భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలున్నాయి. వాటితో పాటు ఇక్కడ అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. పురాతన ఆలయాలకు ఇక్కడ కొదవే లేదు. అవి వాటి చరిత్రకు, రహస్యాలకు ఎంతో ప్రసిద్ధిచెందాయి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఆలయం మనదేశంలోనే ఉంది అన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఓం ఆకారం కలిగిన ఆలయం.. ఇంతకీ ఈ ఆలయం భారత్లో ఎక్కడుందో, ఈ ఆలయ విశేషతలేంటో తెలుసుకుందాం పదండి.
అయోధ్యలోని రామమందిరం ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకుంది. ఈ ఆలయం నాగర నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది. ఇక, ఇప్పడు మనం చెప్పుకోబోయే ఓం ఆకారం ఆలయం కూడా ఈ నిర్మాణ శైలినే కలిగి ఉంది. ఇక్కడ అనేక ప్రత్యేకతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకునేవారు మాత్రం తప్పకుండా ఈ ఓం ఆకారం ఆలయాన్ని సందర్శించాల్సిందే. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం రాజస్థాన్లో వెలసింది. ఈ శివాలయం రాష్ట్రంలోని పాలి ప్రాంతంలో కొలువై ఉంది. ఆలయ వైభవాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ శివాలయం సుమారు 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఓం ఆకారం కలిగి ఏకైక శివాలయం ఇదే.

250 ఎకరాల్లో విస్తరించిన శివాలయం...
ఈ శివాలయంలో ప్రధానంగా యజ్ఞవేది వంటి రెండు అంతస్తులు కలవు. వీటితోపాటు గురుకులం, స్వస్తిక్ ఆకారంలో వసతిగృమం, నక్షత్రాకారంలో ఉన్న ఆసుపత్రి భవనాలు కూడా నిర్మించారు. ఇక, ఈ ఆలయంలో పర్వతాలు, చెరువులు కూడా ఉన్నాయి. వాటిని కృత్రిమంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో నాలుగు అంతస్తుల భవనం ఉంది.
250 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలో 108 గదులు ఓంకార ఆకారాన్ని గుర్తించే విధంగా ఉన్నాయి. వీటితోపాటు ఈ శివాలయంలోని మరో ప్రత్యేకత 12 జ్యోతిర్లింగాల రూపంలో శివుని ఆలయం ఉండడం. ఇందులో 1008 శివుని ప్రతిమలు దాగి ఉన్నాయి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న మొట్ట మొదటి శివాలయం ఇదే కావడం విశేషం. పచ్చని ప్రకృతి అందాల నడుము ఈ ఆలయం దాగి ఉంది. ఈ ఆలయ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు.

1008 శివుడు విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు...
ఈ శివాలయం రాజస్థాన్ లోని పాలి జిల్లాలో జదమ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ప్రముఖ శైవ క్షేత్రాలైన పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో ప్రదేశంలో కొలువై ఉన్నాయి. ఈ శివాలయం పై భాగంలో ధోల్ పూర్ నుంచి తెచ్చిన రాయితో చేసిన శివలింగాన్ని ప్రదర్శించారు. ఇది ఈ ఆలయ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి. ఇంకా ఇక్కడ1008 శివుడు విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ శివాలయాన్ని నాలుగు విభాగాలుగా నిర్మించారు. అందులో ఒక భాగం మొత్తం భూగర్భంలో ఉంటుంది. మిగిలిన మూడు భాగాలు భూమి మీద ఉండటం విశేషం.
మరో విశేషత ఏంటటే, ఆలయం మధ్యలో స్వామి మాధవానంద సమాధిని స్థాపించారు నేలమాళిగలో సమాధి చుట్టూ ఏడుగురు మహర్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఆవరణలో 108 గదులను నిర్మించారు. వీటితోపాటు 2000 స్తంభాలు కూడా ఉన్నాయి. ఆలయ శిఖరం 135 అడుగులు. నాలుగు అంతస్తుల ఈ ఆలయంలో పాఠశాల, కళాశాలను కూడా నిర్మించారు. ఆలయం అడుగు భాగాన రెండు లక్షల టన్నుల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ధోల్ పూర్ లోని బంషి పర్వత రాయిని ఆశ్రమ నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇక, ఈ శివాలయాన్ని విశ్వదీప్ గురుకుల్ ట్రస్టు నిర్మించింది. 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవాలనుకునే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించొచ్చు.



Click it and Unblock the Notifications













