'జంగల్దేశ్' నగరాన్నిఎప్పుడైనా సందర్శించారా? !
ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీ గమ్యస్థానాన్ని ఎంచుకునే ముందు తప్పనిసరిగా కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. చాలామంది సందర్శించేందుకు కొత్త కొత్త ప్రదేశాలను ఎంచుకుంటుంటారు. మరికొందరు చరిత్ర, సహజ వైవిధ్యం మరియు అందమైన దృశ్యాలను చూడాలనుకుంటారు. ఆ కోవకు మీరు చెందితే మాత్రం ఇప్పడు చెప్పబోయే ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. దీని పేరు నాగౌర్. ఇది దేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు నగరం. రాజస్థాన్ మధ్యలో ఉన్న నాగౌర్ను మహాభారత కాలంలో జంగల్దేశ్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దానిని రాజా అమర్ సింగ్ రాథోడ్కు బహుమతిగా ఇచ్చాడు. మరెందుకాలస్యం నాగౌర్లో సందర్శించాల్సిన ప్రాంతాల గురించి తెలుసుకుందామా?

మీరా బాయి మెమోరియల్
మీరా బాయి మోమోరియల్లో ఆమె జీవిత కథను ఒక లైట్ సౌండ్ షో ద్వారా చూపబడుతుంది. ఈ షోలో ఆమె బాల్యం, శ్రీకృష్ణునిపై ప్రేమ, అతనిని భర్తగా, ఆరాధ్యుడిగా భావించడం, మేవార్ యువరాజుతో మీరా బాయి వివాహం, భర్త మరణం, రాజ వైభవాన్ని విడిచిపెట్టి, త్యజనా మార్గంలో వెళ్లడం, బృందావనం-ద్వారకలో ఉండడం వంటివన్నీ కలర్ఫుల్ లైట్లు, ఆడియో ద్వారా మనోహరమైన ప్రదర్శనను ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అందిస్తారు. ఆ సమయంలో మీరా బాయి సంగీత భజనలతో వాతావరణమంతా భక్తిశ్రద్ధలతో మారుమోగుతుంది.

నాగౌర్ కోట
నాగౌర్ కోటను రెండవ శతాబ్దంలో నాగ్ రాజవంశం పాలకుడు నిర్మించాడని ఇక్కడివారు నమ్ముతారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఈ కోటను పునర్మిర్నాణించారు. అనేక యుద్ధాలకు సాక్షిగా ఉన్న ఈ కోట రాజ్పుత్-మొఘల్ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఇది ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి మొఘల్ కోటలలో ఒకటి. 2007 సంవత్సరంలో, ఇది ఫౌంటైన్లు మరియు అందమైన తోటలతో పునరుద్ధరించబడింది. ఈ కోట సూఫీ సంగీత ఉత్సవాల నిర్వహణకు ప్రసిద్ధి చెందింది.

కుచమన్ కోట
ఇక్కడ నిర్మించిన హవేలీలు వాటి అద్భుతమైన వాస్తుశిల్పం కారణంగా షేఖావతి హవేలీలను పోలి ఉంటాయి. ఇక్కడ అతి ముఖ్యమైన కుచమన్ కోట చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కోటను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు. నిటారుగా ఉన్న కొండ పైభాగంలో నిర్మించబడిన ఇది రాజస్థాన్లోని అత్యంత పురాతనమైన మరియు దుర్గమమైన కోట. దానిలో అద్భుతమైన వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులు, అద్భుతమైన కుడ్యచిత్రాలతో పాటు అందమైన ప్యాలెస్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ జోధ్పూర్ పాలకుడి బంగారు మరియు వెండి నాణేలు కూడా ఉన్నాయి. ఈ కోట నుండి, నగరం యొక్క విశాల దృశ్యం మాత్రమే కాకుండా సరస్సు మరియు నగరంలోని పాత దేవాలయాలు, జావ్ కి బావడి, అందమైన హవేలీలను కూడా చూడొచ్చు.

అహిఛత్రఘర్ కోట మరియు మ్యూజియం
నాగౌర్లో నిర్మించిన అహిఛత్రగఢ్ను ఫోర్ట్ ఆఫ్ హుడెడ్ కోబ్రా అని పిలుస్తారు. అంటే, దాని అర్థం నాగరాజు వినోదం అని. సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కోటను 1985లో మెహ్రాన్గఢ్ మ్యూజియం ట్రస్ట్కు అప్పగించారు. ఇక్కడి ప్యాలెస్లలో చారిత్రాత్మకమైన రాజ కుర్చీలు, టేబుల్లు, సోఫాలు, బెడ్లు మొదలైనవి ఉన్నాయి. గోడలపై రాయల్ పెయింటింగ్లే కాకుండా అద్భుతమైన అలంకార వస్తువులు కూడా ఉన్నాయి. 2002లో, నాగౌర్ కోటకు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు లభించింది. ప్రతి సంవత్సరం నాగౌర్ కోటలో వరల్డ్ సేక్రెడ్ స్పిరిట్ ఫెస్టివల్ను నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications













