ఐఆర్సీటీసీ హెలికాప్టర్లో కేదార్నాథ్ తీసుకెళుతుంది!
కేదార్నాథ్.. ఈ పేరు వినగానే ఆ మహాశివుని ప్రత్యక్ష రూపం సాక్షాత్కారించినట్లు పరవసించిపోతారు భక్తులు. శివుని పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి. అంతేకాదు, ఏటా జరిగే చార్ ధామ్ యాత్రలో ఇది కూడా భాగం. ఈ యాత్రకు హిందూ భక్తులు ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధమవుతూ ఉంటారు.
ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని శివుణ్ని దర్శించుకొంటారు. కేదార్నాథ్ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం ఏప్రిల్ 25 నుంచి తెరుచుకుంటాయని సమాచారం. అయితే, ఇక్కడికి చేరుకునేందుకు ఐఆర్సీటీసీ హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

నిజానికి హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఉత్తరాఖండ్లోని గౌరీ కుండ్ వరకు మాత్రమే వాహనాలపై వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడి నుంచి మరో 18 కిలోమీటర్ల యాత్ర అతికష్టంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు ఎక్కువగా వస్తుంటారు. అందుకే అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించింది.
ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. ఏటా ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సేవలను నిర్వహించే అథారిటీ ఈ సేవలను నిర్వహించే హెలికాప్టర్ సంస్థలను నుంచి టెండర్లను ఆహ్వానిస్తుంది. అలా ఎంపిక చేసిన కొన్ని సంస్థలకు మాత్రమే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందించేందుకు అనుమతి ఉంటుంది.
ఐఆర్సీటీసీ నుంచి బుకింగ్
భారతీయ ప్రయాణీకులకు వారధిగా నిలిచే ఐఆర్సీటీసీ కేదార్నాథ్కు హెలికాప్టర్లో వెళ్లాలనుకుంటున్నరి కోసం సరికొత్త అవకాశాన్ని కల్పించింది. భారతీయ రైల్వేకు చెందిన ఈ టికెట్ బుకింగ్ ప్లాట్ఫాం నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్సిటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించింది. ఈ మేరకు UCADAతో ఐఆర్సీటీసీ ఐదేళ్ల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది.

2023 ఏప్రిల్ 1 నుంచి బుకింగ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హెలికాప్టర్ల ట్రయల్ రన్స్ ప్రారంభమైనట్లు సమాచారం. అవి మార్చి 31తో ముగుస్తాయి. ఆ వెంటనే టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సర్వీసులను నిర్వహించబోయే సంస్థలకు 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలు జారీ చేసింది.
కఠినతరమే అయినా..
ఈ ఆలయానికి చేరుకునేందుకు హెలికాఫ్టర్ చేయాల్సిన ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. కేదార్నాథ్ ఆలయం నుంచి 25 కి.మీ నుంచి 200 కి.మీ వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి.

గత ఏడాది దేహ్రాదూన్ నుంచి కూడా సేవలను నడిపారు. సర్సీ అనే హెలిప్యాడ్ ఆలయం నుంచి కేవలం 23 కి.మీ దూరంలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి 12 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అలాగే ఫటా, గుప్తకాశీ, సీతాపూర్, అగస్తముని ప్రాంతాల నుంచి గత ఏడాది హెలికాప్టర్లు నడిచాయి.
బుకింగ్ కోసం సూచనలు..
అయితే, సందర్శకులు బుకింగ్ కోసం కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది ప్రయాణం చేయాల్సిన వారు కచ్చితంగా ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ వెబ్పోర్టల్ లేదా టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్ లేదా +91 8394833833 మొబైల్ నెంబర్కు 'Yatra' అని వాట్సప్ సందేశం పంపి కేదార్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఒకసారి హెలికాప్టర్ టికెట్ బుకింగ్ విజయవంతమైతే.. టికెట్ ప్రింటవుట్ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. అలాగే ఒక అధికారిక గుర్తింపు కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా ఆలయానికి చేరుకునే వారు కొన్ని ప్రత్యేక ఛార్జీలు చెల్లిస్తే దర్శనంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వొద్దు. హ్యేపీ జర్నీ..!



Click it and Unblock the Notifications













