తెరుచుకున్న నల్లమల్ల బైర్లుట్టి జంగిల్ సఫారీ...మీరు సిద్ధమేనా..?
జంగిల్ సఫారీ చేయాలనుకునేవారికి శుభవార్త.. కర్నూలు జిల్లాలోని గత మూడు నెలలుగా మూతపడ్డ నల్లమల్ల బైర్లుట్టి జంగిల్ సఫారీ అక్టోబర్1న తెరుచుకుంది. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడునెలల పాటు నల్లమల్ల అటవీ ప్రాంతంలో అధికారులు జనసంచారాన్నినిషేదించిన సంగతి తెలిసిందే. ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. దాంతో పర్యాటకులు ఇక అక్టోబర్ 1 నుంచి యథావిథిగా నల్లమల అటవీ అందాలను వీక్షించేందుకు సిద్ధం కావొచ్చు అని చెప్పారు అధికారులు. నల్లమల్లలోని ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను అలాగే, అక్కడి అడవి అందాలను తిలకించాలని ఉందా? అయితే మరెందుకాలస్యం జంగిల్ సఫారీకి సిద్ధం కండి..
దట్టమైన అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ...
నల్లమల్ల ఈ పేరు వినగానే పర్యాటకులు మనస్సు కేరింతలు కొడుతుంది. ఎందుకంటే ఇక్కడి ఆహ్లదకరమైన వాతావరణం పర్యాటకులను అంతగా కట్టిపడేస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చిక బయళ్ల నడుమ జంగిల్ సఫారీ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అకాశాన్ని తాకేలా ఉండే ఎత్తయిన మహా వృక్షాలు ఇక్కడికొచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, సుందరమైన లోయలు, ఎత్తయిన పర్వతాలను చూస్తుంటే సమయమే తెలీదు.

ఇంతటి మనోహారమైన దృశ్యాలతో పాటు ఇక్కడి వన్యప్రాణులనూ చూస్తూ ఈ నల్లమల అభయారణ్యంలో విహారిస్తుంటే ఆ సంతోషమే వేరు. అయితే గత మూడు నెలలుగా ఈ జంగిల్ సఫారీ మూత పడిన విషయం అందరికి తెలిసిందే. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా విహరించేందుకు వీలుగా మూడు నెలలపాటు పర్యాటకానికి బ్రేక్ వేశారు అటవీశాఖ అధికారులు. తిరిగి అక్టోబర్ 1 నుంచి ఈ జంగిల్ సఫారీ ప్రారంభం అయ్యింది.
55 టైగర్ రిజర్వ్ ఫారెస్టులను నిషేధించారు...
అయితే, ఈ నిషేదం కేవలం కర్నూలు జిల్లాలో ఉన్న ఈ నల్లమల జంగిల్ సఫారీలో మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న 55 టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో ఎన్టీసీఏ సెస్టెంబరు 30 వరకు అన్ని కార్యకలాపాలు నిషేధించినట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగానే నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో 75 పులులు ఉన్నట్లు 2022 గణనలో గుర్తించారు. వీటి పరిధిలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో పలు పుణ్యక్షేత్రాలు, ఎన్నోపర్యాటక కేంద్రాలు కూడా ఉన్నాయి. అయితే, వాటిని అధికారుల ఆదేశానుసారం గత మూడు నెలలుగా వాటి సందర్శనను నిలిపివేశారు.
ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం..
నాగార్జున సాగర్- శ్రీశైలం అభయారణ్యంలో గల నల్లమల ఫారెస్ట్ పరిధిలోని మార్కాపురం అటవీ డివిజన్లో ఉండే ఇష్ట కామేశ్వరీదేవి ఆలయం ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ఏటా ఇక్కడికి వేలసంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరీ దేవీని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇంకా ఇక్కడ వెలుగోడు పరిధిలోని రుద్రకోడూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రాలతో పాటు బైర్లూటి జంగిల్ సఫారీ మార్కాపురం డివిజన్లోని తుమ్మల బయలు ఎకో టూరిజం కేంద్రం జంగిల్ సఫారీలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అంతేకాకుండా ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం బైర్లూటి జంగిల్ క్యాంప్లో 4 కాటేజీలు 6 టెంట్ హౌస్లను ఏర్పాటు చేసారు అధికారులు. కాటేజీ తీసుకునే వారికి రోజుకు ఇద్దరికి కలిపి ఆరువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎవరైనా ఉంటే వారికీ అదనంగా ఒక్కొక్కరికి 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విదంగా టెంట్హౌస్ ధర 6500 రూపాయలుగా నిర్ణయించారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24 కిలోమీటరు దగ్గరున్న గోర్లెస్ కాలువ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది.



Click it and Unblock the Notifications













