దేశంలో పేరుపొందిన ఏడు రైల్వే వంతెనల గురించి మీకోసం..
మన రైల్వే గురించి మాట్లాడుకుంటే చాలానే ఉంటుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రవాణ సంస్థ ఎన్నో చారిత్ర ఘట్టాలకు కేంద్రబిందువుగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది దేశంలోనే పేరుగాంచిన నదిపై నిర్మించిన అతి పెద్ద రైలు వంతెనల గురించి.
ఈ నిర్మాణాలు మానవుని అపూర్వ మేథాసంపత్తికి మచ్చుతునకగా నిలుస్తాయనడంలో సందేహమే లేదు. మన దేశంలోని పేరుపొందిన ప్రసిద్ధిగాంచిన ఏడు రైల్వే వంతెనల గురించి తెలుసుకుందాం. అతి పొడవైన రైలు వంతెనలు ఉన్నప్పటికీ ఈ ఏడు వంతెనలూ ఎప్పడూ ప్రత్యేకమనే చెప్పాలి.
వెంబనాడ్ వంతెన
కేరళ రాష్ట్రంలో ఉన్న వెంబనాడ్ వంతెన కొచ్చిలోని ఎడపల్లి మరియు వల్లార్పదమ్లను కలుపుతుంది. ఇది 4.62 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెనలలో ఒకటిగా పేరుపొందింది. ఇది నిజంగా అద్భుత నిర్మాణం! ఈ వంతెన నిర్మాణం 2007లో ప్రారంభమై 2010 నాటికి పూర్తయింది. ఈ మార్గం రైళ్ల ద్వారా కార్గో రవాణా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది.
నెహ్రూ సేతు రైలు వంతెన
ఈ వంతెన 3.059 కిలోమీటర్ల పొడవుతో ప్రసిద్ధికెక్కింది. ఇది 1900లో ప్రారంభించబడిన దేశంలోని పురాతన రైల్వే వంతెనలలో ఒకటిగా నిలిచింది. ఇది 2010లో వెంబనాడ్ వంతెన సిద్ధమయ్యే వరకు భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే వంతెనగా ఉండేది. నెహ్రూ సేతు రైలు వంతెనను అధికారికంగా అప్పర్ సోన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఇది బీహార్లోని సోన్ నగర్ మరియు డెహ్రీ-ఆన్-సన్ మధ్య సోన్ నదిపై ఉంది. ఇది కూడా సరుకు రవాణా అవసరాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది.
హేవ్లాక్ వంతెన
హేవ్లాక్ బ్రిడ్జ్ ప్రస్తుత జాబితాలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉపయోగంలో లేదు. ఈ వంతెన ఆంధ్ర ప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఇది హౌరా మరియు మద్రాసు పరిధిలోని మార్గాలలో రైళ్లకు సేవలు అందించింది. 2.7 కిలోమీటర్ల పొడవుతో, 1900లో ప్రారంభించబడిన మరియు 1997లో మూసివేయబడిన పొడవైన రైల్వే వంతెన చరిత్రలో నిలిచిపోతుంది. పాత గోదావరి వంతెనగా ఈ బ్రిడ్జ్ ప్రజలకు సుపరిచితం.
గోదావరి ఆర్చ్ బ్రిడ్జి
1997లో గోదావరి ఆర్చ్ బ్రిడ్జి ప్రారంభించబడింది. అదే సంవత్సరంలో హేవ్లాక్ వంతెనను మూసివేశారు. ఇది 2,745 మీటర్ల పొడవాటి వంతెన. దీని ప్రతి చివర వంపుల వలె ఉంటుంది. రాజమండ్రి-కొవ్వూరు వంతెన అని కూడా పిలువబడే ఈ వంతెనను హిందుస్థాన్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయిన గోదావరి నదిపై నిర్మించబడింది.
రెండవ మహానది రైలు వంతెన
ఇది ఒడిశాలో రెండవ అతిపెద్ద వంతెన. ఈ వంతెన మరియు మహానది వంతెన రెండూ ఒడిశాలో ఉన్నందున ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతూ ఉంటారు. రెండోది రైరాఖోల్, సంబల్పూర్, కడ్లిగర్ మరియు సుబల్య మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది. మహానది రైలు వంతెన 2008 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది 2.1 కిలోమీటర్ల పొడవు మరియు 160 km/hr వేగంతో ప్రయాణించే హై-స్పీడ్ రైళ్లను తట్టుకునే శక్తితో రూపొందించబడింది. ఇది చాలా బలంగా నిర్మించబడింది. ఇది భూకంప ప్రభావాన్ని కూడా తట్టకుని నిలబడగలదు.
పాంబన్ వంతెన
ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. దీనిని పాంబన్ వంతెన అని కూడా పిలుస్తారు. ఈ రామేశ్వరం వంతెన పొడవు 2,065 మీటర్లు మరియు 1915 సంవత్సరంలో ఇది ప్రారంభించబడింది. ఇది పాంబన్ ద్వీపంలో ఉన్న రామేశ్వరాన్ని భారతదేశ ప్రధాన భూభాగానికి కలుపుతుంది. బ్రిటిష్ వారి పాలనలో సిలోన్ లేదా ఇప్పుడు శ్రీలంకతో వాణిజ్యాన్ని పెంచడానికి ఈ వంతెన నిర్మించబడింది.
శరావతి నది వంతెన
కర్ణాటక రాష్ట్రంలో శరావతి నదిపై ఈ వంతెన ఉంది. ఇది 2,060 మీటర్ల పొడవును కలిగి ఉంది మరియు 1995 సంవత్సరపు జాతీయ అవార్డులలో అత్యంత అద్భుతమైన వంతెనగా రెండవ బహుమతిని అందుకుంది.