అలనాటి చరిత్రకు సాక్ష్యాలు.. ఢిల్లీ వీధులు!
ఢిల్లీ పేరు వినగానే మనకు అనేక చారిత్రకాంశాలు గుర్తొస్తాయి. దేశ రాజధాని కేంద్రంగా ఒకనాటి రాజరికపు ఆనవాళ్లు నేటికీ ఢిల్లీలో పలుచోట్ల తారసపడతాయి. పురానాఖిల్లా, కుతుబ్మనార్, చెక్కుచెదరని.. నాటి ప్రాచీన ఇనుప స్తంభం, రాష్ట్రపతి భవనం, జంతర్ మంతర్, జమా మసీదు.. ఒకటేమిటి? ఢిల్లీలో అడుగడుగునా ప్రాచీన చారిత్రక వైభవం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ఢిల్లీ నగరవీధుల్లో ఒకసారి విహరిద్దాం రండి!
ఢిల్లీ అనే పేరు రావడానికి స్థానికంగా రకరకాల కథలు వినిపిస్తుంటాయి. క్రీస్తుపూర్వం 800వ సంవత్సరంలో ధిలు, అనే పేరు కలిగిన రాజు ఆ పట్టణాన్ని నిర్మించాడని, అతడి పేరు మీద ఈ పట్టణానికి ఢిల్లీ అనే పేరు వచ్చిందని స్వామి దయానంద రచనల్లో ఉంది. మరొక కథనం ప్రకారం, ఢిల్లీ అనే ప్రాకృత పదానికి వదులుగా ఉండటమనే అర్ధం ఉంది. ఢిల్లీలోని ఇనుపస్తంభం మూలం బలహీనంగా ఉండడంవల్ల నాటి తోమార రాజులు దీనిని ఢిల్లీ అని పిలిచేవారంటారు.

తోమారుల నాణేలను దేలివాల్ అనేవారు. వేరొక కథనం ప్రకారం ఇంద్రప్రస్థను పరిపాలిస్తున్న పృథ్విరాజు ప్రస్తుతం పురానా ఖిల్లా ఉన్న ప్రాంతంలో నాలుగు కులాల వారు కలిసి జీవించడానికి అనువుగా ఒక కొత్త కోటను కట్టాడని, ఈ కోట ప్రవేశద్వారాన్ని దేహాలి అని వ్యవహరించేవారని, అదే కాలక్రమంలో ఢిల్లీగా రూపాంతరం చెందిందని ఇంకొక కథనం. దేహాలీ లేదా దెహ్లోజ్ అనే పదానికి ప్రవేశద్వారం లేదా ప్రాంగణమని అర్థం. ఈ పదం వికృత రూపమే ఢిల్లీ అని అంటారు.
ఇండియా గేట్
ఢిల్లీ నగరం పాత ఢిల్లీ, కొత్త ఢిల్లీ అని రెండుగా విస్తరించింది. కొత్త ఢిల్లీలో ప్రధానంగా చూడదగినది 42 మీటర్ల ఎత్తయిన ఇండియా గేట్. మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన తొమ్మిది వేలమంది భారతీయ సైనికుల స్మారకచిహ్నం ఇండియా గేట్. సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఈ కట్టడానికి రూపకల్పన చేసి, నిర్మాణాన్ని ప్రారంభించారు. 1931లో ఈ కట్టడం నిర్మాణం పూర్తయింది. రాజ్పథ్ మార్గంలో నిర్మించిన ఈ కట్టడంపై ప్రపంచయుద్ధంలో మరణించిన సైనికుల పేర్లను చెక్కారు. ఇండియా గేట్ వద్ద నిరంతరం ఒక జ్యోతి వెలుగుతుంటుంది. దీనిని అమరవాన్ జ్యోతి అంటారు. ఢిల్లీలో పర్యాటకులను అత్యధికంగా ఆకర్షించే కట్టడాల్లో ఇండియా గేట్ ప్రధానమైనది.

సలీమ్ ఘఢ్ కోట
సలీమఢ్ కోట ప్రస్తుతం ఎర్రకోట సముదాయంలో భాగంగా గుర్తింపు పొందింది. దీనిని 1546లో నిర్మించారు. ఉత్తరదిశగా ఈ కోటలోకి ప్రవేశించడానికి వీలుగా 1854-55 సంవత్సరాల్లో మొగలాయి చక్రవర్తుల్లో ఆఖరివాడైనా బహదూర్ షా జఫర్ నిర్మించాడు. ఇటుకలు, ఎరుపురంగు ఇసుక రాతితో ఈ ద్వారాన్ని నిర్మించారు. ఔరంగజేబు కుమార్తె జేబున్నీసాను ఈ కోటలోనే ఖైదు చేశారు. ఆంగ్లేయులు కాలంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని ఖైదు చేయడానికి ఈ కోటను ఉపయోగించుకున్నారు.

జమా మసీదు
మనదేశంలో నిర్మించిన తొలినాటి మసీదుల్లో జమా మసీదు ఒకటి. షాజహాన్ కాలంలో ఈ మసీదును నిర్మించారు. ఈ మసీదులో ఒకేసారి 25 వేల మంది ప్రార్ధనలు చేసుకోవడానికి అనువైన హాలును నిర్మించారు. ఈ మసీదు నిర్మాణం 1644లో ప్రారంభమై, 1658లో పూర్తయింది. భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా ఇది గుర్తింపు పొందింది. ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ మసీదు నిర్మాణ శైలీ, కళానైపుణ్యాలు సందర్శకుల్ని అబ్బురపరుస్తాయి.

కుతుబ్ మినార్
దక్షిణ ఢిల్లీలోని మెహ్రాలి ప్రాంతంలో కుతుబ్ మినార్ ఉంది. ఢిల్లీని పరిపాలించిన కుతుబుద్దీన్ ఐబక్ తన విజయానికి చిహ్నంగా నిర్మించిన స్తంభమిది. కుతుబుద్దీన్ 1206లో దీని నిర్మాణాన్ని ఆరంభించాడు. అతడి పరిపాలన కాలంలో ఒక అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయింది. ఈ నిర్మాణంతోనే భారతదేశంలో ఇండో ఇస్లామిక్ శైలి అనేది ఆరంభమైంది. అతడి తరువాత అధికారంలోకి వచ్చిన ఇల్తుత్మిష్ మిగిలిన అంతస్తులను పూర్తిచేశాడు. తరువాత కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ 1368లో మినార్లోని నాలుగో అంతస్తును తొలగించి, తెల్ల పాలరాయితో రెండు అంతస్థులను నిర్మించాడు.
72.5 మీటర్ల ఎత్తు కలిగిన అత్యద్భుతమైన ఈ నిర్మాణం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీని గోడలపై అందమైన డిజైన్లను, ఖురాన్లోని పద్యాలను చెక్కారు. కింది నుంచి పై వరకూ వలయాకారంలో 380 మెట్లు ఉన్నాయి. ముస్లిం పాలకులు భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణంగా కుతుబ్ మినార్ గుర్తింపు పొందింది.

ఐరన్ పిల్లర్
కుతుబ్ మినార్ సమీపంలోనే ప్రాచీన ఇనుప స్తంభం ఉంది. ఈ స్తంభంపైన గుప్తులకాలం నాటి బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనాలను బట్టి ఇది చంద్రగుప్తుడి కాలం నాటిదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాగా, మరికొంతమంది శాస్త్రవేత్తలు మౌర్యుల కాలం నాటి చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అంటే, క్రీస్తుశకం 402లో నిర్మించిన స్తంభంగా పేర్కొన్నారు. ఈ ఇనుపస్తంభం ప్రాచీనకాలంలో భారతీయులు లోహాలతో ఎంతగా ఆటలాడుకున్నారో తెలియజేస్తుంది. ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఈ స్తంభం తుప్పు పట్టకపోవడం పురావస్తు శాస్త్రజ్ఞులను, భౌతిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గంధకం ఎక్కువ పరిమాణంలో ఉన్న ఇనుము మీద ఏర్పడిన ఐరన్ హైడ్రోన్ ఫాస్పేట్ ఇందుకు కారణమని తేల్చారు. భారతదేశం లోహవిజ్ఞానంలో సాధించిన పురోగతికి ఈ స్తంభమే తార్కాణం. 7.21 మీటర్ల ఎత్తులో ఉండే ఈ స్తంభం కేవలం 1.12 మీటర్ల మేరకు మాత్రమే భూమిలో ఉంటుంది. స్తంభం పైభాగంలో అందమైన పద్మం ఆకారం ఉంటుంది. ఈ స్తంభం సందర్శించడానికి వచ్చేవారిలో కొందరు వీపు స్తంభానికి ఆన్చి, రెండు చేతులను వెనుకకు జాపి, కలిపి పట్టుకుంటుంటారు. దీంతో స్తంభం కింది భాగంలో రంగు మారింది. దీంతో 1997లో ఈ స్తంభం చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేశారు.
ఇవేకాకుండా రాష్ట్రపతి భవనం, మొఘల్ గార్డెన్స్, పార్లమెంటు భవనం, అక్షరధామ్ ఆలయం మొదలైనవి పర్యాటకుల మనసును దోచుకుంటాయి. అందుకే దిల్ను దోచుకునే ఢిల్లీ అని స్థానికులు పిలుస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన, రైలు, రోడ్డు మార్గాల్లో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications











