భక్తులకు బిగ్ అలర్ట్! శివమొగ్గ - తిరుపతి మధ్య కొత్త వందే భారత్ రైలును ప్రారంభించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతాన్ని బెంగళూరు మీదుగా తిరుపతితో వేగంగా అనుసంధానించేలా ఈ సర్వీస్ను డిజైన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉంది. ఇంతకీ ఈ రైలు ఏ రూట్లో వెళ్తుంది? ఏయే స్టేషన్లలో ఆగుతుంది? దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వందే భారత్ రైలు శివమొగ్గ టౌన్ నుంచి బయల్దేరి బెంగళూరు, బంగారపేట, జోలార్పేటై, కాట్పాడి, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుద్దీకరించిన ప్రధాన రైల్వే లైన్లు అందుబాటులో ఉండటంతో ఈ రైలు చాలా వేగంగా ప్రయాణిస్తుంది. రైళ్లు మారే తిప్పలు లేకుండా, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇది భక్తులకు, కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పండుగల సమయంలో రద్దీని తట్టుకోవడానికి ఇది సరైన ఆప్షన్ కానుంది.

శివమొగ్గ-తిరుపతి వందే భారత్: సాధ్యమయ్యే రూట్, స్టాప్లు ఇవే..
ఈ రైలు హాల్టింగ్ స్టేషన్లపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, రూట్ మ్యాప్పై ఒక స్పష్టత ఉంది. బెంగళూరులోని యశ్వంతపూర్ లేదా సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ ప్రధాన జంక్షన్గా వ్యవహరిస్తుంది. బంగారపేట వల్ల కోలార్ ప్రాంత వాసులకు, జోలార్పేటై ద్వారా పశ్చిమ తమిళనాడుకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక ప్రసిద్ధ వెల్లూరు ఆసుపత్రికి వెళ్లే ప్రయాణికులకు కాట్పాడి, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి రేణిగుంట స్టాప్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నిర్ణీత హాల్ట్ల వల్ల రైలు వేగం తగ్గకుండానే, ఎక్కువ మంది ప్రయాణికులకు మేలు జరుగుతుంది.
శివమొగ్గ-తిరుపతి వందే భారత్: బుకింగ్స్, అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి?
ట్రయల్ రన్స్, తాత్కాలిక స్టాప్ల జాబితా, రైలు నంబర్ల సమాచారం కోసం సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR), సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) విడుదల చేసే ప్రకటనలను గమనిస్తూ ఉండండి. సాధారణంగా ఐఆర్సిటిసి (IRCTC)లో రిజర్వేషన్లు ప్రారంభమయ్యే ముందే రైల్వే శాఖ టైమ్టేబుల్ నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. ఎన్టిఇఎస్ (NTES) యాప్, స్టేషన్ సర్క్యులర్ల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే, వారంలో రద్దీ తక్కువగా ఉండే రోజులను ఎంచుకోవడం మంచిది. పండుగల సమయంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మేలు.
వందే భారత్ వచ్చే వరకు తిరుపతి భక్తులకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఇవే..
ఈ కొత్త వందే భారత్ సర్వీస్ ప్రారంభమయ్యే వరకు ప్రయాణికులు ఇతర మార్గాలను ఎంచుకోవచ్చు. ఉదయాన్నే శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే వారికి బెంగళూరు-తిరుపతి ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్ రైళ్లు అనువుగా ఉంటాయి. తెలంగాణ నుంచి వెళ్లే భక్తులు సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును వినియోగించుకోవచ్చు. ఇక మల్నాడ్ ప్రాంతవాసులు రాత్రికి బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి ఉదయాన్నే తిరుపతికి ప్రయాణిస్తే ఇబ్బంది ఉండదు. రైళ్లలో వెయిటింగ్లిస్ట్ ఎక్కువగా ఉంటే, సమీపంలోని ఇతర స్టేషన్ల నుంచి టికెట్లు ప్రయత్నించడం లేదా అత్యవసర పరిస్థితిల్లో నైట్ బస్సులను ఆప్షన్గా ఎంచుకోవడం మంచిది.
తిరుపతి చేరుకున్నాక ప్రయాణం సాఫీగా సాగేందుకు చిట్కాలు
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి లేదా శ్రీవారి మెట్టుకు వెళ్లేందుకు ఆటోలు లేదా ప్రీపెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, లడ్డూలను ముందుగానే బుక్ చేసుకోవడం శ్రేయస్కరం. పండుగలు, వారాంతాల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తక్కువ లగేజీతో ప్రయాణించడం, స్టేషన్లోని క్లోక్రూమ్లను వాడుకోవడం మంచిది. ఉదయాన్నే తిరుపతికి చేరుకోవడం వల్ల క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పనిండదు. అంతేకాకుండా తిరుగు ప్రయాణానికి రైళ్లను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











