“నారింజ నగరం” గా పిలవబడే నాగపూర్ మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన నగరం. ముంబై, పూణేల తరువాత ఇది మూడవ అతి పెద్ద నగరం. దీన్నే ‘భారత దేశపు పులుల రాజధాని’ అని కూడా అంటారు. గోండ్ వంశస్తులు స్థాపించిన నాగపూర్ నగరాన్ని తర్వాత మరాఠా భోంస్లే రాజులు హస్తగతం చేసుకున్నారు. అనంతర కాలంలో బ్రిటీష్ వారు చేజిక్కించుకుని దీనిని సెంట్రల్ ప్రావిన్సెస్ కు రాజధాని గా చేశారు.
ఆసక్తికరంగా నాగపూర్ కి సర్పంలా కదిలే నాగ అనే నది నుంచి, సంస్కృతం, హిందీ లలో నగరాల్ని సూచించే ఉపచయం ‘పూర్’ తో కలిసి – నాగపూర్ అనే పేరు వచ్చింది. ఈ నగరంపై విడుదల చేసిన తపాల బిళ్ళ పై కూడా ఇప్పటికీ పాము బొమ్మ వుంటుంది. డెక్కన్ పీఠ భూమి లో 310 మీటర్ల ఎత్తులో వుండి దాదాపు 10000 చదరపు కిలోమీటర్ల మేర నాగపూర్ విస్తరించి వుంది. నాగపూర్ పచ్చని వాతావరణం కలిగిన నగరం గా పేరుపొందింది, చండీగడ్ తర్వాత హరిత నగరం ఇదే. మహారాష్ట్రకు ముంబై తర్వాత ఇది రెండో రాజధాని.
నాగపూర్ – చరిత్ర, ప్రకృతి, ఆనందాల మేలుకలయిక :
నావెగావ్ బాంద్, సీతాబుల్ది కోట, పెంచ్ జాతీయ పార్క్ ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో కొన్ని. డాక్టర్ BR అంబేద్కర్ ను అనుసరించి వేయి మంది దళితులు బౌద్ధంలోకి మారిన చారిత్రక స్థలం దీక్షా భూమి.
నాగపూర్ జాతీయ కేంద్రంలో శూన్య మైలు వుంది – ఇది అన్ని నగరాల దూరాలు చెక్కి వున్న రాతి స్థంభం. దీన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు.
నాగపూర్ నిండా పరుచుకుని వున్న చెరువులు - అటు ప్రాక్రుతికమైనవి, మానవ నిర్మితాలు కూడా చూసి తీరవలసినదే. ఉదాహరణకి, అమ్బాజారి చెరువు ఆహ్లాదకరమైన సాయంకాలాలు గడపాలనుకునే కుటుంబాలకి, పిల్లలకి చాలా ఆనందాన్నిస్తుంది.
నగరం మొత్తాన్ని చూడ్డానికి వీలుండే చిన్న కొండ సెమినరీ హిల్స్ – ఇక్కడ వున్న బాలాజీ మందిరం చాల పెద్దది. పర్వతారోహకులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు, ఎందుకంటే కొండ పైకి ప్రయాణం చాల సవాళ్లు విసిరేదిగా వుంటుంది. ఇక్కడ చూడాల్సిన వాటిలో శ్రీ పోద్దరేశ్వర దేవాలయం, శ్రీ వెంకటేశ దేవాలయం ముఖ్యమైనవి. బుద్ధుడి కోసం నిర్మించిన డ్రాగన్ పేలస్ దేవాలయం కూడా చూడవచ్చు.
అందంగా తీర్చి దిద్దబడిన మహారాజ బాగ్ లో ఒక జంతు ప్రదర్శన శాల కూడా వుంది. దీన్ని భోంస్లే రాజులు స్థాపించారు. ఆంగ్ల మరాఠా యుద్ధంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకార్ధం సీతాబుల్ది కోట నిర్మించారు. మరోవంక గావిల్గడ్ కోట 300 ఏళ్ళ క్రితం నిర్మించిన పెద్ద, భారీ కోట.
నవరాత్రి, దసరా, వినాయక చవితి, దుర్గా పూజ, మొహర్రం లాంటి పర్వదినాల్లో నాగపూర్ ఒక పెద్ద యాత్రా స్థలంగా మారిపోతుంది. ఈ పండుగలన్నీ వైభవంగా, సౌహార్దం తో జరుపుకుంటారు.
ఇక్కడ ప్రయత్నించి తీరాల్సినవి :
నాగపూర్ సందర్శించే యాత్రికులు విశ్వ విఖ్యాతమైన ఇక్కడి నారింజకాయలు (కమలా ఫలాలు) కొనకుండా వుండలేరు. మీరు తిరిగి వెళ్ళాక ఇంటిలోని వారికి బహుకరించడానికి ఇక్కడి అనేక దుకాణాల్లో దొరికే వివిధ కళాకృతులు, జ్ఞాపికలు, కానుకలు కొనుక్కోవచ్చు. ఇక్కడ రుచిగా వుండే వర్హది వంటకాలు రుచి చూడండి. ఈ పదార్ధాలు మనలాగా ఘాటైన రుచులు భరించలేని విదేశీయులకైతే కారంగానే అనిపిస్తాయి.
డెక్కన్ పీఠభూమి లో వుండడం, చుట్టూ ఎలాంటి జలాశయం లేకపోవడం వల్ల నాగపూర్ వేసవిలోనూ, శీతాకాలంలోనూ చాల వేడిగా వుంటుంది. ఇక్కడ వేసవి ఎండలు చాల తీవ్రంగా వుంటాయి, ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు చేరతాయి, అయితే శీతాకాలం చల్లగా భరించగలిగేదిగా వుంటుంది. వర్షాకాలం ఇక్కడికి రావడానికి అనువైన సమయంకాదు, అయితే శీతాకాలం మాత్రం రాదగ్గ సమయం.
నాగపూర్ – ప్రధాన కేంద్ర స్థానం :
నాగపూర్ దేశానికి దాదాపు నడిబొడ్డున, అన్ని ప్రధాన నగరాలకు సమాన దూరం లో వుంటుంది. ప్రధాన నగరం కావడం తో వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానం చేయబడి వుంటుంది. వాయుమార్గంలో ప్రయాణించేటట్లయితే నాగపూర్ లోని సోనేగావ్ విమానాశ్రయానికి వెళ్ళే విమానం ఎంచుకోండి. నాగపూర్ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని రైల్వే లైన్లకు కేంద్ర కూడలి. కాబట్టి రైల్లో ప్రయాణించడం కూడా మంచి ఎంపికే. రోడ్డు ద్వారా అయితే నాగపూర్ రెండు ప్రధాన జాతీయ రహదార్లకు కూడలి గా పని చేస్తుంది. కాబట్టి బస్సుల కొరత కూడా లేదు – ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ బస్సులో కూడా నాగపూర్ చేరుకోవచ్చు.
దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటైన నాగపూర్ యాత్రా పరిశ్రమ నుంచి చాల ఆదాయం గడిస్తుంది. సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం, ఆధ్యాత్మికత, ప్రకృతి ఈ నగరంలో వేళ్ళూనుకుని వున్నాయి – ఇది ఈ నగరానికి గర్వ కారణం. దేశ చరిత్రకు దగ్గరగా జరగండి, ఈ చారిత్రక నగరం మిమ్మల్ని ఆ అద్భుత కాలాలకు తీసుకువెళ్తుంది.