ప్రపంచంలోనే ఏకైక తేలియాడే పార్కు ఎక్కడుందో తెలుసా?!
ప్రపంచంలోని ఏకైక తేలియాడే పార్కుగా ప్రసిద్ధి చెందింది కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్. ఇది మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో ఇంఫాల్ నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన నీటి గడ్డి పొరలతో ఏర్పడిన ద్వీపాలు సరస్సుపై తేలియాడే రూపాన్ని అందిస్తాయి. జాతీయ ఉద్యానవనం యొక్క చిత్తడి నేల 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ పార్క్ పాబోట్, తోయా మరియు చింగియావో అనే మూడు కొండలను అనుసంధానించబడి ఉంటుంది. పార్క్ చుట్టూ పచ్చదనం కమ్మేసిన చిత్తడి నేలలు మరియు కొండలు ఉన్నాయి. వర్షాకాలంలో ఇందులోని పెద్ద క్షీరదాలకు ఈ కొండలు ఆశ్రయం కల్పిస్తాయి.

ఫుమిడిస్ ప్రత్యేకత..
ఈ పార్క్ లోక్తక్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉంది. ఇది తూర్పు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో ఫుమిడిస్ (స్థానికంగా ఫమ్ అని పిలుస్తారు) అని పిలువబడే తేలియాడే ద్వీపాలు దర్శమిస్తాయి. శాస్త్రీయ పద్ధతిలో వీటిని పరిశీలిస్తే ఎక్కువ ప్రాంతం పూర్తిగా బయోమాసెస్ లేదా కుళ్ళిన మొక్కల పదార్థాలతో కప్పబడి ఉంటుంది. వీటిపైనే మత్స్యకారులు నివసించేవారు. ఫుమిడిస్ కొన్ని సెంటీమీటర్ల నుండి రెండు మీటర్ల వరకు మందాన్ని కలిగి ఉంటాయి.
ఇవి నీటి కింద 4/5 భాగంతో తేలుతాయి. ఈ ఫుమిడిస్ సహజంగా చిత్తడి నేలలో ఏర్పడతాయి. సేంద్రీయ చెత్త, బయోమాస్ మరియు గట్టిపడిన నేల కణాలతో తయారు చేయబడతాయి. నీటికింద భాగంలో ఉన్నప్పటికీ ఫుమిడిస్ తేలియాడుతూ జంతువులు మరియు మానవులు కూడా నడవడానికి తగినంత బలంగా ఉంటాయి.

ప్రేరణగా డ్యాన్స్ డీర్..
ఈ జాతీయ ఉద్యానవనం అంతరించిపోతున్న నుదురు-కొమ్ముల జింకలకు నిలయంగా ఉంది. దీనిని సాధారణంగా సంగై అని పిలుస్తారు. అరుదైన మరియు అంతరించిపోతున్న సంగై లేదా నుదురు-కొమ్ముల జింక 1975 కాలంలో 15 వరకు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇవి ముందుకు పొడుచుకు వచ్చిన కొమ్ములు కనుబొమ్మల నుండి బయటకు వచ్చినట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించిన తర్వాత కఠినమైన పరిరక్షణ చర్యలతో వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
నుదురు-కొమ్ముల జింకను డ్యాన్స్ డీర్ అని కూడా అంటారు. మణిపురి నృత్య సంప్రదాయాలకు ఈ జింక ప్రేరణగా చెప్పుకొవచ్చు. సంగై 1951లో అంతరించిపోయినట్లు నివేదించబడింది. తదనంతర కాలంలో వాటి సంతతి వృద్ధి చెందుతూ కెయిబుల్ లామ్జావో ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మార్చేశాయి.

జీవజాతులకు ఆవాసం..
మార్బుల్ క్యాట్ మరియు ఏషియన్ గోల్డెన్ క్యాట్ వంటి అరుదైన అడవి పిల్లులు అప్పుడప్పుడు నేషనల్ పార్క్లో కనిపిస్తాయి. హిమాలయన్ బ్లాక్ ఎలుగుబంటి మరియు మలయన్ ఎలుగుబంటి వంటి ఇతర జంతువులు కూడా కనిపిస్తాయి. వివిధ రకాల చేపలు మరియు తాబేళ్లు, వైపర్ మరియు నాగుపాము వంటి సరీసృపాలకు కూడా ఈ జాతీయ ఉద్యానవనం ఆవాసంగా చెప్పుకోవచ్చు. లోక్తక్ సరస్సులో ఉన్న సెంద్ర ద్వీపంలోని ప్రభుత్వ పర్యాటక బంగ్లా ఇక్కడికి వచ్చే సందర్శకులు విడిది చేసేందుకు అనువైనది ఉంటుంది. పార్కుకు సమీపంలోని ఫుబాలాలో విశ్రాంతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంఫాల్ ప్రాంతం మరింత మెరుగైన వసతి సౌకర్యాలను అందిస్తుంది.
నేషనల్ పార్క్ సమీపంలో తినేందుకు అనేక వెరైటీ రుచులు అందుబాటులో ఉంటాయి. ఇంఫాల్లో చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్ మరియు ఫ్రెంచ్ వంటకాలను అందించే అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. స్థానికులు చేపలను కూడా శాఖాహారంగా పరిగణిస్తారు. కాబట్టి మీరు స్వచ్ఛమైన శాఖాహార వంటకాల కోసం చూస్తున్నట్లయితే, ఆహారం ఎంపిక విషయంలో చాలా అలర్ట్గా ఉండాలని మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications













