ళుల శిల్పకళా రీతికి దర్పణం..గంగైకొండ ఆలయం..
భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలలో తమిళనాడు ఒకటి. తమిళనాడు దేవాలయాలు, ఎత్తైన గోపురాలతో పాటు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి సందర్శించడానికి తమిళనాడులో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయాలు, కళాత్మక సౌరభాలు, గోపురాలు, శిల్పకళా చాతుర్యాన్ని చూడడానికి దేశంలోని అనేక మూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. తమిళనాడులోని పురాతన నగరాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. తమిళనాడు ఆలయాలన్నింటిలో కెల్లా పెద్దది తంజావూర్ బృహదీశ్వరాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని పోలిన మరో ఆలయం గంగైకొండ చోళపురం. ఈ ఆలయం గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఎక్కడ ఉంది..
గంగైకొండ చోళపురం లేదా గంగైకొండచోళీశ్వర దేవాలయం తమిళనాడులోని అరియలూరు జిల్లాలో ఉంది. 250 సంవత్సరాలకు పైగా చోళ రాజవంశానికి రాజధానిగా ఉన్న గంగైకొండ చోళపురంలో ఒక భాగమైన పురాతన పట్టణం నుండి ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా ఈ ఆలయం పేరు చేర్చబడింది. గంగైకొండ చోళపురంలో రాజ రాజ చోళుడి కుమారైన మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు. అయితే ఇతని తండ్రి నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో ఆలయాన్నిమొదటి రాజేంద్ర చోళుడు ఇక్కడ నిర్మించాడు.
ఆలయ చరిత్ర
భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఈ ఆలయం ఒకటిగా పరిగణించబడింది. గంగైకొండ చోళపురం ఆలయంలో శివుడు ప్రధాన దైవం. ప్రధాన ఆలయ గోపురం 55 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గంభీరమైన భవనం గొప్ప కళ, శిల్పాలతో నిండి ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణం సంపూర్ణ వైభవంగా అలంకరించి ఉంటుంది. అద్భుతమైన ఆలయం ఎత్తైన నిర్మాణంపై నిర్మించబడింది. 170 మీటర్ల ఎత్తు, 98 మీటర్ల వెడల్పుతో అద్భుతమైన ప్రాంగణం ఉంది. 13 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం ఇక్కడ ఉంటుంది. నిర్మాణపు ప్రధాన భాగం 341 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది.

ఆలయ నిర్మాణం..
ఈ ఆలయ నిర్మాణానికి సుమారు తొమ్మిదేళ్లు పట్టిందట. అంతేకాదండోయ్, ఈ ఆలయ నిర్మాణంలో కూలీల కంటే భక్తులే ఎక్కువగా పాల్గొన్నారు. ఈ నిర్మాణంలో భాగంగా రాళ్లను లేపేందుకు, మోసుకెళ్లేందుకు అశ్వాలను, ఏనుగులను ఉపయోగించారు. ఈ ఆలయంలో ఎత్తయిన రాజగోపురం, ప్రహరీలు కూడా ఉంటాయి. విస్తీర్ణం పరంగా ఈ ఆలయం పెద్దదే అయినప్పటికీ, మొదటి రాజేంద్ర చోళుడు తన తండ్రి మీద గౌరవంతో ఆలయం ఎత్తు తగ్గించారని ఇక్కడివారు చెబుతున్నారు.
ఎలా వెళ్లాలి..
గంగైకొండ చోళపురం చేరుకోవటానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం ద్వారా అయితే, ఈ ఆలయ సమీపానికి ఉన్న విమానాశ్రయం నైవేలీ. ఇక్కడి నుండి క్యాబ్లు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇక, రైలుమార్గం ద్వారా అయితే సమీప రైల్వేస్టేషన్ మైలదుత్తురై. ఇక్కడి నుండి ఆటోలు ఉంటాయి. రోడ్డు మార్గం ద్వారా అయితే, చెన్నై, చిదంబరం, తంజావూర్, మైలదుత్తురై ప్రాంతాల నుండి ఈ ఆలయానికి నిత్యం ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు అందుబాటులోనే ఉంటాయి.



Click it and Unblock the Notifications













