శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు ఈ ప్రాంతం సొంతం..!
రాజస్థాన్ అనగానే మన మదిలో అద్భుతమైన రాజభవనాలు మెదులుతాయి. చిన్నప్పుడు చదువుకొన్న చరిత్ర పాఠాలు, రాజుల విజయగాథలు, రాజపుత్ర స్త్రీల సాహసకృత్యాలు గుర్తొస్తాయి. నాటి రాజుల కళాభిరుచికి, శిల్పుల నైపుణ్యానికీ నిలువెత్తు సాక్ష్యాల్లా అక్కడి రాజభవనాలు దర్శనమిస్తాయి. 'భారతదేశ చరిత్రపట్ల, సంస్కృతిపట్ల మక్కువ ఎక్కువ' అని చెప్పేవారెవరైనా సరే రాజస్థాన్ అందాలు వీక్షించాల్సిందే. చరిత్రలో చదివిన రాజపుత్రవీరుల వీర చరితలకు నిదర్శనాలైన అక్కడి కోటలు, కట్టడాల అందాలను ఆస్వాదించాల్సిందే. వర్షకాలంలో రాజస్థాన్లో సందర్శించేందుకు కొన్ని ఉత్తమమైన ప్రదేశాలు ఉన్నాయి. అవెంటో చూద్దాం రండి..
పింక్సిటి..
జైపూర్ గులాబి నగరంగా పేరొందింది. అదేనండీ 'పింక్ సిటీ'. ఇది మన దేశంలోకల్లా అత్యంత అందమైన నగరాల్లో ఒకటి. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షించేది సిటీ ప్యాలెస్. ఇక్కడి ఆకాశాన్నంటే రాజభవనాలను చూస్తుంటే పర్యాటకులు కనురెప్ప వేయడం కూడా మర్చిపోతారు. నాటి రాజుల దర్పానికి నిలువెత్తు నిదర్శనాలివి. వాటి అందాలు చూసి తీరాల్సిందే అనేలా ఉంటాయి.

బన్స్వారా
బన్స్వారాను వంద దీవుల నగరం అని కూడా పిలుస్తారు. రాజస్థాన్లోని ఈ ప్రాంతం వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. సరస్సులు, పచ్చదనం, పర్వతాల ఆకర్షణ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు నెలలో ఇక్కడి పచ్చదనాన్ని మాటల్లో వర్ణించలేం. నదిపై ఉన్న భారీ మహి డ్యామ్ వర్షాకాలంలో ఆసక్తికరంగా కనిపిస్తుంది. బన్స్వారాకు సమీప ప్రధాన నగరం ఉదయపూర్. ఇది 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. బన్స్వారా పట్టణానికి న్యూఢిల్లీ 827 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబైకి 710 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అమెర్ కోట (అంబర్ కోట)
భారతదేశంలోని అత్యంత అద్భుతమైన రాజభవనాలలో ఒకటి ఈ కోట. జైపూర్ నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెర్ కోట, రాజస్థాన్లోని అత్యంత ప్రసిద్ధ కోటలలో ఒకటి. దీనిని అంబర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఆకట్టుకునే వాస్తుశిల్పం, గొప్ప చరిత్ర, అద్భుతమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. గేట్లు, దేవాలయాలు, రాజభవనాలు, ఇతర నిర్మాణాలతో ఈ కోట హిందూ నిర్మాణ నేపథ్యంపై నిర్మించబడింది. కోట లోపల నీటిని అందించడానికి, సమీపంలో మావోటా సరస్సు ఉంది. ఈ కోట నిర్మాణంలో పాలరాయి, ఎర్ర ఇసుకరాయి వంటిని ఉపయోగించారు. దేవాలయాలు, ఉద్యానవనాలు ఉన్నందున ఈ కోటను అమెర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు . రాజపుత్ర రాజుల భార్యలు ఈ రాజభవనంలో నివసించేవారు.
నహర్ఘర్ కోట
ఆరావళి కొండల భూభాగంలో ఉన్న ఈ కోటను టైగర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ కోటను 1734వ సంవత్సరంలో మహారాజా సవాయి జై సింగ్ II నిర్మించారు. ఈ భవనం తొమ్మిది అపార్ట్మెంట్లుగా విభజించబడింది. ప్రతి అపార్ట్మెంట్లో వరుసగా బెడ్రూమ్, కిచెన్, లాబీ, స్టోర్, టాయిలెట్ ఉన్నాయి. కోటలో ఒక ఓపెన్ ఎయిర్ ఎన్క్లోజర్ ఉంది. దీనికి దివాన్-ఐ-ఆమ్ అని పేర్లు ఉన్నాయి.

మౌంట్ అబూ
ఆరావళీ పర్వత శ్రేణులలో అందమైన రాణిలాగా వెలిగిపోతుండే "మౌంట్ అబూ" చిరునవ్వుతో సుస్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ప్రకృతి గీసిన చిత్రాలనే కాకుండా, పరవశింపజేసే ఆలయాలను సైతం తనలో ఇముడ్చుకున్న మౌంట్ అబూలో రాజస్థాన్ హస్తకళల అందాలకూ కొదవేలేదు. పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలోని ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న హిల్ స్టేషనే మౌంట్ అబూ. ఈ పర్వతం 22 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్లు వెడల్పులో ఉంటుంది.



Click it and Unblock the Notifications













