మన దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం.. శ్రావణం వచ్చిందంటే భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోతారు. ఈ సమయాల్లో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మాసాంతం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ఈ వేడుకల్లో ఎంతో ప్రాముఖ్యత పొందిందనే చెప్పాలి.
శైవ, వైష్ణ సంప్రదాయాల మేళవింపుతో భక్తి నియమాలకు చిరునామాగా పేరొందిన ఈ ఆలయంలో నెల రోజుల పాటు ఉత్సవాలు కన్నులపండువగా జరుపుతారు. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చెస్తున్నట్లు చెబుతున్నారు.
వీరశైవ సంస్కృతి అభివృద్ధికి..
ఉరుకుంద క్షేత్రం ప్రాంతమంటే మహాయోగి ఈరన్న స్వామి నడియాడిన నేలగా ప్రాచుర్యం పొందింది. శతాబ్దాల క్రితం కర్ణాటక ప్రాంతం నుంచి ఉరుకుందకు వచ్చిన స్వామి అసలు పేరు హిరణ్యగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే అశ్వత్థ వృక్షం కింద స్మామి తపస్సు చేస్తూ.. తపోశక్తితో భక్తులకు తన సేవలను అందించేవారని స్థానికులు విశ్వసిస్తారు. ముఖ్యంగా వీరశైవ సంస్కృతి అభివృద్ధికి స్వామి కృషి చేశారట.

శైవాచారం పాటించడం ద్వారా ఆయన కోపానికి తగిన విధంగా కొందరు భక్తులు వీరభద్రస్వామి ప్రతిరూపంగా ఆయనను కొలుస్తుంటారు. తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం విష్ణుమూర్తికి చిహ్నం కావడం, అదే వృక్షం కింద నారసింహస్వామి విగ్రహం లభించడంతో కొందరు భక్తులు నారసింహస్వామి స్వరూపంగా పూజిస్తుంటారు. అందుకే, ఈ ఆలయంలోని వీరభద్రుడు, నారసింహుడి విగ్రహాలను ప్రతిష్టించడంతోపాటు ఆ రెండు సంప్రదాయాల్లోనూ పూజలు చేస్తూ ఉంటారు.
నియమ నిష్టలతో పూజలు..
ఇక్కడ ఇలవేల్పుగా కొలిచే భక్తులు ఆచారాలకే ప్రధాన్యత ఇచ్చేలా వీరభద్రుడు, నారసింహుడు ఉగ్ర రూపాలుగా భావిస్తారు. తనను భక్తిశ్రద్ధలతో కొలిచేవారి కోర్కెలు తీరుస్తూ.. తప్పు చేసేవారిపై ఉగ్రుడిగా మారతారని భక్తుల విశ్వాసం. ఇక్కడ శ్రావణమాసంతో పాటు, కార్తికమాసం, అమావాస్య, పౌర్ణమి, సోమ, గురువారాల్లో గుడ్లు, నీచు పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా నిష్టతో నడుచుకుంటారు. ఉత్సవాల్లోనూ, ఏడాదిలో ఒకసారి వంటకాలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవమూర్తిని పల్లకిలో తుంగభద్ర నదికి పాదయాత్రగా తీసుకువెళతారు. అక్కడే గంగాస్నానం, ఇతర పూజలను నిర్వహించిన తర్వాత మళ్లీ పాదయాత్ర, ఊరేగింపుగా భక్తులు పెద్ద ఎత్తున బయలుదేరుతారు.
అలా మార్గమధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజలు స్వామివారికి టెంకాయలు, నైవేద్యం సమర్పించి, తమ మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం ఆరుగంటలకు ఉరుకుంద పొలిమేరకు చేరుకుని, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామి జయజయ నామస్మరణతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆలయం వద్దకు వస్తారు. ఈ ఏడాడి ఉత్సవాల్లో భాగంగా లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానపు ఘట్టాలు, అదనపు ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాల ఎంపికలాంటి పనుల్లో నిమగ్నమయ్యారు. మరుగుదొడ్లు, నిఘా కోసం సీసీ కెమారాలు ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications













