Search
  • Follow NativePlanet
Share
» »అమలాపురంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ప్రతి అణువు అద్భుతమే..!!

అమలాపురంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ప్రతి అణువు అద్భుతమే..!!

అమలాపురంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ప్రతి అణువు అద్భుతమే..

తూర్పుగోదావరి జిల్లా గొప్ప వైవిధ్యము కలిగిన దేవాలయాలకు మరియు విగ్రహాలకు ప్రసిద్ది చెందింది. గొప్ప సంప్రదాయములకు, వారసత్వ సంపదకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము. అమలాపురం పూర్వనామం అమృతపురి. కాలక్రమేణా అమ్లీపురిగా మార్పు చెందింది. ఈ అమ్లీపురి కాలానుగతంగా అమలాపురంగా మారింది. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది.

రెండు జలాశయాల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం. కోనసీమ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాల్లో కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. అమలాపురం కోనసీమలో ముఖ్యమైన ప్రదేశం. ఆకాశాన్నంటే కొబ్బరి చెట్లు.. పైరగాలికి ఊయలలూగే పచ్చటి పైర్లు.. నిండు వేసవిలోనూ జలకలతో సాగిపోయే కాలువలు.. ప్రకృతికాంత హొయలన్నీఅమలాపురంలో అడుగడుగునా కనబడుతాయి. కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు, కోనసీమ సాంప్రదాయాలు, మర్యాదలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.

కోనసీమలో ప్రకృతి అందాలే కాదు.. ఆధ్యాత్మికతను పంచే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. దిండి నుంచి హోప్ ఐలాండ్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రత్యేకమే. ప్రతి అణువు అద్భుతమే. అమలాపురం కాకినాడకు 65 కి. మీ ల దూరంలో కలదు. అమలేశ్వరస్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రమ ణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, అయ్యప్పస్వామి, షిర్డీ సాయి స్వర్ణ మందిరం చూడదగ్గవిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం..

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం

నిత్యకళ్యాణం పచాతోరణ గా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయం లో వేంకటేశ్వరుడు లేదా వేంకటాచలపతి, శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారముగా భావించబడే హిందూ దేవుడు. దేవాలయంలో దేవుని యొక్క విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు అంత్యంత అసాధారణంగా అద్భుతమైన నైపుణ్యంతో చెక్కబడినాయి. ఈ అద్భుతమైన శిల్పకళ పర్యాటలకును మంత్రముగ్దులను చేస్తుంది. ఇది పర్యాటకులకు హాట్ స్పాట్ గా మారింది. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామముతో ప్రసిద్ధి చెందాడు. ప్రతి రోజూ ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతుంటుంది. ప్రతి రోజూ ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి కళ్యాణం చేయించుకుంటారు.

P.C: @Matthew_T_Rader

అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం

అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం

అయినవిల్ల తూర్పుగోదవారి జిల్లాకు చెందిన గ్రామం. అయినవిల్లిలో శ్రీ సిద్ది వినాయక దేవాలయం ప్రసిద్ది. అమలాపురం నుండి 13కిలోమీటర్ల దూరంలో ఉంది. కోనసీమగా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాల అందంగా ఉంటాయి. కొబ్బరితోటలు ,గోదావరి ఒడ్డు ,పచ్చని పొలాలు,కాలువలు ఇంకా చాల ఉన్నాయ్. ఇది కాకినాడకు 72 కి.మీ దూరములో ఉన్నది. ఇది చరిత్ర గలిగిన అందమైన భూమి. ఇది సిద్ది వినాయకునికి అంకితము చేయబడినది. తమ కోరికలు తీరినట్లయితే మరలా దర్శించుకుంటామని ఇక్కడ భక్తులు వాగ్దానము చేస్తారు. ఈ దేవాలయము కధలు మరియు విగ్రహములు అతి నైపుణ్యముతో చెక్కబడిన రెండు గోపురములు కలవు. ఇక్కడ గణపతి విగ్రహమును వ్యాసమహర్షి ప్రతిష్టించినట్లు చెప్పబడినది.
పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణమును బట్టి తెలియచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణమును దేవతలే చేసారని పెద్దలు చెబుతూ ఉంటారు.

అమలాపురంలో భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం

అమలాపురంలో భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం

ఇక్కడ ప్రతి మాసము ఉభయ చవితి తిధులు దశమి,ఏకాదశి,'వినాయచవితి,నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు బేధము లేదని చాటిచెప్తున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి,శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్టించబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీకాలబైరవస్వామి కొలువై ఉన్నారు. అమలాపురంలో భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అలాగే దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం.

pc:v s s n murthy manda

అప్పనపల్లి దేవాలయం:

అప్పనపల్లి దేవాలయం:

అప్పనపల్లిలోని బాలబాలాజీ దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. ఆలయం ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రం . ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ దేవాలయ నిర్మాణాన్ని బట్టి అతి పురాతనమైనదని చెప్పవచ్చు. ఈ దేవాలయంలోని గర్భగుడిని రెండవ తిరుపతిగా భావిస్తారు. రోజూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నదితో, మరోవైపు బంగాళాఖాతం సముద్రంతో చుట్టబడి స్వచ్ఛమైన గాలితో సందర్శకులను ఆహ్లాదపరుస్తుంటుంది. చుట్టూ అందమైన పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. శ్రీ బాల బాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లి ని దర్శించి పునీతులవుతున్నారని యాత్రికుల విశ్వాసం.

PC: విశ్వనాధ్.బి.కె.

రాజమండ్రి , రాజోలు మధ్యలో తాటిపాక జంక్షన్ లో

రాజమండ్రి , రాజోలు మధ్యలో తాటిపాక జంక్షన్ లో

రాజమండ్రి , రాజోలు మధ్యలో తాటిపాక జంక్షన్ లో దిగి అప్పనపల్లికి వెళ్ళాలి. ఇది మామిడికుదురులో ఒక మారుమూల గ్రామము. ఇది కాకినాడ నుండి వయా యానం 72 కి.మీల దురంలో ఉంది. ఇది ముడువైపుల గోదావరి నదితో తాపడం చేయబడినట్లు ఉంటుంది. ఇక్కడ మంచి అతిధి గృహాలు మరియు టి టి డి వసతి గృహాలున్నందు వలన మంచి వసతి లభిస్తుంది. ఈ ప్రాంతం ఒక ఋషి పేరు మీద పిలవబడుతుంది.

మురమళ్ళ:

మురమళ్ళ:

మురమళ్ళలో శ్రీభద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ది. ఈ ప్రదేశంలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారని అందువలన ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చింది. అది కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి. గౌతమీ నది తీరాన ఉన్న సుప్రసిద్దమైన క్షేత్రం ఇది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఉన్న మురమళ్ళ గ్రామం లో వెలసిన వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది. భద్ర ఖాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఇది. ప్రతి రోజు ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది.

మురమళ్ళ సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం

మురమళ్ళ సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం

కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురం అయినప్పటికీ కోనసీమలో మురమళ్ళ ప్రాంతానికి ఉన్న పర్యాటక ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడే రాష్టస్థ్రాయి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీర ప్రాంతంలో గల మురమళ్ళ సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం, ఆహ్లాదకరమైన కొబ్బరి తోటలు, మడ అడవులు, గోదావరి లంకలు, వాగులు, వంకలతో కళకళలాడుతూ ఉంటుంది.

PC: Shrikanth Kurminaidu

ర్యాలీ:

ర్యాలీ:

ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం చాలా ప్రసిధ్దిగాంచింది. ఘంటచోళ మహారాజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఇక్కడ భగవంతుడి విగ్రహం ముందునుంచి విష్ణుమూర్తిగా, వెనకనుంచి మోహిని ఆకారంలో వుంటుంది. అద్భుతమైన శిల్ప కళా సౌందర్యానికి ఈ స్వామి మూర్తి పెట్టింది పేరు. ఈ క్షేత్రం రావులపాలెంకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

గోదావరి అందాలు గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు

గోదావరి అందాలు గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు

గోదావరి అందాలు గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు ప్రజారవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

PC: sasi_biotech

అమాలపురం సందర్శించడానికి ఉత్తమ సమయం:

అమాలపురం సందర్శించడానికి ఉత్తమ సమయం:

శీతాకాలంలో అమలాపురం అందాలు అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా డిసెంబర్ నుండి మే వరకు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత 20°C to 25°C.

అమలాపురం చేరుకోవటం ఎలా ?

అమలాపురం చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం : కోనసీమ చేరుకోవటానికి సమీపాన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు. అమలాపురంకు సుమారు 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్ పోర్ట్ నుండి ఫ్రీక్వెంట్ క్యాబ్ సర్వీసులున్నాయి.

రైలు మార్గం : అమలాపురంకు నేరుగా రైల్వేష్టేషన్ లేదు. కానీ 31 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు జంక్షన్ ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు ఉన్నాయి. కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, కోటిపల్లి, గంగవరం, పాలకొల్లు, నరసాపూర్ రైల్వే స్టేషన్ లు కలవు.
చిత్ర కృప : Kartik Kumar S

బస్సు / రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు కలవు. ఇండియాలోని ప్రధాన నగరాల నుండి రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కోనసీమప్రాంతాలకు ఆర్డినరీ బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.
చిత్ర కృప : మన కోనసీమ అందాలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X