రాబోయే శ్రావణమాసంలో ఈ ఆలయాలను సందర్శించండి..
కొన్ని రోజుల్లో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కానుంది. భక్తులు ఆ నెలంతా భోలేనాథ్ (శివుడిని) ను పూజిస్తారు. ఆ సమయంలో భక్తి శ్రద్దలతో మహాదేవుడ్ని హృదయపూర్వకంగా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం. ఈ మాసం కోసం చాలామంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు కూడా. హిందూ మతంలో శ్రావణమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసమంతా శివుడిని పూజించడం ఆచారం. మహాదేవుని ఆరాధించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, లోకంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల నమ్మకం.
ఈ మాసంలో ప్రతి శివాలయంలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు ఉంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో శివుని దర్శంచుకోవడం, ప్రత్యేక పూజలు చేయడం ద్వారా భక్తులు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు. అటువంటి మంచి సమయంలో చాలామంది భక్తులు మహాదేవుని ఆలయాలను సందర్శించాలనుకుంటారు. మీరు కూడా ఆ ప్రణాళిక వేస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా ఈ ఆలయాలను సందర్శించండి. దేశంలోని కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కైలాస దేవాలయం, మహారాష్ట్ర
మహారాష్ర్టలోని ఎల్లోరాలోని కైలాస దేవాలయం భారతదేశంలోని అత్యుత్తమ శివాలయాలలో ఒకటిగా పరిగణించబడింది. దీనిని ఎల్లోరాలోని కైలాస దేవాలయం అని కూడా పిలుస్తారు. ఎల్లోరాలో ఉన్న 34 దేవాలయాలలో ఇది ఒక భాగం. ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడింది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా. రాబోయే శ్రావణమాసంలో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.

మురుడేశ్వర దేవాలయం, కర్ణాటక
మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలుకాలోని ఒక పట్టణం. ఈ పట్టణం శివుని పుణ్యక్షేత్రం. ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ఈ పట్టణంలో ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహం ఉంది.ఈ పట్టణంలో ఉన్న శివాలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు మురుడేశ్వరుడుగా అర్చింపబడుతున్నాడు. ఈ ప్రదేశం శివుని రెండవ ఎత్తైన విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ దాని చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి దృశ్యం. విగ్రహానికి సమీపంలో 20 అంతస్తుల శివుని ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి సమీపంలో ఒక లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులు భారీ విగ్రహం యొక్క అద్భుతమైన వీక్షణను ఆస్వాదించవచ్చు.

లింగరాజ దేవాలయం, ఒడిశా
దేశంలోని ప్రధాన శివాలయాల్లో లింగరాజు దేవాలయం ఒకటి. ఇది భువనేశ్వర్లోని అతిపెద్ద దేవాలయం. ఈ ఆలయాన్ని సోమవంశీ వంశస్థులు నిర్మించారని చెబుతారు. లింగరాజ ఆలయం శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని పురాతన దేవాలయాలలో ఒకటి .

సోమనాథ్ ఆలయం, కతియావార్
గుజరాత్లోని సోమనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. త్రివేణి సంగమం వద్ద ఉన్న ఈ ఆలయం గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. శ్రావణమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.



Click it and Unblock the Notifications














