మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐఆర్సీటీసీ అంబేద్కర్ యాత్ర విశేషాలు
దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఇప్పటికే ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలను అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే దేఖో అప్నా దేశ్ ప్రచారంలో భాగంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను పలు రూట్లల్లో నడుపుతోంది. ఇదే సందర్భంలో మరికొద్ది రోజుల్లో ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరుతో ఓ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ పరిచయం చేస్తోంది. అంబేద్కర్తో ముడిపడి ఉన్న అనేక సందర్శనీయ ప్రదేశాలను ఈ టూర్లో చూసే అవకాశం ఉంది. ఆ విశేషాలను తెలుసుకుందాం రండి!
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈ నెలలో సరికొత్త యాత్ర మొదలవబోతోంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర న్యూ ఢిల్లీ నుంచి ప్రారంభం చేస్తున్నారు. మొత్తం ఈ యాత్రలో ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీతో పర్యాటక ప్రేమికులను ఆకర్షిస్తోంది. బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రముఖ ప్రదేశాలు, బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా ఉన్న ప్రాంతాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

600 మంది ప్రయాణించేలా..
ఈ టూర్లో భాగంగా ఐఆర్సీటీసీ టూరిజం బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర మొదటి రోజు ఢిల్లీ సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్లో ప్రారంభం అవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఢిల్లీలో బయల్దేరుతుంది. ఈ రైలులో 600 మంది ప్రయాణికులు ఒక ట్రప్కు జర్నీ చేయొచ్చు. అలా ఈ మొదటి రోజంతా ప్రయాణం మాత్రమే ఉంటుంది. అయితే, ఈ రైలులో అనేక సరికొత్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలా రెండో రోజు ఉదయం 8 గంటలకు మహూ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఈ యాత్రకు సంబంధించిన అసలైన అనుభూతిని పొందవచ్చు.

అంబేద్కర్ బాల్యపు జ్ఞాపకాలు
డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పుట్టిన ఊరైన మహూలో అడుగుపెట్టవచ్చు. ఈ ఊరినే భీమ్ జన్మ భూమి అని పిలుస్తారు. అంబేద్కర్ బాల్యపు జ్ఞాపకాలను ఇక్కడ గుర్తుతెచ్చుకోవచ్చు. అలా అక్కడ సందర్శన పూర్తైన తర్వాత నాగ్పూర్ బయల్దేరాలి. మూడో రోజు ఉదయం 8 గంటలకు నాగ్పూర్ చేరుకున్న తర్వాత దీక్షా భూమి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాంచీ బయల్దేరాలి. అలా నాలుగో రోజు సాంచీ చేరుకుంటారు. సాంచీ స్థూపం, ఇతర బుద్ధిస్ట్ సైట్లను గైడ్ల సహాయంతో చూసే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత వారణాసి బయల్దేరాలి. ఐదో రోజు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం సందర్శించవచ్చు. ఆ తర్వాత గయ బయల్దేరాలి. ఆరో రోజు బోధ్గయలో మహాబోధి ఆలయం, ఇతర బుద్ధిస్ట్ సైట్స్ చూడొచ్చు.
ప్యాకేజీ వివరాలు ఇలా..
ఏడో రోజు రాజ్గీర్ చేరుకుంటారు. అక్కడ బుద్ధిస్ట్ సైట్స్ చూసిన తర్వాత నలందా శిథిలాల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఎనిమిదో రోజు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ఐఆర్సీటీసీ టూరిజం బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర ప్యాకేజీ ధర చూస్తే డబుల్ ఆక్యుపెన్సీ, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.29,440 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, ఏసీ గదుల్లో బస, నాన్ ఏసీ బస్సులో సైట్ సీయింగ్, రైలులో శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. మరెందుకు ఆలస్యం మీకు ఆ సందర్శనీయ ప్రదేశాలను చూడాలని ఉంటే వెంటనే బయలుదేరండి!



Click it and Unblock the Notifications











