భారతదేశంలో అతి ప్రాచీన నాగరికత సింధూ లోయ నాగరికత. ఇది క్రీ.పూ. 6000 నుండి క్రీ.పూ. 1500 సంవత్సరాల వరకు వర్ధిల్లింది. అప్పట్లోనే ప్లానింగ్ వేసి ఇళ్లను, కాలువలను, తాగునీటి సదుపాయాలను, బావులను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పరిశీలిస్తే వీరు పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది. సింధూ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదట వెలికి తీయటం చేత ఇది 'సింధూ లోయ హరప్పా నాగరికత' అని పిలువబడుతుంది.
హరప్పా ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్నది. భారతదేశంలో సింధూ లోయ నాగరికత కాలంలో వర్ధిల్లిన పట్టణాలు, నగరాలు పదుల సంఖ్యలో (ఇప్పటివరకు) ఉన్నాయి. ఈ నాగరికత లో దాదాపు పట్టణాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలలోనే (ముఖ్యంగా సింధూ నది) వెలిశాయి. అటువంటి పట్టణాలలో ఒకటి ధోలా వీరా.

తవ్వకాలలో బయటపడ్డ ధోలా వీరా
చిత్రకృప : Rama's Arrow
ధోలా వీరా - హరప్పా సింధూ లోయ నాగరికత కు చెందిన పట్టణం. ఇది గుజరాత్ రాణాఫ్ కచ్ ప్రాంతంలోని ఖాదిర్ బెట్ దీవిలో కలదు. దీనినే 'తిమ్భా ప్రాచీన్ మహానగర్ కొతాడ' అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ - ఈ ప్రదేశంలో తవ్వబడిన హరప్పా నగరం. పురావస్తు శాత్రవేత్తలు నాగరికతకు చెందిన విశేషాలను, భాషా, సంస్కృతి మరియు పట్టణ నిర్మాణంలో అనుసరించిన ప్లానింగ్ వంటివి అన్నీ తవ్వకాలలో కనుగొన్నారు. ఇది చరిత్రకారులకు ఒక డిస్కవరీ పట్టణంగా చెప్పవచ్చు.
ధోలా వీరా నగరాన్ని ఒక ముందస్తు ప్రణాళిక అనుసరించి నిర్మించారు. ఇందులో నగరం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఉన్నతంగా, రెండవ భాగం మధ్యస్థంగా మరియు మూడవ భాగం తక్కువగా ఉంటుంది. ఆతర్వాత వచ్చిన ఆర్యులు ఇదే ప్లాన్ ను మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో రాజులు, బ్రాహ్మణులు ఉండేవారు. రెండవ భాగంలో వ్యాపారులు, వర్తకులు ఉండేవారు. మూడవ భాగంలో పని చేసుకొని బతికేవారు (జాలర్లు, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరులు మొదలైనవారు) ఉండేవారు.

చిత్రకృప : Rahul Zota
ధోలా వీరా ప్రత్యేకత ఏమిటంటే, ఈ నాగరికతలో ఇతర పట్టణాలన్నీ ఇటుకలతో నిర్మించగా, ఇదొక్కటే రాతి తో నిర్మించారు. సిటీ మధ్యభాగంలో ఒక కోటను నిర్మించి నగరాన్ని బలపరిచారు.
మరొక ప్రధాన అంశం ఏమిటంటే, ఇక్కడి నీటి సరఫరా విధానం. దీనిలో ఎన్నో రిజర్వాయర్ లు కలవు. వివిధ కళాకృతులు , బంగారు ఆభరణాలు, పాత్రలు, ముద్రలు మరియు బంగారం వెండి , టెర్రా కోటా పాత్రలు, మేసపోటేమియా కి సంబంధించిన కొన్నిరకాల వస్తువులు, అన్నీ కూడా ఈ ప్రదేశ తవ్వాకాలలో బయట పడ్డాయి.

చిత్రకృప : Rahul Zota
భారతదేశ ఉపఖండంలో హరప్పా సైట్ ను అయిదవ అతిపెద్ద సైట్ గా గుర్తించారు. ప్రపంచంలో ఇప్పటివరకు కనిపెట్టబడిన అతి ఉన్నత నాగరికత విధానాలలో ఇది ఒకటి.
ధోలా వీరా ప్రదేశం 1967-68 సంవత్సరాలలో జరిపిన పురావస్తు తవ్వకాలలో బయటపడినది. ఈ ప్రాంతంలో 1990 నుండి ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే శాఖ నిరంతరం తవ్వకాలను జరుపుతూనే ఉంది.

రాతి బావి, ధోలా వీరా
చిత్రకృప : Nagarjun Kandukuru
ధోలా వీరా ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం : ధోలా వీరా కు సమీపాన భుజ్ ఎయిర్ పోర్ట్ కలదు.
రైలు మార్గం : కచ్ లో రైల్వే స్టయిన్ కలదు. ఇక్కడికి అన్ని ప్రధాన పట్టణాల నుండి రైళ్లు వస్తుంటాయి.
రోడ్డు మార్గం : ధోలా వీరా ప్రదేశం భుజ్ పట్టణానికి 218 కి. మీ ల దూరంలో కలదు. ఈ ప్రాంతాన్ని వయా భాచావు మరియు రాపార్ ల మీదుగా ద్వీపంలో ఉన్న ధోలా వీరా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













