వైష్ణో దేవి ఆలయ దర్శనానికి ఐఆర్సిటిసి ఆఫర్..
ఈ వేసవిలో ఉత్తర భారతదేశాన్ని సందర్శించాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అక్కడ జలపాతాలు, హిల్స్టేషన్లు ఇంకా పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటితో పాటు అక్కడ ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఏ యాత్రికుడైనా ఉత్తర భారతదేశాన్ని సందర్శించాలని అనుకుంటాడు. ఇక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు. అందుకే రైల్వే శాఖ ప్రధాన ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ వేస్తుంటుంది. తాజాగా ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులకు భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది.
అదేంటంటే, వైష్ణో దేవి హరిద్వార్ టూర్ కోసం భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా హరిద్వార్లోని ప్రముఖ ప్రదేశాలు, కత్రాలోని ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయాలను సందర్శించే అవకాశం భక్తులకు కల్పించింది. ఈ రైలు ప్రయాణం జూన్ 25న కోల్కతా రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది. తిరిగి మళ్లీ జులై 2న ముగుస్తుంది. ఈ ప్రయాణంలో ప్యాసింజర్లు ఏడు రాత్రులు, ఎనిమిది రోజులు రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ధర ఎంత
ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 790 మంది ప్రయాణికులు ప్రయాణించే వెసులు బాటు ఉంది. ఎకానమీ క్లాస్లో 580 సీట్లు, స్టాండర్డ్ క్లాస్లో 150 సీట్లు, కంఫర్ట్ క్లాస్లో 60 సీట్లు ఉంటాయి. ఎకానమీ క్లాస్లో ఒక్కో ప్రయాణికుడికి రూ.13,680 నుంచి టికెట్ ధర ప్రారంభమవుతుంది. స్టాండర్డ్ క్లాస్లో ఒక్కో ప్రయాణికుడు రూ.21,890 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ తరగతిలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.23,990 వసూలు చేస్తారు. ఈ టూర్ ప్యాకేజీలోనే అన్ని ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

టూర్ ప్యాకేజీ..
వైష్ణో దేవి హరిద్వార్ టూర్ ప్యాకేజీలో భాగంగా భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు పరిమిత బోర్డింగ్, డీబోర్డింగ్ స్టేషన్లను కలిగి ఉంటుంది. ఇందులో ప్రయాణించే వారు కోల్కతా, ఖరగ్పూర్ జంక్షన్, టాటా, మురి, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, చంద్రపూర్, గోమో జంక్షన్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, గయా, డెహ్రీ ఆన్ సోన్, ససారం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ల స్టేషన్లలో ట్రైన్ ఎక్కే వెసులు బాటును కల్పించారు. దిగే అవకాశం కూడా ఉంది. ఈ పర్యటన సమయంలో ప్రయాణికులు అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
మొదటగా, భారత దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీ వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. కత్రా వద్ద ఉన్న బేస్ క్యాంప్ నుండి సుమారు 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు కష్టతరమైన ట్రెక్కింగ్ ను చేసుకుంటూ వెళతారు. ఇక రెండోది, రిషికేశ్లో ప్రయాణికులు రామ్ ఝుల, లక్ష్మణ్ ఝుల, త్రివేణి ఘాట్ వంటి అందమైన ప్రదేశాలు చూడవచ్చు. మూడోది, హరిద్వార్లో భారత మాతా దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు, హర్ కి పౌరి వద్ద ఆకర్షణీయమైన గంగా హారతిని చూసే అవకాశం కూడా ఉంటుంది.
టికెట్ బుక్ చేసుకోవడం ఎలా..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ https://www.irctctourism.comను విజిట్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైలు బయలుదేరడానికి ఒక వారం ముందు రైల్వే సీటింగ్ అరేంజ్మెంట్ను ఐఆర్సీటీసీ నిర్ధారిస్తుంది. మరెందుకాలస్యం వైష్ణో దేవి ఆలయాన్ని చూసేందుకు బయలుదేరండి.



Click it and Unblock the Notifications













