ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో కడప జిల్లాల్లోని ఒంటిమిట్ట ఆలయం ఎంతో పేరుగాంచింది. ఇక్కడ ప్రతిఏటా శ్రీరామనవమి పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 17 వ తేది నుంచి 25 వ తేదివరకు ఒంటిమిట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేడు ఈ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.

ఆలయ శుద్ధి కార్యక్రమం..
ఇక, నేడు అంటే ఏప్రిల్ 12 వ తేదిన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాతంతోనే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగానే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువ వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఆ తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ నెల13న పసుపు దంచే కార్యక్రమం...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల13వ తేదీ ఉదయం పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది. ఇక, ఈ పసుపును సీతారాముల వారి కళ్యాణంలో ఉపయోగిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 22వ తేదీన ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఇక, ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్నాయి.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు..
ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం మూలవర్లకు అభిషేకం కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం జరుగనుంది. ఇక, రాత్రి 7 గంటల సమయంలో హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

మరుసటి రోజు (ఏప్రిల్ 18న) ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం ఎంతో వేడుకగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనలానుకునేవారు రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొన్నవారికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 21 నుండి 23 వరకు తెప్పోత్సవాలు..
ఈ నెల 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ నెల 20న ఖనిజ తోట ఉత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు జరగనున్నాయి.
ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా జరగనుంది. మొదటిరోజు ఐదురౌండ్లు, రెండో రోజు ఏడు రౌండ్లు, చివరిరోజు తొమ్మిది రౌండ్లు తెప్పలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.



Click it and Unblock the Notifications













