దసరా పండుగ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఏపీ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందింది కర్నూలు జిల్లా దేవరగట్టులోని బన్నీ ఉత్సవం. దేవరగట్టు బన్నీ ఉత్సవం మొదలయ్యింది. ఇందులో భాగంగా శనివారం కర్రల సమరం జరగనుంది. బన్ని ఉత్సవానికి సుమారు 800 మంది పోలీసులతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు పోలీసులు నాలుగు చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు కూడా చేయనున్నారు. వీటితోపాటు అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 148 మందిని బైండోవర్ చేసినట్టు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ప్రకటించారు.
కొండపైన కొలువైన స్వామివారు..
కర్నూలు జిల్లా దేవరగట్టు ఈ సంవత్సరం మొత్తం నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం దసరా పండుగ రోజునే యుద్ధభూమిని తలపిస్తుంది. ఇక్కడి కొండపై కొలువై ఉన్న మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల కోసం మూడు రోజులు చేసే పోరాటాన్నే దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటారు. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం దేవరగట్టు కొండపై మాల మల్లేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల ఉత్సవమే బన్నీ ఉత్సవం. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను నెరణికి గ్రామం నుంచి తెప్పించామని, ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇక్కడి పూజారులు గణపతి పూజ, కంకణధారణం, నిశ్చితరోహణం తదితర వంటి పూజలు నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

రేపే బన్నీ ఉత్సవం..
దేవరగట్టు బన్నీ ఉత్సవం అక్టోబరు 12న నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే కర్రల సమరానికి జిల్లా యంత్రాంగం కూడా అనుమతి మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఎనిమిది గ్రామాల ప్రజలు..
దేవరగట్టు కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో మాళమ్మ, మల్లేశ్వరస్వామి అమ్మవార్లు కొలువై ఉన్నారు. రేపు (దసరా రోజున) అర్ధరాత్రి 12గంటల సమయానికి స్వామివార్ల కల్యాణమహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత కొండ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా పాదాలగుట్ట, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఓ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మొత్తం ఎనిమిది గ్రామాల ప్రజలు పోరాడుతారు. ఇందులో 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడటాన్నే బన్ని ఉత్సవం అని అంటారు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే మాత్రం కర్నూలుకు వెళ్లాల్సిందే..



Click it and Unblock the Notifications













