బెంగళూరు–మంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభానికి భారతీయ రైల్వే వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 5న అత్యంత నిటారైన సకలేశ్పూర్-సుబ్రహ్మణ్య ఘాట్ సెక్షన్ మార్గంలో ఈ రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఇక సెప్టెంబరు 7 నాటికి ఈ రైలు స్టాప్లు, వేళలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ రైలు ప్రయాణ సమయం దాదాపు 8 నుంచి 8.5 గంటల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇది యశ్వంత్పూర్లో ఉదయాన్నే బయలుదేరి, రాత్రికి మంగళూరు నుంచి తిరుగు ప్రయాణం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. సేఫ్టీ క్లియరెన్స్ వచ్చాక సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ఛార్జీలు, స్టాప్ల వివరాలను అధికారికంగా వెల్లడిస్తుంది.
ప్రయాణ సమయం, బ్రేకింగ్ సామర్థ్యం, విద్యుత్ వినియోగాన్ని పరిశీలించేందుకు అధికారులు 16 కోచ్ల రైలుతో పరీక్షలు నిర్వహించారు. ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, ఇంజినీరింగ్, మెకానికల్ విభాగాల బృందాలు ఈ ట్రయల్ రన్ను దగ్గరుండి పర్యవేక్షించాయి. ఘాట్ మార్గంలో విద్యుదీకరణ పనులు డిసెంబరు 2025 నాటికి పూర్తికావడంతో ఎలక్ట్రిక్ రైళ్ల వేగం పెరిగేందుకు మార్గం సుగమమైంది. అయితే, తీవ్రమైన మూలమలుపులు, ఎత్తైన ఘాట్ మార్గాల్లో వేగాన్ని నియంత్రిస్తారు. వర్షాకాలం దృష్ట్యా ప్రయాణ సమయంలో కొంత వెసులుబాటు కల్పిస్తారు. రైలు ప్రారంభమైన తొలి రెండు వారాల్లో సమయాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. వీకెండ్స్లో తీవ్ర రద్దీ ఉంటుంది కాబట్టి, ప్రయాణికులు IRCTC అలెర్ట్స్ సెట్ చేసుకోవడం మంచిది.

బెంగళూరు–మంగళూరు వందే భారత్ రూట్, సాధ్యమయ్యే స్టాప్లు ఇవే..
అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ, ఈ రైలు యశ్వంత్పూర్ నుంచి ప్రారంభమై తుమకూరు, అరసీకెరె, హాసన్, సకలేశ్పూర్, సుబ్రహ్మణ్య రోడ్, మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ స్టేషన్లలో ఆగవచ్చని తెలుస్తోంది. ఇంజిన్ ట్రాక్షన్ తనిఖీలు, క్రాసింగ్లు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ స్టేషన్లను ఎంపిక చేశారు. పశ్చిమ కనుమల గుండా వెళ్లే మిగతా ప్రధాన రైళ్ల మార్గాన్నే ఇది కూడా అనుసరిస్తుంది. సుబ్రహ్మణ్య రోడ్ వద్ద ఇచ్చే చిన్న విరామం కుక్కే ఆలయానికి వెళ్లే భక్తులకు, బ్రేక్ తనిఖీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భద్రతా ఆమోదాలు, SWR సమయ పట్టిక క్లియరెన్స్ తర్వాతే ఫైనల్ స్టాప్లు ఖరారవుతాయి.
వందే భారత్ వేళలు, ప్రయాణ సమయం అంచనాలు
ప్రస్తుతం యశ్వంత్పూర్ - మంగళూరు మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లకు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయాన్ని ఘాట్ పరిమితులు, ప్రాధాన్యతలను బట్టి 8 నుంచి 8.5 గంటలకే కుదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పగటిపూట సాగే ఈ ప్రయాణం బిజినెస్ ట్రావెలర్లకు, కుక్కే సుబ్రహ్మణ్య లేదా ఉడుపి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చే ప్రయాణికులు రాత్రి రైళ్లలో ఉదయానికి యశ్వంత్పూర్ చేరుకుంటే, అక్కడి నుంచి అదే రోజు మంగళూరుకు సులభంగా కనెక్టింగ్ ప్రయాణం చేసుకోవచ్చు. ఘాట్లో కొండ దిగేటప్పుడు హీట్, ట్రాక్షన్ కంట్రోల్ కోసం వేగాన్ని నియంత్రిస్తూ సేఫ్గా నడుపుతారు.
వందే భారత్ బుకింగ్స్, ఛార్జీలు, ప్రయాణ చిట్కాలు
టికెట్ బుకింగ్లు ఇంకా ప్రారంభం కాలేదు. అధికారిక టైమ్టేబుల్ వచ్చే వరకు వేచి చూడండి, అలాగే IRCTC అలర్ట్లను ఆన్ చేసుకోండి. తొలి నెలలో సులభంగా టికెట్లు లభించాలంటే వారాంతాల్లో కాకుండా వారం మధ్యలో ప్రయాణించడానికి ప్రయత్నించండి. వయోవృద్ధులు లేదా పిల్లలతో వెళ్తున్నట్లయితే ఎక్కువ లెగ్రూమ్, ప్రత్యేక ఆహార సదుపాయం ఉండే 'ఎగ్జిక్యూటివ్ చైర్ కార్' ఎంచుకోవడం మంచిది. ప్యాంట్రీ, ఛార్జింగ్ పాయింట్లు, ఆధునిక మరుగుదొడ్లు మీ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. వర్షాలు పడే రోజుల్లో ఘాట్ మార్గంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, కనెక్టింగ్ విమానాలు లేదా బస్సుల కోసం కాస్త సమయాన్ని బఫర్గా ఉంచుకోవడం శ్రేయస్కరం.



Click it and Unblock the Notifications











