ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ చారిత్రక కట్టడాలు, అతి పురాతనమైన నగరాలు మరెన్నో. ఇక్కడి అత్యంత చారిత్రాత్మక నగరాలలో కడప ఒకటి. కడపను దక్షిణ భారతదేశంలోని ప్రపంచ-ప్రసిద్ధ మత కేంద్రమైన తిరుమలకు ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో అందమైన దేవాలయాలు, అద్భుతమైన కోటలు ఉన్నాయి.
ఈ ప్రాంతం అనేక కొండలతో చుట్టుముట్టబడి ఉంటుంది. పాల్కొండ కొండలు, నల్లమల కొండలతో చుట్టుముట్టబడింది కడప పాత నగరం. ఇది పెన్నానది ఒడ్డు నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే సిద్దవటం కోట..ఆ కోట విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
ఇది కడప జిల్లాలోనే నేటికీ చెక్కు చెదరని అద్భుత కట్టడంగా విరాజిల్లుతుంది. సిద్ధవటం కోట కడప నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని " గేట్వే టు శ్రీశైలం" లేదా "దక్షిణ కాశి " అని కూడా పిలుస్తారు. ఈ కోట పెన్నార్ నది ఒడ్డున ఉంటుంది. ఈ కోట లోపల వివిధ దేవాలయాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ కోట ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది.
సిధౌట్ కోట 1303 AD లో నిర్మించబడింది. ఈ కోట శ్రీ కృష్ణ దేవరాయల అల్లుడు వరద రాజు పాలనలో అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. వరదరాజుల పాలనలోకి రాకముందు ఇది ఒక మట్టి కోటగా మట్టి రాజుల పాలనలో ఉండేది. అంతకు ముందు ఇది ఉదయగిరి రాజ్యంలో ఓ భాగంగా ఉండేదట. ఈ కోటని హిందూ, ముస్లిం రాజుల పరిపాలించడం వలన కోటలో ఇరు మతాలకి సంబంధించిన నిర్మాణ శైలి పర్యాటకులు చూడొచ్చు..

అనేక దేవాలయాలకు నిలయం..
సిధౌట్ కోట సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది పెన్నార్ నది ఒడ్డున ఉంది. కోట ప్రాంగణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో దుర్గా దేవాలయం, సిద్ధేశ్వరాలయం, బాల బ్రహ్మ దేవాలయం, రంగనాయక స్వామి దేవాలయం ఉన్నాయి. ఈ కోట ప్రధాన ద్వారాలు మూసివేసిన కూడా సందర్శకులు ప్రవేశించేందుకు సహాయక మార్గం ఉంది. ఇదే ఈ కోట ప్రాముఖ్యత.
కోట పైభాగంలో గజలక్ష్మి శిల్పాలు సులభంగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని రక్షించడానికి ఉపయోగించిన 17 చదరపు బురుజులను కూడా పర్యాటకులు చూడొచ్చు. అంతే కాకుండా శత్రువుల నుండి రక్షణ కోసం కోట చుట్టూ కందకాలు తవ్వించారు. అందులో పెన్నానది ద్వారా నీటిని నింపారు. నవాబు పరిపాలనలో తన కోసం కోటలో మసీదు, ఓ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మసీదు పెన్నా నది ఒడ్డున వుండి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

కోటలో సొరంగ మార్గం..
ఈ కోట మధ్యలో ఓ గోపురం కూడా ఉంది. దాని పక్కనే ఒక నంది విగ్రహం తల శిథిలమై పర్యాటకులకు దర్శనమిస్తోంది. ఇక్కడ కామాక్షి ఆలయం కూడా ఉంది. అది పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం దాన్ని మరమ్మత్తులు చేసి అందంగా తీర్చిదిద్దారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. దర్గా పక్కనే ఓ మసీదు కూడా ఉంటుంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో ఓ సొరంగ మార్గం కూడా ఉది.
ఈ సొరంగ మార్గాన్ని నదిలోకి తెరుచుకునే విధంగా నిర్మించారు. ఈ సిధౌట్ కోటను ఏ మార్గం ద్వారానైనా వెళ్లే అవకాశం ఉంది. ఈ కోటను చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఎంతో ఉత్తమం. వాటి ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ కడపలో సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప బస్ స్టాప్ కోట నుండి 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరందుకాలస్యం మీరు కూడా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి..



Click it and Unblock the Notifications













