భోజనం ఇక్కడ భుజించవచ్చును. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ వసతులు కూడా కలదు.