భారతదేశంలో సందర్శించాల్సిన ప్రదేశాలకు కొరతే లేదు. అడ్వంచర్ ట్రిప్ చేయాలనుకునేవారికి ఇక్కడ ఎన్నో ప్రదేశాలు సాదర ఆహ్వనం పలుకుతున్నాయి. భారతదేశంలో అత్యంత సాహసోపేతమైన వంతెనలు ఉన్నాయి. అందంతో పాటు అవి అడ్వంచర్ ట్రిప్గా కూడా ప్రసిద్ధిగాంచాయి. కాబట్టి ఈ సెలవుల్లో కుటుంబంతో గానీ, స్నేహితులతో కానీ, ఈ వంతెనలు చూసేయండి. వీటిని చూసేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. సాహసం అంటే స్కై డైవింగ్, స్కీయింగ్, పారాగ్లైడింగ్ మాత్రమే కాదు. పర్యాటకులు స్వయంగా చేయడం లేదా చూడటం ద్వారా థ్రిల్గా భావించే ప్రతిదీ సాహసోపేతంగా ఉంటుంది. భారతదేశంలోని అత్యంత సాహోసోపేతమైన వంతెనలు చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశాలను మీ పర్యటన జాబితాలో చేర్చండి.
పాంబన్ వంతెన, తమిళనాడు
తమిళనాడులో ఉన్న పాంబన్ వంతెనను చూసేందుకు నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది భారతదేశంలోని మొదటి సముద్ర వంతెనగా ప్రసిద్ధిచెందింది. ఇది 1914లో ప్రారంభమైంది. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన గుండా వెళ్లడం అద్భుతమైన సాహసమనే చెప్పుకోవాలి. పాంబన్ ఒక రైల్వే వంతెన. ఇది రామేశ్వరాన్ని పాంబన్ ద్వీపాన్ని కలుపుతూ ఉంటుంది. దాదాపు 145 స్తంభాలపై ఉన్న ఈ వంతెన ఇంజనీరింగ్ నైపుణ్యతకు ఒక ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు ఎప్పుడూ ఇక్కడికి తరలివస్తుంటారు. సముద్రం గుండా నౌకలు వెళ్లేందుకు వీలుగా ఈ వంతెన ప్రత్యేక లక్షణాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ వంతెన 1 మీటర్ వెడల్పు మరియు 2.5 పొడవును కలిగి ఉంది. కంటికి కనిపించేంత వరకు క్రిస్టల్-క్లియర్ మణి జలాలతో ఈ వంతెన చుట్టుముట్టబడి ఉంటుంది.

లివింగ్ రూట్ బ్రిడ్జ్, మేఘాలయ
లివింగ్ రూట్ బ్రిడ్జ్లు మేఘాలయలోని అత్యంత అందమైన స్పష్టమైన వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందాయి. ఈ ప్రదేశం ఇటీవల తాత్కాలిక UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా చేర్చబడింది. ఈ వంతెనలను శతాబ్దాలుగా ఇక్కడ ఉన్న ఖాసీలు, జైంతియాలు అనే ప్రజలు నిర్మించారు. వర్షాకాలంలో పొంగి ప్రవహించే నదులను దాటేందుకు ఈ వంతెనలను ఇక్కడివారు ఉపయోగిస్తారు. ఇవి చెట్ల వేర్ల నుండి తయారైనవి. అందుకే దీనికి లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనే పేరును పెట్టడం జరిగింది. అయితే, ఈ వంతెనకు వెళ్లే మార్గం అంత సులభం కాదు. ఈ మార్గం గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి చేరుకోగానే అలసట అంతా మటుమాయమవుతుంది. ఉమ్షియాంగ్ నదిపై నిర్మించిన ఈ వంతెన డబుల్ డెక్కర్ వంతెనగా పేరుగాంచింది. మేఘాలయలో పర్యాటకులు ఇలాంటి అనేక వంతెనలను చూడొచ్చు.

గ్లాస్ స్కైవాక్, సిక్కిం
పర్యాటకులు అడ్వంచర్ ట్రిప్ను కోరుకుంటే మాత్రం తప్పకుండా సిక్కింలోని గ్లాస్ స్క్తెవాక్కు వెళ్లాల్సిందే. ఇక్కడికి వచ్చే సందర్శకులు గాజు వంతెనను చూడవచ్చు. అలాగే, బీహార్లోని నలంద జిల్లాలోని రాజ్గిర్లో కూడా ఇలాంటి గాజు వంతెనే ఉంటుంది. ఈ గాజు వంతెన సిక్కింలోని పెల్లింగ్లో ఉంది. ఈ గాజు వంతెన మీద నడవడం పర్యాటకులకు ఎంతో ఆశ్చర్యంగాను, భయానకంగానూ ఉంటుంది. ఈ గ్లాస్ స్కై వాక్ చెన్రెజిగ్ విగ్రహం ముందు ఉంటుంది. ఇది దాదాపు 137 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఈ ప్రదేశం నుండి చెన్రెజిగ్ మూర్తి, తీస్తా, రంగీత్ నదులను చూసేయొచ్చు.



Click it and Unblock the Notifications













