ఆంధ్రప్రదేశ్లో జలపాతాలు, అందాల కొండాకోనలూ, రాయలనాటి నిర్మాణాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఇంకా చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకేచోట వెలసి ప్రకృతి ప్రేమికులకు సాదర ఆహ్వనం పలుకుతున్నాయి లంకమల అడవులు.. ఆంధ్రప్రదేశ్లో అతి కొద్దిమందికే తెలిసిన ప్రాంతం ఇది. ఈ మధ్యకాలంలో పర్యాటకుల సందర్శనార్ధం ఈ ప్రాంతం వెలుగులోకి రావడం మొదలుపెట్టింది. రండి. ఈ లంకమల అడవుల అందాలను చూసొద్దాం..
సుమారు 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి..
తిరుపతి చుట్టుపక్కలున్న కొండలను శేషాచలం అడవులు అని అంటారు. ఈ అడవులు కడప జిల్లా సిద్ధవటం నుంచి పెన్నా నది వరకూ విస్తరించి ఉంటాయి. లంకమల అడవులు పెన్నా నదికి దక్షిణం అంచునా సిద్ధవటం నుంచి మొదలవుతాయి. సుమారు ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లలో వరకూ ఈ అడవులు విస్తరించి ఉంటాయి. అంతేకాదు బద్వేలు నుంచి ఈ నల్లమల్ల అడవులు ప్రారంభం అవుతాయి. నల్లమల్ల అడవులు, శేషాచలం అడవుల మధ్యలో ఈ లంకమల అడవులు ఉంటాయి. ఈ అడవింతా పచ్చని ప్రకృతితో, పక్షుల కిలకిలరావాలతో సందడి చేస్తూ ఉంటుంది. పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులు ఎవరైనా ఈ లంకమల అడవులను సందర్శించాల్సిందే..

ఈ అడవుల్లో ఎన్నో పురాతన ఆలయాలు దాగి ఉన్నాయి...
ఈ లంకమల అడవుల్లో ఎన్నో పురాతన ఆలయాలు దాగి ఉన్నాయి. ఇక్కడున్న లంకా రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇప్పటికి ఇక్కడికి శివరాత్రి, కార్తీక సోమవారాల్లో జనం వేల సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఆలయంతో పాటు కపర్థీశ్వర, కోన, నిత్యపూజ స్వామి కోన, వనేశ్వరాలు, నాగనాథేశ్వర స్వామి వంటి తీర్థాలున్నాయి. వీటితోపాటు కొండ గోపాలస్వామి వైష్ణవ దేవాలయం కూడా కొలువై ఉంది. ఈ రామలింగేశ్వరస్వామి ఆలయానికి పక్కనే ఒక జలపాతం ఉంది.
ఇది 70 అడుగుల ఉండే అతి పెద్ద జలపాతం. దీనికిందే ఉన్న గుండం అత్యంత లోతైనది. ఆలయానికి దగ్గర్లోనే ఉండే పసలగుండం కూడా ఏడాదిమొత్తం నీటితో ఉంటుంది. జూన్ నెలలో తొలకరి వర్షాలు మొదలుకుని ఫిబ్రవరి వరకూ ఈ లంకమల అడవులు పచ్చదనంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటాయి. కొద్దిగా వర్షం కురిసినా చాలు చుట్టుపక్కల జలపాతాలన్నీ పాలవెల్లువలయిపోతాయి. ఈ లంకమల అడవులు మనదేశంలో అరుదైన కలివికోడికి అభయారణ్యం కూడా.

రాతియుగం మానవులు గీసిన రేఖచిత్రాలు...
ఈ లంకమల అడవుల్లో వాగులూ, వంకలూ, జలపాతాలు ఉన్నప్పటికీ ఇంకా ఇక్కడ ఎన్నో చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. రాతియుగం మానవులు గుహల్లో గీసిన రేఖాచిత్రాలు ఈ అడవుల్లో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని బండిగాని సెలమల్లుగాని కొండల వద్ద ఈ రేఖాచిత్రాలను చూడొచ్చు. వీటిని పరిశీలించిన యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం పరిశోధకులు ఇవి మధ్యప్రదేశ్లోని అతి ప్రాచీన రాతియుగపు ఈ చిత్రాలు బింబేద్కాకి సమకాలీనమైనవని చెబుతున్నారు.
ఇంకా ఇక్కడి సాలంక ఆలయ సమీపంలో ఏడో శతాబ్దపు నాటి తెలుగు శాసనం కూడా బయటపడింది. ఇక్కడ ఒక అతిపెద్ద రాజుల చెరువు కూడా ఉంది. ఇది 14వ శతాబ్దానికి చెందిన సాలువ నరసింహరాయుల కాలంలో నిర్మించిన రాజుల చెరువుగా తెలుస్తోంది. ఇది ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధిచెందిన చెరువు.



Click it and Unblock the Notifications













