దేశవ్యాప్తంగా గణేషుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల అయితే, పంచరాత్రులు మహోత్సవాలు కూడా ముగిసాయి. వినాయక చవితి ఉత్సవాలను కొన్ని ప్రాంతాలు కొన్నిరకాలుగా జరుపుకుంటారు. వినాయకుని నవరాత్రుల ఉత్సవాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో గణేషుని పూజిస్తారు. ముంబైలో గణపతి ఉత్సవాలు ఏకంగా పది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సమయంలో సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్చా రాజా గణేష ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్బాగ్లో పూజలు అందుకునే వినాయకుణ్ణి చూసేందుకు మనదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు బారులు తీరుతారు. ఇక్కడి వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు ఏకంగా రెండురోజులపాటు క్యూలైన్లలో నిలబడుతుంటారు.
ఇక్కడ కొలువై ఉన్న గణేషుని విశేషతలేంటో తెలుసుకుందాం పదండి..
సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లోని లాల్బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని లాల్బాగ్చా రాజా వినాయకుని మండపం అత్యంత ప్రసిద్ది చెందింది. లాల్బాగ్లో ప్రతిష్టించిన వినాయకుని విగ్రహాన్ని నవసాచ గణపతి అని పిలుస్తారు. ఈ రూపంలో కొలువై ఉన్న గణేశుడు ఇక్కడ భక్తుల అన్ని కోరికలను నెరవేరుస్తాడని ఇక్కడికి వచ్చేవారి నమ్మకం. ఇక్కడ పది రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాల్లో నిత్యం వేలాది మంది భక్తులు లంబోధరుని ఆశీస్సులు పొందుతారు. ఇక్కడి వినాయకుడు 20 అడుగుల ఎత్తు. విఘ్నహర్త విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు 89 ఏళ్లుగా ఈ అందమైన గణేషుని విగ్రహాన్ని రూపొందించే బాధ్యత కాంబ్లీ కుటుంబానిదే. ఇక్కడికి అన్ని కులాల, మతాల వారు వచ్చి గణపతి ఆశీస్సులను పొందుతారు. బాలీవుడు సెలబ్రిటీలతోపాటు ముంబైలోని ప్రముఖులు కూడా లాల్బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం తరలివస్తారు.

లాల్బాగ్చా ప్రత్యేకత..?
సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్చా రాజా అంటే లాల్బాగ్ రాజు అని అర్థం. 1934 నుండి నేటి వరకు కాంబ్లీ కుటుంబమే గణేషుని విగ్రహ మూర్తుల భాధ్యత తీసుకుంది. ఈ కుటుంబాలు లాల్బాగ్లోని గణపతి విగ్రహాన్ని తయారు చేసి వినాయక ఉత్సవాలను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గణపతి విగ్రహం డిజైన్ పేటెంట్ను కూడా వారు పొంది ఉన్నారు.
ప్రతి ఏడాది గణేశోత్సవం లాల్బాగ్చా రాజా మొదటి దర్శనంతోనే మొదలవుతుంది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 7వ తేదిన గణపతి విగ్రహం తొలి దర్శనం జరిగింది. లాల్బౌగ్చా రాజాను నవసాచ్ గణపతి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడికి వచ్చినవారు తమ కోరికలను వినాయకునికి చెప్పుకుంటే అవీ నెరవేరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ వినాయకుని ప్రత్యేతక ఏంటటే.. దేశం మొత్తం మీద సుదీర్ఘమైన నిమజ్జనం ముంబైలోని లాల్బాగ్చా రాజా గణేషునిదే జరుగుతుంది. ఎందుకంటే పదో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమయిన నిమజ్జనం కార్యక్రమం మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది.

వివిధ గణేషుని మండపాలు..
లాల్బాగ్చా రాజా గణేషుని మండపంతో పాటు సమీపంలో మరికొన్ని మండపాలు కలవు. అందులో అంధేరీచా రాజా గణేషుడు ఎంతో ప్రత్యేకం. అంధేరీచా రాజాను నవసాల పవనార గణపతి అని పిలుస్తారు. ప్రతి ఏడాది అంధేరీచా మండపం థీమ్ చాలా విభిన్నంగా నిర్వహిస్తారు. ఇది ఇక్కడికి వచ్చేవారిని ఎంతోగానో ఆకట్టుకుంటుంది. దీంతో పాటు మరికొన్ని మండపాలు కూడా కలవు. లాల్బాగ్చా రాజా గణేష్ మండపానికి సమీపంలో మరొక ప్రసిద్ధ గణపతి మండపం ఉంది. అదే గణేష్ గల్లీలో కొలువైన ముంబైచా రాజా గణపతి మండపం. ముంబైలోని పురాతన గణేష్ మండపాలలో ఇది ఒకటి. 1928 నుండి ఇక్కడ వినాయకుడు పూజలందుకుంటున్నాడు. ఇంకా జీఎస్బీ సేవా మండల్ల్లోని వినాయకుని మండపం కూడా పేరుగాంచింది. దీంతోపాటు ఖేత్వాడిచా గణరాజ్ మండం కూడా ఎంతో విశిష్టమైనది.
చేరుకోవడం ఎలా..?
ముంబై చేరుకోవడానికి అన్ని రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానం, రైలు, బస్సు మార్గం ద్వారా కూడా మహారాష్ట్ర చేరుకోవచ్చు. ఇక అక్కడి నుండి లాల్బాగ్చా దర్బార్కు చేరుకోవడానికి ఆటోలు కానీ, బస్సులు, టాక్సీలు కానీ నిత్యం ప్రయాణికులకు, భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. మరెందుకాలస్యం ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లాల్బాగ్చా రాజా వినాయకుని దర్శనం భాగ్యం పొందండి మరీ..



Click it and Unblock the Notifications













